లండన్: ఇండియా వెటరన్ పేసర్, తన ఆటతో ఎంతో మంది యంగ్స్టర్స్ను ఇన్స్పైర్ చేసిన జులన్ గోస్వామి కెరీర్లో ఆఖరాటకు రెడీ అయింది. ఇంగ్లండ్తో మూడు వన్డేల సిరీస్లో భాగంగా లార్డ్స్లో జరుగుతున్న చివరి మ్యాచ్లో భారత మహిళల జట్టు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగింది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ మహిళల టీమ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్కు భారత్ ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగింది. ఈ మ్యాచ్తోనే జులన్ తన సుదీర్ఘ కెరీర్కు గుడ్బై చెప్పనుంది.
ఇప్పటికే తొలి రెండు వన్డేల్లో నెగ్గి సిరీస్ కైవసం చేసుకున్న ఇండియా విమెన్స్ టీమ్ ఈ పోరులోనూ గెలిచి క్లీన్స్వీప్ విక్టరీతో 'జులు దీ'గా పిలుచుకునే గోస్వామికి ఘన వీడ్కోలు పలకాలన్న కృత నిశ్చయంతో ఉంది. చార్రితక లార్డ్స్ మైదానంలో ఆఖరాటను మధురజ్ఞాపకంగా మలచుకోవాలని గోస్వామి కోరుకుంటోంది. క్రికెట్ మక్కాగా ప్రసిద్ధి చెందిన లార్డ్స్లో వీడ్కోలు పలికే అవకాశం గవాస్కర్, సచిన్, లారా, మెక్గ్రాత్ వంటి లెజెండరీ ప్లేయర్లకు దక్కలేదు. మిథాలీ రాజ్తో పాటు ఇండియా విమెన్స్కు ముఖచిత్రంగా పేరు తెచ్చుకున్న జులన్కు ఇది 204వ ఇంటర్నేషనల్ మ్యాచ్. వరల్డ్ కప్ను ముద్దాడే అవకాశం దక్కనప్పటికీ.. ఇంగ్లండ్ గడ్డపై సిరీస్ను క్లీన్స్వీప్ చేస్తే జులన్ కెరీర్కు గొప్ప ముగింపు దక్కినట్టు అవుతుంది.
ఇక తన చివరి మ్యాచ్ ప్రారంభానికి ముందు జులాన్ గోస్వామి భావోద్వేగానికి గురైంది. తన కెరీర్కు అండగా నిలిచిన బీసీసీఐ, బెంగాల్ క్రికెట్ అసోసియేషన్తో పాటు తన కుటుంబ సభ్యులు, కోచ్లకు ఆమె కృతజ్ఞతలు చెప్పింది. కెరీర్ వీడ్కోలు మ్యాచ్ ఏర్పాటు చేయడంపై కూడా జులాన్ సంతోషం వ్యక్తం చేసింది. జీవితంలో ఈ క్షణం ఎంతో మధరమైందని పేర్కొంది. 2002లో ఇంగ్లండ్ జట్టుతోనే కెరీర్ ప్రారంభించిన తాను మళ్లీ అదే జట్టుతో వీడ్కోలు మ్యాచ్ ఆడటం గొప్ప గౌరవంగా భావిస్తున్నానని తెలిపింది. ముఖ్యంగా 2-0తో సిరీస్ గెలవడం మరింత సంతోషాన్నించ్చిందని పేర్కొంది.
తుది జట్లు:
భారత్: స్మృతి మంధాన, షెఫాలీ వర్మ, యస్తికా భాటియా(కీపర్), హర్మన్ప్రీత్ కౌర్(కెప్టెన్), హర్లీన్ డియోల్, దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్, డయాలన్ హేమలత, రాజేశ్వరి గైక్వాడ్, రేణుకా సింగ్, జూలన్ గోస్వామి
ఇంగ్లండ్: టమ్మీ బామోంట్, ఎమ్మా లాంబ్, సోఫియా డంక్లీ, అలీస్ కేప్సీ, డానియల్ వ్యాట్, అమీ జోన్స్(కెప్టెన్, కీపర్), ఫ్రెయా కెంప్, సోఫీ ఎకెల్స్టోన్, చార్లీ డీన్, కేట్ క్రాస్, ఫ్రెయా డేవీస్