సూర్యకు దక్కని చోటు
ఓపెనర్లు రోహిత్ శర్మ, లోకేష్ రాహుల్ శుభారంభాలతో గట్టి పునాదులు వేస్తున్నారు. క్రీజులో కుదురుకునే వరకు ఓపిగ్గా ఆడి.. ఆ తర్వాత గేర్ మార్చుతున్నారు. లార్డ్స్ టెస్టులో ఈ ఇద్దరూ 100కు పైగా భాగస్వామ్యం నెలకొల్పిన విషయం తెలిసిందే. మూడో టెస్టులో కూడా ఓపెనింగ్ జోడి మంచి ఆరంభం ఇవ్వాలని జట్టు మేనేజ్మెంట్ కోరుకుంటుంది.
ఇటీవలి కాలంలో ఫామ్ కొల్పోయిన టెస్ట్ స్పెసలిస్ట్ బ్యాట్స్మన్లు చేతేశ్వర్ పుజారా, అజింక్య రహానేలు గాడిలో పడ్డారు. రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్లో పుజారా, రహానేలు 50 ఓవర్లు బ్యాటింగ్ చేసి మళ్లీ లయ అందుకున్నారు. దీంతో లంక పర్యటన నుంచి వచ్చిన సూర్యకుమార్ యాదవ్కు జట్టులో చోటు లేకుండా పోయింది.
అశ్విన్కు మరోసారి నిరాశే
కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా మూడో టెస్టులో భారీ ఇన్నింగ్స్ ఆడితే ఆతిథ్య జట్టుకు కష్టాలు తప్పవు. కోహ్లీ కూడా రెండో టెస్ట్ ద్వారా ఫామ్ అందుకున్నాడు. వికెట్ కీపర్ రిషబ్ పంత్ మాత్రం ఓ భారీ ఇన్నింగ్స్ బాకీ ఉన్నాడు. అతడు కూడా పరుగులు చేస్తే.. భారత్ భారీ స్కోర్ చేస్తోంది.
ఇక నలుగురు పేసర్లు, ఒక స్పిన్నర్ ఫార్ములాతోనే కెప్టెన్ విరాట్ కోహ్లీ మూడో టెస్టులో బరిలోకి దిగనున్నాడని సమాచారం. బ్యాటింగ్ చేయగల రవీంద్ర జడేజా వైపే కెప్టెన్ మొగ్గుచూపుతున్నాడట. దీంతో వెటరన్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్కు మరోసారి నిరాశే ఎదురుకానుంది. మూడో టెస్ట్ ఆడుతానని చెప్పుకున్న అశ్విన్.. మరోసారి ఏం వివరణ ఇస్తాడో చూడాలి.
అదే పేస్ విభాగంతో
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మూడో టెస్ట్ కోసం పేస్ విభాగంలో ఎలాంటి మార్పులు చేసే అవకాశం లేదట. మొహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, మొహ్మద్ సిరాజ్, ఇషాంత్ శర్మలనే కొనసాగించనున్నాడట. దీంతో ఫిట్నెస్ సాధించిన ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్ మూడో టెస్టులో ఆడే అవకాశం లేకుండా పోయింది.
జడేజా వీలైనన్ని పరుగులు చేయాలని కోహ్లీసేన కోరుకుంటోంది. ఇక టెయిలెండర్లలో బుమ్రా, షమీ ఎలాంటి పరుగులు చేశారో అందరికీ తెలిసిందే. వారి భాగస్వామ్యంతో భారత్ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. బౌలింగ్లోనూ ప్రతి ఒక్కరు వికెట్లు తీస్తుండటంతో భారత్ ఆనందంలో ఉంది.
IND vs ENG: అందరికంటే నేనే బుద్ధిమంతుడుని అన్న పంత్.. ఆటాడుకున్న టీమిండియా ప్లేయర్స్!!
బర్న్స్కు జతగా హసీబ్ హమీద్
మరోవైపు ఇంగ్లండ్ జట్టులో కెప్టెన్ జో రూట్ మినహా పెద్దగా ఎవరూ బ్యాటింగ్ చేయలేకపోతున్నారు. ఓపెనర్లు డోమ్ సిబ్లీ, రోరీ బర్న్స్ శుభారంభాలు ఇవ్వలేక విఫలమవుతున్నారు. దీంతో మూడో టెస్టుకు సిబ్లీని తొలగించి జట్టు యాజమాన్యం డేవిడ్ మలన్ను తుది జట్టులోకి తీసుకుంది. బర్న్స్కు జతగా హసీబ్ హమీద్ ఇన్నింగ్స్ ప్రారంభించనున్నాడు.
ఆ తర్వాత ఫస్ట్ డౌన్లో మలాన్ బ్యాటింగ్ చేయనున్నాడు. ఇక ఆతిథ్య జట్టులో ఎవరైనా నిలకడగా పరుగులు చేస్తున్నారా అంటే.. అది రూట్ ఒక్కడే. అతడిని ఎంత త్వరగా ఔట్ చేస్తే టీమిండియాకు అంత మంచి అవకాశం లభించినట్లే.
వుడ్ స్థానంలో సకీబ్ మహ్మూద్
మిడిల్ ఆర్డర్లో జానీ బెయిర్స్టో, జోస్ బట్లర్ పరుగులు చేసేందుకు ప్రయత్నిస్తున్నా పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నారు. అనుభవజ్ఞులైన వీరిద్దరు భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోతున్నారు. వీరు పరుగులు చేయాల్సిన అవసరం ఉంది. ఇక ఆల్రౌండర్లుగా మంచి పేరున్న మొయిన్ అలీ, ఓలి రాబిన్సన్, సామ్ కరన్ సైతం విఫలమవుతున్నారు.
వీరు బంతితో వికెట్లు తీస్తున్నా.. బ్యాట్తో పరుగులు సాధించలేకపోతున్నారు. మరోవైపు రెండో టెస్టులో ఐదు వికెట్లతో ఆకట్టుకున్న మార్క్ వుడ్ గాయం కారణంగా మూడో మ్యాచ్కు దూరమయ్యాడు. అతడి స్థానంలో సకీబ్ మహ్మూద్ ఆడనున్నాడు. ప్రధాన పేసర్ జేమ్స్ అండర్సన్ ఒక్కడే భారత బ్యాట్స్మెన్ను ఇబ్బంది పెడుతున్నాడు.
తుది జట్లు (అంచనా)
భారత్: రోహిత్ శర్మ, లోకేష్ రాహుల్, చేతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ (కెప్టెన్), అజింక్య రహానే, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, మొహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, మొహ్మద్ సిరాజ్, ఇషాంత్ శర్మ.
ఇంగ్లండ్: రోరీ బర్న్స్, హసీబ్ హమీద్, డేవిడ్ మలాన్, జో రూట్ (కెప్టెన్), జానీ బెయిరిస్టో, జోస్ బట్లర్ (వికెట్ కీపర్), మొయిన్ అలీ, సామ్ కరన్, ఓలీ రాబిన్సన్, సకీబ్ మహమూద్, జేమ్స్ అండర్సన్.