కాన్పూర్: న్యూజిలాండ్తో జరుగుతున్న తొలి టెస్ట్లో టీమిండియా తుది జట్టులో చోటు దక్కించుకోకపోయిన ఆంధ్ర వికెట్ కీపర్ శ్రీకర్ భరత్ ఎట్టకేలకు బరిలోకి దిగాడు. తెలుగోడైన భరత్ను కాదని సీనియర్ వికెట్ కీపర్ వృద్దిమాన్ సాహాకు టీమ్మేనేజ్మెంట్ అవకాశం ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే బ్యాటింగ్లో దారుణంగా విఫలమైన సాహా(1).. భారత ఇన్నింగ్స్ అనంతరం రెండో రోజు ఆటలో కీపింగ్ చేశాడు. మూడో రోజు ఆట ప్రారంభానికి ముందు మెడలు పట్టేయడంతో నొప్పితో బాధపడుతున్నాడు. దాంతో బ్యాకప్ వికెట్ కీపర్గా ఉన్న శ్రీకర్ భరత్కు మైదానంలో దిగే అవకాశం వచ్చింది.
Saha couldn't keep today due to neck injury, KS Bharat in For him, Will this be a farewell for Wriddhi?....🥲🙄 pic.twitter.com/WW88O3V6v0
— Mani sekhar 🇮🇳 (@Manirat_18) November 27, 2021
వాస్తవానికి ఈ మ్యాచ్ తుది జట్టులో శ్రీకర్ భరత్కే అవకాశం దక్కుతుందని భావించారు. రిషభ్ పంత్ విశ్రాంతి నేపథ్యంలో భారత జట్టులో చోటు దక్కించుకున్న భరత్ వైపే కోచ్ రాహుల్ ద్రవిడ్ మొగ్గు చూపుతాడనుకున్నారు. కానీ టీమ్మేనేజ్మెంట్ మాత్రం సీనియర్ వికెట్ కీపర్ సాహాకే అవకాశం ఇచ్చింది. అయితే ఈ ఎంపికపై తీవ్ర విమర్శలు కూడా వచ్చాయి. సాహా వయసు పైబడిపోయిందని, పంత్కు బ్యాకప్గా భరత్ను సిద్దం చేసుకోవాల్సిన అవసరం ఉందని క్రికెట్ విశ్లేషకులు సూచిస్తున్నారు.
పైగా డొమెస్టిక్ క్రికెట్లో ఆంధ్ర తరఫున బరిలోకి దిగే శ్రీకర్ భరత్కు మంచి రికార్డులున్నాయని, ఓ ట్రిపుల్ సెంచరీ కూడా ఉందని గుర్తు చేస్తున్నారు. అంతేకాకుండా తాజా ఐపీఎల్లో అతను సత్తా చాటాడని, లాస్ట్ బాల్ సిక్స్ కొట్టి విజయాన్నందించడంతో అతని ఆత్మవిశ్వాసం కూడా పెరిగిందని, అతనికి అవకాశాలివ్వాలని అభిప్రాయపడుతున్నారు. మ్యాచ్ విషయానికి వస్తే.. 129/0 ఓవర్నైట్ స్కోర్తో మూడో రోజు ఆటను ప్రారంభించిన న్యూజిలాండ్ నిలకడగా ఆడుతుంది. పిచ్ పూర్తిగా ఫ్లాట్గా మారడంతో బ్యాటింగ్కు అనుకూలంగా మారింది. ఓవర్ నైట్ బ్యాట్స్మన్ టామ్ లాథమ్(168 బంతుల్లో 50 బ్యాటింగ్), యంగ్(194 బంతుల్లో 80) సెంచరీ దిశగా దూసుకెళ్తున్నారు.
ఇక భారత్ ఫస్ట్ ఇన్నింగ్స్లో 345 పరుగులకు ఆలౌటైన విషయం తెలిసిందే. తొలి రోజు ఆధిపత్యం చెలాయించిన భారత్.. రెండో రోజు దారుణంగా విఫలమైంది. అరంగేట్ర మ్యాచ్లో శ్రేయస్ అయ్యర్(171 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్సర్లతో 105) సెంచరీతో దుమ్మురేపినా.. రెండు సెషన్లలో ఒక్కరిని కూడా ఔట్ చేయలేక బౌలర్లు విఫలమవ్వడంతో న్యూజిలాండ్తో ఫస్ట్ టెస్ట్లో భారత జోరుకు బ్రేకులు పడ్డాయి. దాంతో రెండో రోజు న్యూజిలాండ్దే పై చేయి అయింది.