ఈస్ట్ లండన్: సౌతాఫ్రికా గడ్డపై భారత మహిళల జైత్ర యాత్రకు బ్రేక్పడింది. టీ20 ప్రపంచకప్ 2023 ముందు సన్నాహకంగా సాగిన ట్రై సిరీస్లో వరుస విజయాలతో జోరు కనబర్చిన హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత జట్టు.. కీలక ఫైనల్లో మాత్రం చేతులెత్తేసింది. సౌతాఫ్రికాతో గురువారం జరిగిన ఫైనల్లో 5 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. దాంతో వెస్టీండీస్, భారత్తో జరిగిన ట్రై సిరీస్ టైటిల్ ఆతిథ్య సౌతాఫ్రికా వశమైంది.
లీగ్ దశలో నాలుగు మ్యాచ్లకు భారత్ 3 గెలవగా మరో మ్యాచ్ ఫలితం తేలకుండా ముగిసింది. సౌతాఫ్రికా నాలుగింటిలో ఒకటి మాత్రమే గెలవగా.. మరో మ్యాచ్ ఫలితం తేలలేదు. వెస్టిండీస్ మాత్రం నాలుగు మ్యాచ్లకు నాలుగు ఓడిపోయింది. దాంతో భారత్, సౌతాఫ్రికా ఫైనల్ చేరాయి. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత మహిళల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 109 పరుగులు మాత్రమే చేసింది.
ఓపెనర్లు స్మృతి మంధానా(0), జెమీమా రోడ్రిగ్స్(11) విఫలమవ్వగా.. హర్లీన్ డియోల్(46), హర్మన్ ప్రీత్ కౌర్(21) పర్వాలేదనిపించాడు. దీప్తి శర్మ(16 నాటౌట్) ధాటిగా ఆడలేకపోయింది. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోవడంతో భారత బ్యాటర్లు నిదానంగా ఆడారు. సౌతాఫ్రికా బౌలర్లలో మలాబా రెండు వికెట్లు తీయగా.. ఖాక, సునే లూస్ తలో వికెట్ తీసారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన సౌతాఫ్రికా.. క్లోయి ట్రయాన్(32 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్లతో 57 నాటౌట్) విధ్వంసకర బ్యాటింగ్తో విజయాన్నందుకుంది. నదిన్ డి క్లర్క్(17) ఆమెకు అండగా నిలిచింది. 66 పరుగులకే ఐదు వికెట్లు తీసిన భారత బౌలర్లు.. ట్రయాన్ ధాటికి తేలిపోయారు. భారత బౌలర్లలో స్నేహ్ రాణా రెండు వికెట్లు తీయగా.. రేణుకా సింగ్, రాజేశ్వరి గైక్వాడ్, దీప్తి శర్మ తలో వికెట్ తీసారు.
టీ20 ప్రపంచకప్ ముందు టీమిండియాకు ఎదురైన ఈ ఓటమి అమ్మాయిల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేదే. ఈనెల 10 నుంచే భారత మహిళల టీ20 ప్రపంచకప్ మొదలవ్వనుంది. గ్రూప్ - బీలో ఇంగ్లండ్, పాకిస్థాన్, భారత్, ఐర్లాండ్, వెస్టిండీస్లు ఉండగా... గ్రూప్-ఏలో ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, న్యూజిలాండ్, సౌతాఫ్రికా, శ్రీలంకలు ఉన్నాయి. భారత్ తమ తొలి మ్యాచ్ను పాకిస్థాన్తో ఆడనుంది. ఫిబ్రవరి 26న కేప్టౌన్ వేదికగా తుది పోరు జరగనుంది.