అసలు విషయం ఏంటంటే..?
భారత్ ఇన్నింగ్స్ చివరి ఓవర్లో స్ట్రైకింగ్లో నిలిచిన హార్దిక్ పాండ్యా.. నాన్ స్ట్రైకర్ ఎండ్లో ఉన్న దినేశ్ కార్తీక్కు బ్యాటింగ్ ఇవ్వలేదు. సింగిల్ తీసే అవకాశం ఉన్నా.. స్ట్రైకింగ్ ఉంచుకోవాలనే ఉద్దేశంతో ప్రయత్నించలేదు. అన్రిచ్ నోర్జ్ వేసిన చివరి ఓవర్ తొలి బంతికి రిషభ్ పంత్ ఔటవ్వగా.. కార్తీక్ క్రీజులోకి వచ్చాడు. అయితే ఎదుర్కొన్న బంతిని బ్యాట్కు కనెక్ట్ చేయడంలో విఫలమయ్యాడు. మూడో బంతికి క్విక్ సింగిల్తో హార్దిక్ పాండ్యాకు బ్యాటింగ్ ఇచ్చాడు. నాలుగో బంతిని హార్దిక్.. డీప్ మిడ్ వికెట్ దిశగా ఆడాడు. సింగిల్ తీసే అవకాశం ఉన్నా.. నిరాకరించాడు. చివరి బంతికి భారీ షాటే ఆడే ఉద్దేశంతో అలా చేశాడు. కానీ చివరి బంతికి రెండు పరుగులు మాత్రమే చేశాడు.
విజయ గర్వం తలకెక్కిందా..?
దాంతో హార్దిక్ పాండ్యాపై మాజీ క్రికెటర్లు, అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగిల్ తీసిస్తే దినేశ్ కార్తీక్ భారీ షాట్ ఆడేవాడని కామెంట్ చేస్తున్నారు. అసలు దినేశ్ కార్తీక్ గురించి ఏమనుకుంటున్నావని, ఐపీఎల్ 2022 సీజన్లోనే హయ్యెస్ట్ స్ట్రైకరేట్ కలిగిన ఫినిషరని విమర్శిస్తున్నారు. ఐపీఎల్ 2022 సీజన్ విజయ గర్వం హార్దిక్ పాండ్యాకు తలకెక్కిందని మండిపడుతున్నారు. దినేశ్ కార్తీక్ను అవమానపరచడమేనని, అతను కచ్చితంగా ఆ చివరి బంతికి భారీ షాట్ ఆడేవాడని అభిప్రాయపడుతున్నారు.
నెహ్రా సైతం..
గుజరాత్ టైటాన్స్ హెడ్ కోచ్ ఆశిష్ నెహ్రా సైతం తమ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఆటతీరును తప్పుబట్టాడు. హార్దిక్ పాండ్యా ఆ సింగిల్ తీయాల్సిందని అభిప్రాయపడ్డాడు. సౌతాఫ్రికాతో తొలి టీ20 అనంతరం క్రిక్ బజ్తో మాట్లాడిన ఆశిష్ నెహ్రా.. హార్దిక్ తీరును తప్పుబట్టాడు. అక్కడ నాన్ స్ట్రైకర్గా ఉన్నది తనలాంటి సాదా సీదా టెయిలండర్ కాదని, బిగ్ హిట్టర్ అయిన దినేశ్ కార్తీక్ అని చురకలంటించాడు. ‘చివరి ఓవర్లో దినేశ్ కార్తీక్ ఆ సింగిల్ తీయాల్సింది. అక్కున్నది సాధారణ టెయిలండర్ కాదు. బిగ్ హిట్టర్ అయిన దినేశ్ కార్తీక్'అని తెలిపాడు.
ఇషాన్ పొరాటం వృథా..
మొదట భారత్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 211 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్ ఇషాన్ కిషన్ (48 బంతుల్లో 76; 11 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగగా... హార్దిక్ పాండ్యా (12 బంతుల్లో 31 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్స్లు), కెప్టెన్ రిషభ్ పంత్ (16 బంతుల్లో 29; 2 ఫోర్లు, 2 సిక్స్లు) రాణించారు.
అనంతరం దక్షిణాఫ్రికా 19.1 ఓవర్లలో 3 వికెట్లే కోల్పోయి 212 పరుగులు చేసి గెలిచింది. వాన్డెర్ డసెన్ (46 బంతుల్లో 75 నాటౌట్; 7 ఫోర్లు, 5 సిక్సర్లు), 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' డేవిడ్ మిల్లర్ (31 బంతుల్లో 64 నాటౌట్; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) నాలుగో వికెట్కు 64 బంతుల్లోనే 131 పరుగులు జోడించి సిరీస్లో సఫారీకి శుభారంభం అందించారు.