|
ఓపెనర్ల శుభారంభం..
టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన టీమిండియాకు ఓపెనర్లు కేఎల్ రాహుల్(42 బ్యాటింగ్), శిఖర్ ధావన్(29) శుభారంభాన్ని అందించారు. ఆరంభం నుంచే ధాటిగా ఆడటంతో పవర్ ప్లేలో టీమిండియా వికెట్ నష్టపోకుండా 57 పరుగులు చేసి పటిష్ట స్థితిలో కనిపించింది. కానీ పవర్ ప్లే ముగిసిన వెంటనే టీమిండియా కథ మారింది. బవుమా స్పిన్నర్లను రంగంలోకి దింపగా.. భారత బ్యాట్స్మన్ తడబడ్డారు. వరుసగా రెండు ఓవర్లపాటు పరుగులు రాకపోవడంతో రన్రేట్ తగ్గింది. ఈ క్రమంలోనే తీవ్ర ఒత్తిడికి గురైన శిఖర్ ధావన్ ధాటిగా ఆడే ప్రయత్నం చేసి వికెట్ సమర్పించుకున్నాడు.
|
పరుగు వ్యవధిలోనే రెండు కీలక వికెట్లు..
మార్కరమ్ బౌలింగ్లో డీప్ మిడ్వికెట్ మీదుగా భారీ షాట్ ఆడిన శిఖర్ ధావన్.. మగలా చేతికి చిక్కి పెవిలియన్ చేరాడు. దాంతో తొలి వికెట్కు నమోదైన 63 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అనంతరం ఎన్నో అంచనాల మధ్య క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ(0) తీవ్రంగా నిరాశపరిచాడు. ఐదు బంతుల్లోనే క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. కేశవ్ మహరాజ్ బౌలింగ్లో తడబడ్డ విరాట్.. అతను వేసిన ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ బాల్ను జంప్ చేస్తూ మరీ కవర్ డ్రైవ్కు ప్రయత్నించాడు. కానీ ఆ దిశలో ఫీల్డింగ్ చేస్తున్న బవుమా బంతిని సునాయసంగా అందుకోవడంతో నిరాశగా పెవిలియన్ చేరాడు. దాంతో భారత్ పరుగు వ్యవధిలోనే రెండు కీలక వికెట్లు కోల్పోయింది.
|
ఆదుకున్న పంత్, రాహుల్..
64/2 స్థితిలో క్రీజులోకి వచ్చిన పంత్, రాహుల్తో కలిసి జట్టును ఆదుకున్నాడు. ఆరంభంలో పంత్ తడబడగా.. సౌతాఫ్రికా చెత్త ఫీల్డింగ్తో రాహుల్ రనౌట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఇక మహరాజ్ బౌలింగ్లో సిక్స్తో హిట్టింగ్ షురూ చేసిన పంత్.. షంసీ బౌలింగ్లో మూడు బౌండరీలతో చెలరేగాడు. అదే జోరులో పెహ్లుక్వాయో బౌలింగ్లో సింగిల్ తీసి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అనంతరం మరింత ధాటిగా ఆడిన పంత్.. షంసీ బౌలింగ్లో సింగిల్ హ్యాండ్తో లాంగాన్ మీదుగా సిక్సర్ బాదాడు. ఇది ఇన్నింగ్స్కే హైలైట్గా నిలిచింది. ఓవైపు పంత్ ధాటిగా ఆడుతుండగా మరోవైపు రాహుల్ నిదానంగా ఆడాడు.
శార్దూల్ సూపర్ బ్యాటింగ్..
ఈ క్రమంలో 116 పరుగుల భాగస్వామ్యాన్ని పూర్తి చేసుకున్న ఈ జోడీని మగలా విడదీసాడు. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న రాహుల్ను క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చాడు. అప్పటికే రాహుల్కు మూడు లైఫ్స్ రాగా సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఆ వెంటనే పంత్ కూడా భారీ షాట్కు ప్రయత్నించి క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. ఆశలు పెట్టుకున్న శ్రేయస్ అయ్యర్(11) తీవ్రంగా నిరాశపరిచాడు. ఈ పరిస్థితుల్లో వెంకటేశ్ అయ్యర్(22)తో శార్దూల్ ఠాకూర్ ఆదుకునే ప్రయత్నం చేశాడు. కానీ క్వింటన్ డికాక్ సూపర్ కీపింగ్కు వెంకటేశ్ స్టంపౌట్గా వెనుదిరిగాడు. క్రీజులోకి వచ్చిన అశ్విన్(25)తో శార్దూల్ భారత్ భారీ స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు.