అర్ష్దీప్ సింగ్ వైఫల్యానికి కారణం అదే: మహమ్మద్ కైఫ్

న్యూఢిల్లీ: టీ20 ప్రపంచకప్ 2022లో అసాధారణ బౌలింగ్తో ఆకట్టుకున్న టీమిండియా యువ పేసర్ అర్ష్దీప్ సింగ్ ఈ ఏడాది మాత్రం దారుణంగా విఫలమవుతున్నాడు. తనదైన యార్కర్లతో యావత్ క్రికెట్ ప్రపంచదృష్టిని ఆకర్షించిన అర్ష్దీప్ సింగ్.. ఇప్పుడు పేలవ బౌలింగ్తో జట్టు ఓటమికి కారణమవుతున్నాడు. శ్రీలంకతో టీ20 సిరీస్లో ఒకే మ్యాచ్లో ఐదు నోబాల్స్ వేసి చెత్త రికార్డు క్రియేట్ చేసిన ఈ సింగ్ బౌలర్.. శుక్రవారం న్యూజిలాండ్తో జరిగిన తొలి టీ20లోనూ తేలిపోయాడు. 4 ఓవర్లలో ఓ వికెట్ తీసి 51 పరుగులు ఇచ్చుకున్నాడు. ముఖ్యంగా చివరి ఓవర్లో అతను ఇచ్చిన 27 పరుగులు భారత్ పతనాన్ని శాసించాయి. ఈ ఓవర్లోనూ అర్ష్దీప్ సింగ్ నోబాల్ వేయగా.. ఈ అవకాశాన్ని న్యూజిలాండ్ బ్యాటర్ భారీ స్కోర్గా మలుచుకున్నాడు. దాంతో అర్ష్దీప్పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

లాంగ్ రన్నప్ వల్లనే...
అయితే అర్ష్దీప్ వైఫల్యానికి ప్రధాన కారణం లాంగ్ రన్నప్ అని మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ అన్నాడు. టీమిండియా మాజీ కోచ్ సంజయ్ బంగర్తో కలిసి ఓ చానెల్లో మాట్లాడిన కైఫ్.. అర్ష్దీప్ సింగ్ వైఫల్యానికి గల కారణాన్ని తెలియజేశాడు. 'రన్నప్ను ఎక్కువగా తీసుకొనే అర్ష్దీప్ సింగ్ వంటి బౌలర్లకు అడుగులు వేసేటప్పుడు సమస్యలు వస్తుంటాయి. అర్ష్దీప్ దూరం నుంచి పరిగెత్తుతూ తన శక్తిని వృథా చేసుకొంటున్నాడు. అతని లాంగ్ రనప్ వల్లే క్రీజ్ను ధాటి అడుగు ముందుకు పడిపోతోంది. అందుకే ప్రాథమిక అంశాలపై దృష్టిపెట్టాలి. అతడు చాలా మంచి బౌలర్'అని కైఫ్ తెలిపాడు.

లెంగ్త్లో వేయలేక..
సంజయ్ బంగర్ కూడా కైఫ్ వ్యాఖ్యలతో ఏకీభవించాడు. రనప్ విషయంలో జాగ్రత్తలు వహిస్తే బాగుంటుందని సూచించాడు.'అర్ష్దీప్ ఈ మ్యాచ్లో ప్రభావం చూపలేదు. అద్భుతమైన యార్కర్లతో బ్యాటర్లను ఇబ్బంది పెట్టి తనకంటూ గుర్తింపు సాధించిన అతను ఇటీవల ఇబ్బందికి గురవుతున్నాడు. లెంగ్త్లో బంతులను సంధించలేకపోతున్నాడు. అందుకే అతడు తన బౌలింగ్లో మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉంది. తెలివిగా బౌలింగ్ చేయాలి. అయితే ఇదొక ప్రయాణం.. తప్పకుండా మెరుగవుతాడు. మంచి ఆరంభం వచ్చినప్పుడు దానిని సద్వినియోగం చేసుకోవాలి. అయితే.. నైపుణ్యాలకు దీనిని పరీక్షగా భావించాలి'అని సంజయ్ బంగర్ అభిప్రాయపడ్డాడు.

చెలరేగిన కాన్వే, మిచెల్..
ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన న్యూజిలాండ్.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 176 పరుగులు చేసింది. డేవాన్ కాన్వే(35 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్తో 52), డారిల్ మిచెల్(30 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్లతో 59 నాటౌట్) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ రెండు వికెట్లు తీయగా.. అర్ష్దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, శివమ్ మావి తలో వికెట్ తీసారు.

సుందర్, సూర్య మినహా..
అనంతరం లక్ష్యచేధనకు దిగిన టీమిండియా.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 155 పరుగులు చేసి ఓటమిపాలైంది. వాషింగ్టన్ సుందర్(28 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్లతో 50) హాఫ్ సెంచరీతో రాణించగా.. సూర్యకుమార్ యాదవ్(34 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్లతో 47)పర్వాలేదనిపించాడు. న్యూజిలాండ్ బౌలర్లలో బ్రేస్వెల్, సాంట్నర్, ఫెర్గూసన్ రెండేసి వికెట్లు తీయగా.. ఇష్ సోదీ, జకోబ్ డఫ్ఫీ తలో వికెట్ పడగొట్టారు. టీమిండియా పేసర్ అర్ష్దీప్ సింగ్ తన ఆఖరి ఓవర్లో 27 పరుగులివ్వడం టీమిండియా పతనాన్ని శాసించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications