మైదానంలో అభినందించాడు.. డ్రెసింగ్ రూమ్లో ఎమోషనల్ అయ్యాడు! బాటిల్ను నేలకేసికొట్టిన లంక ప్లేయర్!!

కొలంబో: బుధవారం రాత్రి చివరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన రెండో టీ20 మ్యాచ్లో శ్రీలంక నాలుగు వికెట్ల తేడాతో భారత్ను ఓడించి.. మూడు మ్యాచ్ల సిరీస్ 1-1తో సమం చేసింది. లక్ష్య చేధనలో భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో శ్రీలంక 17.2 ఓవర్లలో 105/6తో నిలిచింది. ప్రేమదాస మైదానంలో పరుగులు చేయడం కష్టంగా ఉండడంతో భారత్.. గెలిచేలా కనిపించింది.
కానీ ఒత్తిడిలో చక్కగా బ్యాటింగ్ చేసిన ధనంజయ డిసిల్వా (40 నాటౌట్; 34 బంతుల్లో 1×4, 1×6), కరుణరత్నె (12 నాటౌట్) లంకకు అద్భుత విజయాన్ని అందించారు. దీంతో స్వదేశంలో వరుస 14 మ్యాచుల పరాజయాల పరంపరకు లంక బ్రేక్ వేసింది.

బాటిల్ నేలకేసి కొట్టి
శ్రీలంక జట్టు టీ20ల్లో ఇటీవల కాలంలో పరాజయాలను ఎదుర్కొంటోంది. టీమిండియా పర్యటనకు ముందు ఐదు టీ20 సిరీస్లను లంక కోల్పోయింది. టీమిండియాతో సిరీస్లో కూడా అప్పటికే ఒక మ్యాచ్ కోల్పయింది. రెండో టీ20 కూడా ఓడిపోతే.. ఆరో సిరీస్ కోల్పోయేది లంక.
అయితే అనూహ్య విజయం దక్కడంతో.. లంక సిరీస్పై ఆశలు సజావుగా ఉంచుకుంది. అందుకే డిసిల్వా విన్నింగ్ షాట్ కొట్టగానే.. లంక ప్లేయర్స్ ఆనందం పట్టుకోలేకపోయారు. వనిందు హసరంగ అయితే డ్రెసింగ్ రూమ్లో ఎమోషనల్ అయ్యాడు. చేతిలో ఉన్న వాటర్ బాటిల్ నేలకేసి కొట్టాడు. ఆపై సహచర ఆటగాళ్లతో తన ఆనందాన్ని పంచుకున్నాడు.

చహర్పై ప్రశంసల వర్షం
అంతకుముందు తన వికెట్ పడగొట్టిన రాహుల్ చహర్పై వనిందు హసరంగ ప్రశంసల వర్షం కురిపించాడు. లంక ఇన్నింగ్స్ సమయంలో ఇన్నింగ్స్ 15వ ఓవర్ను చహర్ వేశాడు. ఆ ఓవర్ నాలుగో బంతిని హసరంగ ఫోర్ బాదాడు. ఆ తర్వాతి బంతిని కూడా షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ బంతి అనూహ్యంగా బ్యాట్ ఎడ్జ్కు తాకి బ్యాక్వర్డ్ పాయింట్ దిశగా వెళ్లింది.
అక్కడే ఉన్న భువనేశ్వర్ కుమార్ క్యాచ్ అందుకున్నాడు. దీంతో వికెట్ తీశానన్న ఆనందంలో చహర్.. హసరంగ వైపు కోపంగా చూస్తూ వెళ్లు అన్నట్లుగా ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. కానీ హసరంగ లైట్ తీసుకొని తన బ్యాట్ను కొడుతూ నవ్వుతూ వెళ్లిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. హసరంగను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
Tokyo Olympics 2021: ఒలింపిక్స్లో ముగిసిన మేరీ కోమ్ ఫైట్!!

నేడే చివరి టీ20
ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 132 పరుగులు చేసింది. కెప్టెన్ శిఖర్ ధావన్ (42 బంతుల్లో 40; 5 ఫోర్లు).. అరంగేట్రం ప్లేయర్స్ దేవ్దత్ పడిక్కల్ (23 బంతుల్లో 29; 1 ఫోర్, 1 సిక్స్), రుతురాజ్ గైక్వాడ్ (18 బంతుల్లో 21; 1 ఫోర్) ఫర్వాలేదనిపించారు. అకిల ధనంజయ రెండు వికెట్లు పడగొట్టాడు. లక్ష్య ఛేదనలో శ్రీలంక 19.4 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసి గెలుపొందింది.
'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' ధనంజయ డిసిల్వా (34 బంతుల్లో 40 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్), చమిక కరుణరత్నే (6 బంతుల్లో 12 నాటౌట్; 1 సిక్స్) తమ జట్టుకు విజయాన్ని అందించారు. భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు తీశాడు. ఇరు జట్లకు కీలకంగా మారిన చివరి టీ20 నేడు జరగనుంది. మ్యాచ్ ఎవరు గెలిస్తే.. వారిదే సిరీస్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications