కొలంబో: బ్యాటింగ్కు ప్రతికూలమైన పిచ్పై శ్రీలంక బౌలర్లు చెలరేగడంతో భారత కుర్రాళ్లు తడబడ్డారు. భారీ షాట్లు ఆడే క్రమంలో వరుసగా వికెట్లు సమర్పించుకున్నారు. దాంతో శ్రీలంకతో జరుగుతున్న రెండో టీ20లో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 132 రన్స్ చేసింది. శిఖర్ ధావన్(40), దేవదత్ పడిక్కల్(29), రుతురాజ్ గైక్వాడ్(21) పర్వాలేదనిపించారు. లంకబౌలర్లలో అకిలా ధనుంజయ రెండు వికెట్లు తీయగా.. చమీరా, హసరంగా, షనక తలో వికెట్ పడగొట్టారు.
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్కు ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్(21), శిఖర్ ధావన్ శుభారంభం అందించారు. ఫస్ట్ ఓవర్లోనే బౌండరీల ఖాతా తెరిచిన ధావన్.. ధనంజయ వేసిన మూడో ఓవర్లో మరో రెండు బౌండరీలు బాదాడు. మరో ఎండ్లో రుతురాజ్ గైక్వాడ్ బౌండరీలు బాదకపోయినా క్విక్ సింగిల్స్, డబుల్స్తో ధావన్కు సహకారం అందించడంతో పవర్ ప్లేలో భారత్ వికెట్ నష్టపోకుండా 45 రన్స్ చేసింది. ఆ తర్వాత సీన్ మారింది. పిచ్ నుంచి లభించిన సహకారాన్ని అందిపుచ్చుకున్న లంక బౌలర్లు భారత బ్యాట్స్మన్ను ఇబ్బంది పెట్టారు.
కెప్టెన్ డసన్ షనక బౌలింగ్లో భారీ షాట్కు ప్రయత్నించిన గైక్వాడ్ కీపర్ క్యాచ్గా పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత క్రీజులోకి మరో అరంగేట్ర ప్లేయర్ దేవదత్ పడిక్కల్ రాగా.. స్కోర్ బోర్డు మందగించింది. ఇద్దరు లెఫ్టాండర్స్ కావడంతో షనక రెండు వైపుల నుంచి ఆఫ్ స్పిన్నర్లతో బౌలింగ్ చేయించాడు. దాంతో పరుగులు వేగం తగ్గింది. 10వ ఓవర్ చివరి బంతికి పడిక్కల్ భారీ సిక్సర్ బాదగా.. ఆ మరుసటి బంతిని ధావన్ బౌండరీ రాబట్టాడు. కానీ ఆ మరుసటి ఓవర్లోనే వేగంగా ఆడే ప్రయత్నంలో ధనుంజయ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత కూడా బౌండరీలు రాకపోవడంతో బ్యాట్స్మన్పై ఒత్తిడి పెరిగింది.
ఈ క్రమంలోనే హసరంగా వేసిన 16వ ఓవర్లో బౌండరీ బాదిన పడిక్కల్(29) అదే జోరులో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అకిలా ధనుంజయ వేసిన ఆ మరుసటి ఓవర్లోనే స్టెప్ ఔటై భారీ షాట్ ఆడబోయిన శాంసన్(7) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత రాణా(8), భువనేశ్వర్ కుమార్(12) బ్యాటింగ్కు కష్టంగా ఉండటంతో క్విక్ సింగిల్స్, డబుల్స్తో పరుగులు చేసే ప్రయత్నం చేశారు. చివరి ఓవర్లో చమీరా స్లోయర్ బాల్తో రాణాను ఔట్ చేయడంతో.. మూడు పరుగులే వచ్చాయి. దాంతో భారత్ 132 పరుగులే చేయగలిగింది.