
కాన్బెర్రా: ఆస్ట్రేలియాతో జరుగుతున్న నామమాత్రపు మూడో వన్డేలో టాస్ గెలిచిన భారత జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్కు అనువైన పిచ్ కావడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తెలిపాడు. ఈ మ్యాచ్కు భారత్ నాలుగు మార్పులు చేసింది.
ఐపీఎల్లో తనదైన యార్కర్లతో అందరి దృష్టిని ఆకర్షించిన టీ నటరాజన్ ఈ మ్యాచ్తో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేస్తున్నాడు. సైనీ స్థానంలో అతనికి తుది జట్టులో చోటు కల్పించారు. మ్యాచ్కు ముందు కెప్టెన్ విరాట్ కోహ్లీ చేతుల మీదుగా నట్టూ టీమిండియా 232వ వన్డే క్యాప్ అందుకున్నాడు.
ఇక గత రెండు మ్యాచ్ల్లో విఫలమైన చాహల్, షమీ స్థానాల్లో శార్దుల్ ఠాకుర్, కుల్దీప్ యాదవ్ జట్టులోకి వచ్చారు. ఓపెనర్గా విఫలమైన మయాంక్ అగర్వాల్పై కూడా టీమ్ మేనేజ్మెంట్ వేటు వేసింది. అతని స్థానంలో శుభ్మన్గిల్కు అవకాశం కల్పించింది.
ఇక ఆస్ట్రేలియా జట్టులో కూడా మార్పులు చోటు చేసుకున్నాయి. గాయంతో దూరమైన ఆ జట్టు స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ స్థానంలో గ్రీన్ అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేస్తున్నాడు. స్టార్క్ గాయంతో దూరమవ్వగా.. కమిన్స్కు విశ్రాంతినిచ్చారు. దాంతో సీన్ అబాట్, అష్టోన్ అగర్ తుది జట్టులోకి వచ్చారు. వార్నర్ గైర్హాజరీ నేపథ్యంలో లబుషేన్ తాను ఇన్నింగ్స్ ప్రారంభిస్తామని ఆసీస్ కెప్టెన్ ఫించ్ తెలిపాడు.
ఆస్టేలియా పర్యటనలో రెండు వరుస పరాజయాలతో దెబ్బ తిన్న భారత జట్టు సిరీస్లో ఒక్క మ్యాచ్ అయినా గెలిచి పరువు దక్కించుకోవాలని భావిస్తుండగా.. క్లీన్ స్వీప్ చేసి ప్రత్యర్థి దెబ్బతీయాలనే వ్యూహంతో ఆసీస్ బరిలోకి దిగుతోంది.
తుది జట్లు:
భారత్: విరాట్ కోహ్లి (కెప్టెన్), శిఖర్ ధావన్, శుభ్మన్ గిల్, అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దుల్ ఠాకుర్, బుమ్రా, నటరాజన్, కుల్దీప్ యాదవ్.
ఆ్రస్టేలియా: ఆరోన్ ఫించ్ (కెప్టెన్), మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్, మ్యాక్స్వెల్, హెన్రిక్స్, అలెక్స్ క్యారీ, కామెరాన్ గ్రీన్, అష్టోన్ అగర్, సీన్ అబాట్, ఆడమ్ జంపా, హాజల్వుడ్.