తుది జట్టు కూర్పు ఎలా?
గాయాలతో రవీంద్ర జడేజా, హనుమ విహారి చివరి టెస్టుకు దూరమైనట్లు బీసీసీఐ అధికారికంగా ప్రకటించేసింది. అయితే ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా విషయంలో మాత్రం ఇంకా పూర్తి స్పష్టతనివ్వలేదు. పొత్తి కడుపులో కండరాల గాయంతో బాధపడుతున్న బుమ్రా 100 శాతం ఫిట్గా లేడనేది వాస్తవం. బుధవారం భారత జట్టు ప్రాక్టీస్ సెషన్లో పాల్గొనగా...బుమ్రా మాత్రం బౌలింగ్ చేయలేదు.
అయితే బుమ్రా కూడా లేకపోతే పేస్ బౌలింగ్ మరీ పేలవంగా మారిపోయే అవకాశం ఉండటంతో పూర్తి ఫిట్గా లేకపోయినా అతడిని ఆడిస్తారా అనేది చూడాలి. వెన్నునొప్పితో బాధపడుతున్న అశ్విన్ పూర్తిగా కోలుకోవాలని టీమ్మేనేజ్మెంట్ కోరుకుంటోంది. విహారి స్థానంలో మయాంక్ తుది జట్టులోకి రావడం దాదాపు ఖాయం. అయితే అతను మిడిలార్డర్లో కాకుండా రోహిత్తో కలిసి ఓపెనర్గానే ఆడితే మిగతా బ్యాట్స్మెన్ ఒక్కో స్థానం దిగువన ఆడవచ్చు.
నలుగురు పేసర్లు..
జడేజా స్థానంలో కుల్దీప్ యాదవ్ రావచ్చు. అయితే బ్రిస్బేన్ పిచ్ను దృష్టిలో ఉంచుకొని అశ్విన్ రూపంలో ఒకే స్పిన్నర్ను ఆడించి నాలుగో పేసర్ను తీసుకుంటే మాత్రం శార్దుల్ ఠాకూర్కు అవకాశం ఉంది. బుమ్రా చివరి నిమిషంలో తప్పుకుంటే నటరాజన్ అరంగేట్రం చేస్తాడు. బ్యాటింగ్లో రహానే, పుజారాలపై ప్రధాన భారం ఉంది. వీరిద్దరు నిలబడితే భారీ స్కోరుకు అవకాశం ఉంటుంది. రోహిత్, గిల్ కూడా రాణిస్తే ప్రత్యర్థిపై ఆధిపత్యం ప్రదర్శించవచ్చు. గత రికార్డుల ప్రకారం ఇది భారత్కు అచ్చి రాని మైదానమే అయినా... ఎన్నో ఇలాంటి అసాధ్యమైన ఘనతలను ఇటీవల టీమిండియా తిరగరాస్తూ వచ్చింది. అత్యుత్తమ ప్రదర్శన ఇస్తే ఇది కూడా ఆ జాబితాలో చేరుతుంది.
ఆసీస్ వ్యూహం ఏంటో..?
సిడ్నీలో గెలవాల్సిన మ్యాచ్ను డ్రా చేసుకొని తీవ్ర ఒత్తిడిలో ఉన్న ఆసీస్.. పెద్దగా మార్పుల్లేకుండానే ఈ మ్యాచ్ బరిలోకి దిగనుంది. మేటి ఆటగాళ్లంతా అందుబాటులో ఉండడంతోపాటు గాబాలో తమకు ఘనమైన రికార్డుండడం కంగారూలకు అదనపు బలం. కమిన్స్, స్టార్క్, హాజెల్వుడ్, లియాన్తో బౌలింగ్ విభాగం పటిష్ఠంగా ఉంది. బ్యాటింగ్పరంగా ఓపెనర్ పుకోవ్స్కీ గాయపడడంతో అతడి స్థానంలో హారి్సకు చోటుదక్కే అవకాశ ఉంది. లబుషేన్, స్మిత్ మంచి ఫామ్లో ఉండగా.. ఆల్రౌండర్గా గ్రీన్ రాణిస్తున్నాడు. ఆసీస్ సారథి పెయిన్ సత్తా చాటాల్సి ఉంది. అమిత భారం మోస్తున్న ముగ్గురు ప్రధాన పేసర్లలో ఒకరు టెస్టుకు ముందు తప్పుకునే ప్రమాదం కూడా ఉందని వినిపిస్తోంది. అదే జరిగితే ఆసీస్ మరింత బలహీనంగా మారిపోతుంది. 'గాబా' మైదానంలో 1988నుంచి ఓటమి ఎరుగని ఆస్ట్రేలియా రికార్డు కొనసాగిస్తుందా లేదా రహానే సేన ముందు తలవంచుతుందా చూడాలి!
పిచ్
గాబా వికెట్లో బౌన్స్ ఎక్కువగా ఉండడంతో పేసర్లకు అదనపు ప్రయోజనం. అయితే, ఈ పిచ్ కొంతమేర స్పిన్నర్లకు కూడా సహకరించే అవకాశం ఉంది. ఈ మ్యాచ్ ఉదయం 5 గంటల నుంచి సోనీ సిక్స్లో ప్రత్యక్ష ప్రసారం కానుంది.
తుది జట్లు (అంచనా)
భారత్: రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, చతేశ్వర్ పుజారా, అజింక్యా రహానే (కెప్టెన్), రిషభ్ పంత్, మయాంక్/పృథ్వీషా/ వృద్దిమాన్ సాహా (వికెట్ కీపర్), వాష్టింగ్టన్ సుందర్, అశ్విన్/కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, నవ్దీప్ సైనీ, నటరాజన్.
ఆస్ట్రేలియా: వార్నర్, పుకోవ్స్కీ /మార్కస్ హారిస్, లబుషేన్, స్టీవ్ స్మిత్, మాథ్యూ వేడ్, కామెరూన్ గ్రీన్, టిమ్ పెయిన్ (కెప్టెన్), కమిన్స్, స్టార్క్, లియాన్, హాజెల్వుడ్.