ఆడింది 12 వన్డేలే..
న్యూజిలాండ్తో మూడో వన్డే అనంతరం జరిగిన మీడియా సమావేశంలో 29, 30వ సెంచరీ మధ్య ఇంత గ్యాప్ ఎందుకు వచ్చిందని ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు రోహిత్ సమాధానమిస్తూ స్టార్ స్పోర్ట్స్పై మండిపడ్డాడు. ఈ మూడేళ్ల కాలంతో తాను 12 వన్డేల మాత్రమే ఆడాననే విషయాన్ని అందరు గుర్తించాలని కోరాడు. ఈ విషయాన్ని స్టార్ స్పోర్ట్స్ చూపించకపోవడంపై అసహనం వ్యక్తం చేశాడు. 'గత మూడేళ్లలో నాకు ఇది తొలి సెంచరీ. కానీ ఈ సమయంలో నేను ఆడింది 12 వన్డేలు మాత్రమే. మూడేళ్లు అనేది చాలా ఎక్కువ కాలంగా వినిపిస్తోంది. క్రికెట్ జర్నలిస్ట్లుగా ఏం జరుగుతుందో మీరు తెలుసుకోవాలి.
వాస్తవాలను చూపించాలి..
మూడేళ్ల తర్వాత సెంచరీ అని బ్రాడ్కాస్టర్ చూపించిందనే విషయం తెలుసు. కానీ బ్రాడ్ కాస్టర్ వాస్తవాలు కూడా చూపించాలి. గతేడాది మొత్తం మేం వన్డే క్రికెట్ ఆడలేదు. టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో టీ20 క్రికెట్పైనే ఎక్కువ ఫోకస్ పెట్టాం. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొవాలి. బ్రాడ్కాస్టర్ కూడా వాస్తవాలను మాత్రమే చూపించాలి'అని అసహనం వ్యక్తం చేశాడు. ఈ మ్యాచ్లో టీమిండియా 90 పరుగులతో గెలుపొంది మూడు వన్డేల సిరీస్ను 3-0తో క్లీన్ స్వీప్ చేసిన విషయం తెలిసిందే. ఈ విజయంతో వన్డే ర్యాంకింగ్స్లో అగ్రస్థానాన్ని కూడా అందుకుంది.
ఆ ముగ్గురి వల్లే ఈ విజయం..
ఇక మ్యాచ్ అనంతరం మాట్లాడిన రోహిత్ శర్మ.. శుభ్మన్ గిల్, కుల్దీప్ యాదవ్, శార్దూల్ ఠాకూర్లపై ప్రశంసల జల్లు కురిపించాడు. 'చాలా రోజులుగా శార్దూల్ సత్తా చాటుతున్నాడు. జట్టులో అతన్ని అందరూ మెజిషియన్ అంటారు. అవసరమైనప్పుడల్లా బ్యాట్, బంతితో మెరుస్తాడు. కుల్దీప్ యాదవ్కు బంతిని అందించినప్పుడల్లా సత్తా చాటుతున్నాడు. జట్టుకు కావాల్సిన వికెట్లు తీసి బ్రేక్త్రూ అందిస్తున్నాడు. మణికట్టు స్పిన్నర్లు గేమ్ టైమ్తో మరింత మెరుగవుతారు. ప్రతీ మ్యాచ్లో శుభ్మన్ గిల్ అప్రోచ్ ఒకేలా ఉంటుంది. ప్రతీ మ్యాచ్ను కొత్తగా ప్రారంభించాలనుకుంటాడు. జట్టులోకి వచ్చిన ఓ యువకుడు అలాంటి వైఖరి కలిగి ఉండటం గొప్ప విషయం.'అని రోహిత్ ప్రశంసించాడు.
టాప్-3లో చోటు..
ఈ సెంచరీతో వన్డే క్రికెట్లో అత్యధిక సెంచరీలు బాదిన జాబితాలో రోహిత్.. రికీ పాంటింగ్ సరసన నిలిచాడు. 365 ఇన్నింగ్స్ల్లో రికీ పాంటింగ్ 30 సెంచరీలు బాదగా.. రోహిత్ శర్మ 234 ఇన్నింగ్స్ల్లోనే ఈ ఘనతను అందుకున్నాడు. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ 49(452 ఇన్నింగ్స్ల్లో) సెంచరీలతో అగ్రస్థానంలో ఉండగా.. విరాట్ కోహ్లీ 46 (261 ఇన్నింగ్స్ల్లో) సెంచరీలతో రెండోస్థానంలో కొనసాగుతున్నాడు. ఈ ఇన్నింగ్స్లో 6 సిక్స్లు బాదిన రోహిత్ శర్మ వన్డే క్రికెట్లో అత్యధిక సిక్స్లు కొట్టిన బ్యాటర్ల జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు. ఈ క్రమంలో సనత్ జయసూర్య రికార్డును అధిగమించాడు.