బెడిసికొడుతున్న ద్రవిడ్ నిర్ణయాలు..
అయితే కీలక టీ20 ప్రపంచకప్ ముందు భారత్ వరుస పరాజయాలను ఎదుర్కొవడం అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది. ముఖ్యంగా ఐపీఎల్ 2022 సీజన్లో సత్తా చాటిన ఆటగాళ్లు ఇంటర్నేషనల్ క్రికెట్లో విఫలమవడం కలవరపెడుతోంది. అంతేకాకుండా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ నిర్ణయాలు జట్టుకు నష్టం చేస్తున్నాయి. రెండో టీ20లో దినేశ్ కార్తీక్.. బ్యాటింగ్ ఆర్డర్ మారుస్తు తీసుకున్న నిర్ణయం బెడిసి కొట్టింది. ఏడో స్థానంలో పంపించడంతో భారత్ పోరాడే లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందు ఉంచలేకపోయింది.
జట్టులో అనేక మార్పులు..
అంతేకాకుండా సీనియర్ ఆటగాళ్ల గైర్హాజరీలో అనుభవం, యువ ఆటగాళ్లతో కూడిన జట్టును ఎంపిక చేయడంలోనూ ద్రవిడ్ విఫలమయ్యాడు. గతంలో మాదిరి శిఖర్ ధావన్ను కెప్టెన్ చేయకుండా.. పంత్కు సారథ్య బాధ్యతలు అప్పగించాడు. అతను అనుభవలేమితో కెప్టెన్సీని ఒత్తిడిగా భావిస్తూ తడబడుతున్నాడు. కనీసం హార్దిక్ పాండ్యాకైనా కెప్టెన్సీ ఇయ్యాల్సిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక రాహుల్ ద్రవిడ్ కోచ్గా వచ్చిన తర్వాత జట్టులో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. విరాట్ సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. రోహిత్ కెప్టెన్సీ అందుకున్నాడు.
ఉమ్రాన్ మాలిక్ పక్కనపెట్టడంతో..
ఇక సౌతాఫ్రికా పర్యటనలో భారత్ టెస్ట్, వన్డే సిరీస్లను 1-2, 0-3 కోల్పోయింది. ఇప్పుడు 5 టీ20ల సిరీస్లో 0-2తో వెనుకంజలో నిలిచింది. ప్రపంచకప్ ముందు ద్రవిడ్ చేస్తున్న ప్రయోగాలు జట్టుకు నష్టం చేస్తున్నాయి. ఐపీఎల్లో తన పేస్తో ప్రపంచ బ్యాటర్లను వణికించిన ఉమ్రాన్ మాలిక్ నేర్చుకునే దశలోనే ఉన్నాడని జట్టులోకి తీసుకోవడం లేదు. ఇది కూడా భారత్ విజయవకాశాలను దెబ్బతీసింది.