న్యూఢిల్లీ: దేశంలో కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తుంది. ఈ ప్రాణాంతక వైరస్ కారణంగా ఎప్పుడు ఏ చెడు వార్త వినాల్సి వస్తుందోననే భయంతో ప్రజలంతా వణికిపోతున్నారు.
సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఎందరినో ఈ గత్తర పొట్టనపెట్టుకుంది. భారత క్రికెటర్లకు సైతం ఈ మహమ్మారి తీరని నష్టం మిగిల్చింది.
ఇటీవలే భారత మాజీ క్రికెటర్లు ఆర్పీ సింగ్, వెటరన్ ప్లేయర్ పీయూష్ చావ్లాలు తమ తండ్రులను కోల్పోగా.. టీమిండియా మహిళా క్రికెటర్ వేదా కృష్ణమూర్తి రెండు వారాల వ్యవధిలో సోదరి, తల్లిని కోల్పోయింది. తాజాగా మరో భారత మహిళా క్రికెటర్ ఇంట్లో విషాదం నెలకొంది. టీమిండియా మహిళా ఓపెనర్ ప్రియా పూనియా తల్లి కరోనా వైరస్తో పోరాడుతూ తుది శ్వాస విడిచింది.
ఈ విషయాన్ని పూనియానే తన ఇన్స్టాగ్రామ్ వేదికగా తెలియజేస్తూ భావోద్వేగానికి గురైంది. 'అమ్మా.. నువ్వు నన్ను పదే పదే ఎందుకు ధైర్యంగా ఉండమనేదానివో ఇప్పుడే అర్థమైంది. నా జీవితంలో ఇలాంటి రోజు ఒకటుంటుందనే నువ్వు ముందే గ్రహించావు. నాకు నువ్వు దూరమైతావని, దాన్ని తట్టుకునే శక్తి నాకుండాలని అలా చెప్పేదానివని అర్థమైంది.
ఐ మిస్ యూ అమ్మా..
నువ్వు నా మార్గదర్శి... నేను తీసుకునే ప్రతి స్టెప్ వెనుక నువ్వు ఉన్నావు. కానీ ఈరోజు మమ్మల్ని భౌతికంగా విడిచిపెట్టి వెళ్లావంటే నమ్మబుద్ధి కావడం లేదు. కానీ నువ్వు లేవన్న నిజాన్ని ఒప్పుకొని ముందుకు సాగాల్సిందే. నీతో గడిపిన క్షణాలు ఎప్పటికీ మరిచిపోను అమ్మా.. నీ ఆత్మకు శాంతి కలగాలి. లవ్యూ అమ్మా.! ఇది చాలా డేంజరస్ వైరస్. దయచేసి అందరు ఇంట్లోనే ఉంటండి. భౌతికదూరం పాటిస్తూ మాస్కులు ధరించండి. ధైర్యంగా ఉండండి'అని ప్రియా పునియా రాసుకొచ్చింది.
ఈ పోస్ట్లో తన తల్లితో పాటు ఫ్యామిలీతో ఫోటోలను పంచుకుంది. 2019లో టీమిండియాకు అరంగేట్రం చేసిన ప్రియా పూనియా ఇప్పటివరకు 7 వన్డేలు.. మూడు టీ20లు ఆడింది. త్వరలో ఇంగ్లండ్తో జరగనున్న టెస్టు సిరీస్కు పూనియా ఎంపికైంది. ప్రియా పునియా తన ఆటతీరుతో పెద్దగా ఆకట్టుకోలేకపోయినా.. మైదానంలో తన హవాభావాలతో అభిమానుల సంపాదించుకుంది.