|
అసలేం జరిగిందంటే..
డారిల్ మిచెల్ వేసిన భారత ఇన్నింగ్స్ 40వ ఓవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. మిచెల్ వేసిన ఈ ఓవర్ నాలుగో బంతి అనూహ్యంగా బౌన్స్ అయి కీపర్ టామ్ లాథమ్ చేతిలో పడింది. అయితే వికెట్ బెయిల్స్ పడటంతో న్యూజిలాండ్ ఆటగాళ్లు అప్పీల్ చేయగా.. ఫీల్డ్ అంపైర్లు సమీక్ష కోరారు. థర్డ్ అంపైర్ పలు కోణాల్లో రీప్లేలు పరిశీలించాడు.
బంతి బ్యాట్కు తాకిందో లేదోనని అల్ట్రా ఎడ్జ్లో చెక్ చేసాడు. బంతి బ్యాట్కు తాకలేదని నిర్దారణకు వచ్చాక.. వికెట్ కీపర్ గ్లోవ్స్ తాకిందా? అనే కోణంలో పరిశీలించాడు.
|
స్పష్టత లేకున్నా..
వికెట్ కీపర్ గ్లోవ్స్ బెయిల్స్కు దగ్గరగా ఉన్నా తాకినట్లు ఆధారాలు లభించలేదు. అలాగే బంతి వికెట్లను తాకినట్లు కూడా ఆధారం లేదు. కీపర్ చేతిలో బంతి పడిన తర్వాత బెయిల్స్ లైట్ వెలిగి కిందపడ్డాయి. దాంతో నాటౌట్ అని అంతా అనుకున్నారు. కానీ థర్డ్ అంపైర్ మాత్రం ఔట్ ప్రకటించాడు. దాంతో అంతా విస్మయపోయారు. హార్దిక్ పాండ్యా అయితే నిరాశగా పెవిలియన్ చేరాడు. గట్టిగా అరుస్తూ అంపైర్పై తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు.
|
శుభ్మన్ గిల్కు సైతం..
బ్రాస్వెల్ వేసిన మరుసటి ఓవర్లో శుభ్మన్ గిల్ ఆడేటప్పుడు కూడా ఇలానే బెయిల్స్ కిందపడ్డాయి. కానీ రీప్లేలో కీపర్ గ్లోవ్స్ తాకినట్లు కనిపించింది. ఈ ఘటనతో హార్దిక్ విషయంలో కూడా ఇదే జరగవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. థర్డ్ అంపైర్కు స్పష్టత లేనప్పుడు బెన్ఫిట్ ఆఫ్ బ్యాట్స్మన్ రూల్ కింద నాటౌట్ ఇవ్వాల్సిందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.
|
శుభ్మన్ సెంచరీ..
ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన టీమిండియాకు ఓపెనర్లు రోహిత్ శర్మ(34),శుభ్మన్ గిల్ శుభారంభం అందించారు. తొలి వికెట్కు 60 పరుగులు జోడించిన అనంతరం భారీ షాట్ ఆడే క్రమంలో రోహిత్ ఔటయ్యాడు. ఆ తర్వాత ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన విరాట్ కోహ్లీ(8) మిచెల్ సాంట్నర్ స్టన్నింగ్ డెలివరీకి బౌల్డ్ అయ్యాడు. ఆ వెంటనే ఇషాన్ కిషన్ కూడా క్యాచ్ ఔటవ్వగా.. సూర్యకుమార్ యాదవ్(31) తనదైన శైలిలో మెరుపులు మెరిపించాడు. కానీ ఎక్కువ సేపు ఆడలేకపోయాడు.
ఈ క్రమంలో హార్దిక్ పాండ్యాతో కలిసి శుభ్మన్ కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. ఈ క్రమంలో 150 పరుగుల మార్క్ను అధిగమించిన శుభ్మన్ కెరీర్ బెస్ట్ స్కోర్ అందుకున్నాడు. ఐదో వికెట్కు 74 పరుగులు జోడించిన అనంతరం హార్దిక్ విచిత్ర పరిస్థితుల్లో పెవిలియన్ చేరాడు. దాంతో టీమిండియా 249 పరుగులకు ఐదు వికెట్లు కోల్పోయింది. వాషింగ్టన్ సుందర్(12) ఔటైనా.. శార్దూల్ ఠాకూర్తో కలిసి శుభ్మన్ జట్టును భారీ స్కోర్ దిశగా నడిపిస్తున్నాడు.