కర్రారా: సొంతగడ్డపై భారత మహిళలతో జరుగుతున్న మూడో టీ20లో ఆస్ట్రేలియా కెప్టెన్ మెగ్ లాన్నింగ్ హిట్ వికెట్ అయింది. భారత క్రికెట్ దిగ్గజం రాహుల్ ద్రవిడ్ మార్క్ షాట్ ఆడే ప్రయత్నం చేయగా.. ఆమె బ్యాట్ వికెట్లను తాకింది. దాంతో నిరాశగా పెవిలియన్ చేరింది. ప్రస్తుతం ఈ వికెట్కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ సందర్బంగా రాజేశ్వరి గైక్వాడ్ వేసిన ఏడో ఓవర్లో మెగా లాన్నింగ్ హిట్వికెట్గా వెనుదిరిగింది. గైక్వాడ్ వేసిన షార్ట్ లెంగ్త్ బాల్ను బ్యాక్ఫుట్లో డీప్ మిడ్ వికెట్ మీదుగా ఆడే ప్రయత్నం చేసింది. కానీ ఈ క్రమంలో వికెట్లకు దగ్గరగా వచ్చిన ఆమె బ్యాట్ వికెట్లను గిరాటేసింది. దాంతో నిరాశగా పెవిలియన్ చేరింది.
Meg Lanning Gone 😄😷#AUSvIND pic.twitter.com/ELPwOhzjqt
— Sarbeswar Dash 🕉️🦁😷 (@SarbeswarDash23) October 10, 2021
ఈ మ్యాచ్లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 149 రన్స్ చేసింది. ఆసీస్ ఓపెనర్ బెత్ మూనీ(61) హాఫ్ సెంచరీతో చెలరేగగా.. తహిలా మెక్గ్రాత్(44 నాటౌట్) చివర్లో మెరుపులు మెరిపించింది. భారత బౌలర్లలో రాజేశ్వరి గైక్వాడ్ రెండు వికెట్లు తీయగా.. పూజా వస్త్రాకర్, దీప్తి శర్మ, రేణుక సింగ్ తలో వికెట్ తీశారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన భారత అమ్మాయిలు 15 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 93 పరుగులు చేశారు. భారత్ విజయానికి ఇంకా 30 బంతుల్లో 57 పరుగులు కావాలి. క్రీజులో పూజా వస్త్రాకర్(0 బ్యాటింగ్), కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్(12 బ్యాటింగ్) ఉన్నారు. అంతకు ముందు ఓపెనర్ షెఫాలీ వర్మ(1) తీవ్రంగా నిరాశపరించింది. ఆరంభంలోనే వికెట్ పారేసుకుంది. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన జెమీమా రోడ్రిగ్స్(23)తో కలిసి మంధాన ఇన్నింగ్స్ను ముందుకు నడిపించింది. క్రీజులో పాతుకుపోయిన ఈ జోడీని వారెహమ్ విడదీసింది. దాంతో తొలి వికెట్కు నమోదైన 59 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత హర్మన్ ప్రీత్తో జత కట్టిన స్మృతి మంధాన(52) హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుంది. జోరు కనబర్చిన స్మృతిని క్యారీ ఔట్ చేసింది.
ఇరు జట్ల మధ్య జరిగిన ఫస్ట్ టీ20 వర్షం కారణంగా అర్థంతరంగా రద్దవ్వగా.. రెండో టీ20లో ఆస్ట్రేలియా 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. తాజా మూడో టీ20లో భారత్ ఓడితే సిరీస్ కోల్పోతుంది. గెలిస్తే సమం అవుతుంది. ఆస్ట్రేలియా మహిళలతో జరిగిన రెండో టీ20 మ్యాచ్లో శిఖా పాండే వేసిన స్వింగ్ బాల్ అందర్ని ఆశ్చర్యపరిచింది. ఆఫ్ స్టంప్ దిశగా వేసిన బంతి ఒక్కసారిగా టర్న్ అయి మిడిల్ స్టంప్ను ఎగరగొట్టింది. నాగుపాములా దూసుకొచ్చిన బంతికి ఆస్ట్రేలియా బ్యాటర్ అలీసా హీలీ బిత్తరపోయింది. క్రికెట్లో ఇలాంటి బాల్స్ కూడా ఉంటాయా? అని ఆశ్చర్యపోయింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారగా.. మహిళా క్రికెట్లో బాల్ ఆఫ్ ద సెంచరీ అంటూ నెటిజన్లు శిఖాపాండేను ప్రశంసిస్తున్నారు.