అదిరిపోయే ఆరంభం..
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్కు ఓపెనర్లు రోహిత్ శర్మ(85 బంతుల్లో 9 ఫోర్లు, 6 సిక్స్లతో 101), శుభ్మన్ గిల్(78 బంతుల్లో 13 ఫోర్లు, 5 సిక్స్లతో 112) సెంచరీలతో కదం తొక్కారు. ఆరంభం నుంచే న్యూజిలాండ్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఫెర్గూసన్ వేసిన 8వ ఓవర్లో శుభ్మన్ గిల్, నాలుగు ఫోర్లు, ఓ సిక్స్తో 22 పరుగులు పిండుకున్నాడు. దాంతో పవర్ ప్లేలోనే టీమిండియా వికెట్ నష్టపోకుండా 82 పరుగులు చేసింది. పవర్ ప్లే అనంతరం అదే జోరును కొనసాగించిన ఈ జోడీ.. న్యూజిలాండ్ బౌలర్లకు చుక్కలు చూపించింది. ఈ క్రమంలో శుభ్మన్ గిల్ 33 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేస్తుకోగా.. 39 బంతుల్లో రోహిత్ శర్మ అర్థ సెంచరీ సాధించాడు.
రోహిత్, శుభ్మన్ సెంచరీలు..
ప్రతీ ఓవర్లో సిక్సర్, బౌండరీ బాదుతూ చెలరేగిన ఈ జోడీ స్కోర్ బోర్డును పరుగెత్తింది. టిక్నర్ వేసిన 26వ ఓవర్లో సింగిల్తో రోహిత్ 83 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మూడేళ్ల నీరిక్షణకు తెరదించుతూ శతకాన్ని అందుకున్నాడు. అదే ఓవర్లో బౌండరీతో శుభ్మన్ గిల్ సైతం 72 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సెంచరీ అనంతరం రోహిత్ శర్మను బ్రేస్వెల్ క్లీన్ బౌల్డ్ చేయడంతో తొలి వికెట్కు నమోదైన 212 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ వెంటనే శుభ్మన్ గిల్(112) సైతం టిక్నర్ బౌలింగ్లోనే క్యాచ్ ఔటయ్యాడు.
విఫలమైన కోహ్లీ, ఇషాన్, సూర్య..
ఈ పరిస్థితుల్లో కోహ్లీ, ఇషాన్ ఇన్నింగ్స్ను కొనసాగించే ప్రయత్నం చేశారు. ఇషాన్ తడబడినా.. కోహ్లీ ధాటిగా ఆడాడు. ఇషాన్ కిషన్ సైతం సిక్సర్తో టచ్లోకి వచ్చాడు. కానీ సమన్వయలోపంతో రనౌట్గా వెనుదిరిగాడు. ఆ కొద్దిసేపటికే భారీ షాట్ ఆడే ప్రయత్నంలో విరాట్ కోహ్లీ వెనుదిరిగాడు. క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ సిక్సర్తో జోరు కనబర్చినా.. ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేకపోయాడు. డఫ్పీ బౌలింగ్లో క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు.
హాఫ్ సెంచరీతో మెరిసిన హార్దిక్ పాండ్యా..
క్రీజులోకి వచ్చిన హార్దిక్ పాండ్యా భారీ షాట్లు ఆడగా.. సుందర్(9) విఫలమయ్యాడు. క్రీజులోకి వచ్చిన శార్దూల్ ఠాకూర్తో కలిసి స్కోర్ బోర్డును హార్దిక్ పాండ్యా పరుగెత్తించాడు. ఇన్నింగ్స్ చివర్లో శార్దూల్ ఠాకూర్ ఔటైనా.. 36 బంతుల్లో హార్దిక్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత భారీ షాట్ ఆడే ప్రయత్నంలో హార్దిక్ వెనుదిరగడంతో భారత్ 385 పరుగులకు పరిమితమైంది.