'2021 వన్డే ప్రపంచకప్ చివరి టోర్నీ:
ఆదివారం మిథాలీ రాజ్ మాట్లాడుతూ... '2021 వన్డే ప్రపంచకప్ నాకు చివరి టోర్నీ కానుంది. సుదీర్ఘ కెరీర్ను ముగించాలనుకుంటున్నా. 2021లో టీమిండియానే టైటిల్ను గెలుస్తుందని భావిస్తున్నా. ఒకవేళ అదే జరిగితే.. భారత్లో మహిళల క్రికెట్ అభివృద్ధికి గొప్ప మలుపు అవుతుంది. ఎందరో అమ్మాయిలు క్రికెట్ను కెరీర్గా ఎంచుకునేందుకు స్ఫూర్తిగా నిలుస్తుంది. 2017 ప్రపంచకప్ ఫైనల్ ప్రభావం మనం ఇప్పుడు చూస్తున్నాం' అని మిథాలీ అన్నారు.
చాలా మార్పులు వచ్చాయి:
తాను అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టినప్పటితో పోలిస్తే ఇప్పుడు మహిళా క్రికెటర్లకు మంచి అవకాశాలు అందుబాటులోకి వచ్చాయని మిథాలీ రాజ్ అభిప్రాయపడ్డారు. 'మహిళల క్రికెట్లో చాలా మార్పులు వచ్చాయి. నేను అంతర్జాతీయ అరంగేట్రం చేసిన సమయంలో విదేశీ పర్యటనల సమయంలో ఆట గురించి చాలా నేర్చుకున్నా. కానీ ఇప్పుడు షెఫాలీ వర్మ లాంటి యువ క్రీడాకారిణిలకు అరంగేట్రానికి ముందే అంతర్జాతీయ అనుభవం ఉంటుంది. దేశవాళీ టోర్నీలు, చాలెంజర్ ట్రోఫీలు ఆడటం ద్వారా వారు చాలా నేర్చుకుంటున్నారు. మాకు అప్పుడు జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) శిబిరాల గురించి కూడా అవగాహన ఉండేది కాదు. ఇప్పుడు మహిళా క్రికెటర్లకు సెంట్రల్ కాంట్రాక్టులు కూడా దక్కుతున్నాయి. ఆదాయం పెరగడంతో కేవలం ఆటపై దృష్టి సారించేందుకు ఇది ఉపయోగపడుతోంది' అని వన్డే కెప్టెన్ చెప్పుకొచ్చారు.
చాలా నిరాశ చెందా:
'నేను, జులన్ గోస్వామి కలిసి చాలా ఏళ్లు టీమిండియాకు ఆడాం. 4-5 ప్రపంచకప్ టోర్నీల్లో బరిలోకి దిగాం. అయినా ఒక్క ఐసీసీ ట్రోఫీని కైవసం చేసుకోలేకపోయాం. ఇది నిజంగా చాలా బాధిస్తున్నది. 2021 ప్రపంచకప్లో మరింత అత్యుత్తమ ప్రదర్శన చేయాలనుకుంటున్నా. అందుకోసం కష్టపడుతున్నా. ఇద్దరం ఫిట్నెస్పై ఎక్కువ పని చేయాల్సి ఉంటుంది' అని మిథాలీ చెప్పారు. కరోనా సమయాన్ని ఉపయోగించుకుంటా.. 2017లో కంటే చురుగ్గా ఉంటానని ధీమా వ్యక్తం చేసారు.
16 ఏళ్ల వయసులో అరంగేట్రం
16 ఏళ్ల వయసులో 1999లో వన్డేల్లో అరంగేట్రం చేసిన మిథాలీ.. ఐర్లాండ్తో జరిగిన తొలి మ్యాచ్లోనే సెంచరీ చేసారు. ఇక 19 ఏళ్ల వయసులో ఇంగ్లాండ్తో జరిగిన టెస్టు మ్యాచ్లో 214 పరుగులు చేసి టెస్టుల్లో రెండో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్గా అరుదైన గుర్తింపు సాధించారు. 18 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్ కెరీర్లో మిథాలీ ఎన్నో రికార్డులను బద్దలు కొట్టారు. ఇక వన్డేల్లో వరుసగా ఏడు అర్ధ సెంచరీలు చేసిన తొలి క్రికెటర్గా రికార్డు సృష్టించారు. వన్డే అరంగేట్రం చేసిన తర్వాత వరుసగా 15 ఏళ్లు పాటు మిథాలీ యావరేజి 40కి పైగా ఉండటం విశేషం. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కూడా సరిగ్గా ఇన్నేళ్ల పాటు 40కి పైగా యావరేజితో పరుగులు చేసారు.
వన్డే క్రికెట్లో అత్యధిక పరుగులు:
అంతర్జాతీయ మహిళల క్రికెట్లో మిథాలీ రాజ్ అనేక రికార్డులను సృష్టించారు. మహిళల వన్డే క్రికెట్లో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్గా మిథాలీ చరిత్ర సృష్టించారు. మిథాలీ భారత్ తరఫున 10 టెస్టులు, 209 వన్డేలు, 89 టీ20లు ఆడారు. టెస్టులలో 663, వన్డేలలో 6888, టీ20లలో 2364 పరుగులు చేసారు.