ఆ రెండు సిక్స్లే..
'మహీశ్ తీక్షణ బౌలింగ్లో దీపక్ హుడా కొట్టిన రెండు వరుస సిక్స్లు మ్యాచ్ టర్నింగ్ పాయింట్గా చెప్పవచ్చు. ఆ ఓవర్ వరకు శ్రీలంక బౌలర్లు పూర్తి ఆధిపత్యం చెలాయించారు. అది భారత్కు చాలా కీలకమైన ఓవర్. అతను కొట్టిన ఆ రెండు సిక్స్లతో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి.'అని సబా కీరం అభిప్రాయపడ్డాడు.
94 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి స్వల్ప స్కోర్ దిశగా సాగుతున్న టీమిండియాను దీపక్ హుడా ఆదుకున్నాడు. అక్షర్ పటేల్ (20 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్తో 31 నాటౌట్)తో కలిసి చివరి 35 బంతుల్లో 68 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. 23 బంతుల్లో ఒక ఫోర్, 4 సిక్సర్లతో 41 పరుగులతో అజేయంగా నిలిచిన దీపక్ హుడా.. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్నాడు.
వరుసగా అవకాశాలు ఇవ్వాలి..
మ్యాచ్ విన్నింగ్ పెర్ఫామెన్స్ కనబర్చిన దీపక్ హుడాకు వరుసగా అవకాశాలు ఇవ్వాలని సబా కరీం అభిప్రాయపడ్డాడు. 'నాకు తెలిసి టీమ్మేనేజ్మెంట్ దీపక్ హుడాను ఫినిషర్ రోల్లో ప్రయత్నిస్తున్నట్లు అర్థమవుతోంది. అయితే అతనికి మరిన్నీ అవకాశాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది.
ఈ రోల్లో అతను కొన్నిసార్లు విఫలమవ్వచ్చు. అప్పుడు అతనికి అండగా నిలవాల్సి ఉంటుంది. అతను బంతితో కూడా రాణించగలడు. భారత జట్టుకు అతను అమూల్యమైన ఆస్థి.
రంజీల్లో దుమ్మురేపడంతో...
అతనిపై టీమ్మేనేజ్మెంట్, సెలెక్టర్లు నమ్మకం ఉంచాలి. టాప్ క్వాలిటి బౌలింగ్ అటాక్పై కూడా అతను పరుగులు చేయగలడు. అతనికి వరుసగా అవకాశాలిస్తే తన మార్క్ చూపించగలడు.'అని సబా కరీం చెప్పుకొచ్చాడు. ఇక శ్రీలంకతో టీ20 సిరీస్ ముందు దీపక్ హుడా.. రంజీ ట్రోఫీలో రెండు ఇన్నింగ్స్ల్లో సెంచరీలు బాదాడు. మూడేళ్ల తర్వాత రెడ్ బాల్ క్రికెట్ ఆడిన దీపక్ హుడా.. మూడు ఇన్నింగ్స్ల్లో 382 పరుగులు చేశాడు. ఈ ప్రదర్శనతోనే అతనికి తుది జట్టులో అవకాశం ఇచ్చారు.
చెలరేగిన ఉమ్రాన్, శివమ్ మావి..
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 162 పరుగులు చేసింది. లంక బౌలర్లలో దిల్షాన్, మహీశ్ తీక్షణ, చమిక కరుణరత్నే, ధనుంజ డిసిల్వా, వానిందు హసరంగా ఐదు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 160 పరుగులకు కుప్పకూలింది. డసన్ షనక(27 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్లతో 45), చమిక కరుణరత్నే(16 బంతుల్లో 2 సిక్సర్లతో 23 నాటౌట్) పోరాడినా ఫలితం లేకపోయింది. భారత బౌలర్లలో శివమ్ మావి నాలుగు వికెట్లు తీయగా.. ఉమ్రాన్ మాలిక్, హర్షల్ పటేల్ రెండేసి వికెట్లు తీసారు.