ముంబై: భారత మహిళల క్రికెట్ టీమ్ పరాజయాల పరంపర కొనసాగుతోంది. వరుసగా మూడో మ్యాచ్లోనూ హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత మహిళల జట్టు ఓటమిపాలైంది. సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో ఐదు టీ20ల సిరీస్ను ఓ మ్యాచ్ మిగిలుండగానే కోల్పోయిన హర్మన్ సేన.. చివరి టీ20లోనూ విజయాన్నందుకోలేకపోయింది.
మంగళవారం జరిగిన ఆఖరి మ్యాచ్లో 54 పరుగుల తేడాతో ఘోర పరాజయం చవిచూసింది. దాంతో ఐదు మ్యాచ్ల సిరీస్ను ఆస్ట్రేలియా 4-1తో సొంతం చేసుకుంది. సూపర్ ఓవర్కు దారితీసిన రెండో ఓవర్లో చిరస్మరణీయ విజయాన్నందుకున్న భారత్.. ఆ జోరును కొనసాగించలేకపోయింది.
వరుసగా మూడు మ్యాచ్ల్లో ఓడి సొంతగడ్డపై ఘోర పరాభావాన్ని మూటగట్టుకుంది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా మహిళల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 196 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఆస్ట్రేలియా టాప్-4 బ్యాటర్లు బెత్ మూనీ(2), ఫోబే లిచ్ ఫీల్డ్(11), తహిళ మెక్గ్రాత్(26), ఎల్లిస్ పెర్రీ(18) విఫలమైనా.. అష్లే గార్డనర్(66 నాటౌట్), గ్రేస్ హరీస్(64 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో భారీ స్కోర్ చేయగలిగింది. భారత బౌలర్లలో అంజలి శర్వాణి, దీప్తి శర్మ, షెఫాలీ వర్మ, దేవిక వైద్య తలో వికెట్ తీసారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో142 పరుగులకు కుప్పకూలి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. భారత బ్యాటర్లలో దీప్తి శర్మ(34 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్తో 53) మినహా అంతా విఫలమయ్యాడు. స్టార్ ఓపెనర్లు స్మృతి మంధాన(4), షెఫాలీ వర్మ(13), హర్లీన్ డియోల్(24), హర్మన్ ప్రీత్ కౌర్(12), రిచా ఘోష్(10) దారుణంగా విఫలమయ్యారు. ఆస్ట్రేలియా బౌలర్లలో హీథర్ గ్రహమ్ నాలుగు వికెట్లతో భారత్ పతనాన్ని శాసించింది. అష్లే గార్డనర్కు రెండు వికెట్లు దక్కగా.. డార్సీ బ్రౌన్, సుథర్లాండ్ తలో వికెట్ తీసారు.