టోక్యో: ప్రతిష్టాత్మక టోక్యో ఒలింపిక్స్ 2021లో భారత వెటరన్ బాక్సర్, ఆరుసార్లు ప్రపంచ చాంపియన్ మేరీ కోమ్ ఫైట్ ముగిసింది. గోల్డ్ మెడల్పై ఆశలు రేపిన మేరీ కోమ్ రౌండ్ ఆఫ్ 16లోనే ఇంటిదారి పట్టింది. గురువారం 48-51 కిలోల విభాగంలో జరిగిన ప్రి క్వార్టర్ ఫైనల్లో కొలంబియాకు చెందిన ఇన్గ్రిట్ లోరెనా వాలెన్సియా చేతిలో 2-3 తేడాతో మేరీ కోమ్ ఓడిపోయింది. దీంతో భారత్కు ఈరోజు అతి పెద్ద నిరాశ ఎదురైంది.
మేరీ కోమ్, లోరెనా వాలెన్సియా మధ్య జరిగిన పోరు హోరాహోరీగా సాగింది. తనదైన శైలిలో ఎదురుదాడికి దిగిన వాలెన్సియా తొలి రౌండ్లో న్యాయ నిర్ణేతలను మెప్పించింది. ఐదుగురు జడ్జీలు ఆమెకు 49 పాయింట్లు ఇవ్వగా.. మేరీ కోమ్కు 46 మాత్రమే కేటాయించారు. ఆ తర్వాతి రెండు రౌండ్లలో భారత బాక్సర్ మేరీ విజృంభించింది. తన అనుభవాన్ని ఉపయోగించి పంచ్లు విసిరింది. వాలెన్సియా సైతం అదే రీతిలో చెలరేగడంతో న్యాయనిర్ణేతలు ఇద్దరికీ సమానంగా స్కోర్ ఇచ్చారు. తొలి రౌండ్లో ఆధిక్యంతో వాలెన్సియా క్వార్టర్ ఫైనల్కు దూసుకెళ్లింది.
48-51 కిలోల విభాగంలో జరిగిన ప్రి క్వార్టర్ ఫైనల్లో మేరీ కోమ్ 27-30, 28-29, 30-27, 28-29, 29-28 తేడాతో ఓటమి పాలైంది. ఈ ఓటమితో టోక్యో ఒలింపిక్స్ 2021 నుంచి మేరీ నిష్క్రమించింది. ఓటమి బాధ తట్టుకోలేక ఆరుసార్లు ప్రపంచ చాంపియన్ అయిన మేరీ కన్నీటి పర్యంతం అయింది. 38 ఏళ్ల మేరీకి ఇవే ఆఖరి ఒలింపిక్స్ అని వార్తలు వస్తున్నాయి. మరోసారి ఒలింపిక్స్ ఆడాలంటే.. ఆమె మరో మూడేళ్లు వేచిచూడాల్సి ఉంది. అప్పటివరకు కొనసాగుతారో లేదో చూడాలి.
టోక్యో ఒలింపిక్స్లో మొత్తం 9 మంది భారత బాక్సర్లు బరిలోకి దిగారు. ఒలింపిక్స్కి అర్హత పొందిన తర్వాత మేరీ కోమ్తో పాటు బాక్సర్లందరూ ఇటలీకి వెళ్లి మరీ శిక్షణ తీసుకున్నారు. విశ్వ క్రీడలకు కూడా అక్కడి నుంచే వచ్చారు. ఈ ఒలింపిక్స్లో పతకం గెలవడం ద్వారా ఘనంగా కెరీర్కి వీడ్కోలు పలకాలని మేరీ కోమ్ ఆశించింది. కానీ అలా జరగలేదు. సతీశ్ కుమార్ మాత్రం అంచనాలకి మించి రాణిస్తున్నాడు. పురుషుల 91 కేజీల విభాగంలో పోటీపడుతున్న సతీశ్.. క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు.