
న్యూఢిల్లీ: భారత క్రికెట్ అభిమానులకు బ్యాడ్ న్యూస్. శ్రీలంక పర్యటనలో ఉన్న భారత జట్టులో కరోనా కలకలం రేగింది. టీమిండియా స్టార్ ఆల్రౌండర్ కృనాల్ పాండ్యా కరోనా బారిన పడ్డాడు. తాజాగా నిర్వహించిన పరీక్షల్లో కృనాల్కు పాజిటీవ్ వచ్చిందని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ట్వీట్ చేసింది. ముందస్తు చర్యల్లో భాగంగా జట్టు మొత్తానికి మరోసారి ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు చేశామని వాటి ఫలితాలు రావాల్సి ఉందని పేర్కొంది. దాంతో నేడు జరగాల్సిన రెండో టీ20 రేపటికి(బుధవారానికి) వాయిదా పడిందని తెలిపింది. ఇక కృనాల్తో మొత్తం 8 మంది భారత ఆటగాళ్లు సన్నిహితంగా మెలిగారని, వారితో పాటు కృనాల్ పాండ్యాను ఐసోలేషన్కు తరలించినట్లు తెలుస్తోంది.
మూడు టీ20లో సిరీస్లో ఆదివారం జరిగిన ఫస్ట్ మ్యాచ్లో భారత్ 38 పరుగులతో గెలిచి బోణీ కొట్టింది. భువనేశ్వర్ కుమార్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. సూర్యకుమార్ యాదవ్ హాఫ్ సెంచరీతో రాణించాడు. ఇక రెండో టీ20లోనూ అదే జోరు కొనసాగించి మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ కైవసం చేసుకోవాలని గబ్బర్ సేన భావించింది. కానీ కరోనా.. టీమిండియా ఆటగాళ్లతో పాటు అభిమానులకు గట్టి షాక్ ఇచ్చింది.
కరోనా కారణంగానే భారత్-శ్రీలంక వన్డే, టీ20 సిరీస్ల షెడ్యూల్ మారిందన్న విషయం తెలిసిందే. ఇంగ్లండ్ పర్యటన నుంచి వచ్చిన శ్రీలంక టీమ్లో కరోనా కేసులు వెలుగు చూడటంతో సిరీస్లను నాలుగు రోజుల ఆలస్యంగా ప్రారంభించారు. అత్యంత పకడ్బందీగా మ్యాచ్లు నిర్వహించినా.. బయో బబుల్లోకి కరోనా ప్రవేశించి కృనాల్కు సోకింది. వన్డే సిరీస్ను గబ్బర్ సేన 2-1తో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.