సౌతాంప్టన్: న్యూజిలాండ్తో జరుగుతున్న వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్లో టీమిండియా బ్యాటింగ్ కష్టాలు కొనసాగుతున్నాయి. క్రీజులో నిలదొక్కుకున్న వైస్ కెప్టెన్ అజింక్యా రహానే(49)కూడా ఔటయ్యాడు. నీల్ వాగ్నర్ వేసిన బంతికి చెత్త షాట్తో సునాయస క్యాచ్ ఇచ్చి తృటిలో హాఫ్ సెంచరీ చేజార్చుకున్నాడు. అయితే రహానే.. ఇక్కడ న్యూజిలాండ్ ట్రాప్లో పడిపోయాడు. తమ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటున్న రహానేను ఔట్ చేయడానికి న్యూజిలాండ్ సారథి కేన్ విలియమ్సన్ అప్పటికప్పుడు అద్భుత వ్యూహాన్ని రచించి ఫలితం సాధించాడు.
నీల్ వాగ్నర్ వేసిన 79వ ఓవర్లో రెండు బంతులను డాట్ చేసిన రహానే మూడో బంతిగా వచ్చిన షార్ట్ బాల్ను గాల్లోకి ఆడాడు. బంతి స్వ్కేర్ లెగ్ దిశల పడగా.. అక్కడ ఫీల్డర్లు ఎవరూ లేకపోవడంతో రెండు పరుగులు వచ్చాయి. ఆ పరుగులతో 49 రన్స్ మార్క్ అందుకోగా.. హాఫ్ సెంచరీ కోసం సింగిల్ తీస్తాడని భావించిన కేన్ విలియమ్సన్.. దాన్ని అడ్డుకునే వ్యూహంలో భాగంగా లెగ్ అంపైర్ పక్కనే టామ్ లాథమ్ను ఫీల్డింగ్ పెట్టాడు. ఇక వాగ్నర్ అదే తరహా షార్ట్ పిచ్ బాల్ వేయగా.. షాట్ ఆడలా?.. వద్దా? అనే అయోమయంలో రహానే వికెట్ సమర్పించుకున్నాడు. బ్యాట్కు తాకిన బంతి నేరుగా టామ్ లాథమ్ చేతిలో పడింది.
అయితే రహానే హాఫ్ సెంచరీ మార్క్ కోసం సింగిల్ తీసే ప్రయత్నంలో ఆడినట్లు కనిపించింది. కొంచెం గట్టిగా ఆడినా బంతి బౌండరీకి వెళ్లేది. కానీ కేన్ మామ బిగించిన ఉచ్చులో రహానే చిక్కుకున్నాడు. వాస్తవానికి ఆబంతి గొప్పదేం కాదు. మంచి బంతులను సమర్థవంతంగా ఎదుర్కొన్న రహానే.. అనవసర షాట్తో వెనుదిరిగాడు. దాంతో భారత్ ఐదో వికెట్ కోల్పోయింది.
146/3 ఓవర్నైట్ స్కోర్తో మూడో రోజు ఆటను కొనసాగించిన భారత్ ఆదిలోనే బిగ్ వికెట్ కోల్పోయింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ(44) ఒక్క పరుగు కూడా చేయకుండానే వెనుదిరిగాడు. కైల్ జెమీసన్ వేసిన అద్భుత బంతికి అతను వికెట్ల ముందు దొరికిపోయాడు. రివ్యూ తీసుకున్నా ఫలితం లేకపోయింది. ఆ తర్వాత ఎన్నో అంచనాల మధ్య బరిలోకి దిగిన పంత్.. ఓ బౌండరీ కొట్టిన ఉత్సాహంలో అనవసర షాట్ ఆడి వికెట్ సమర్పించుకున్నాడు. జెమీసన్ బౌలింగ్లోనే స్లిప్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
ఆ తర్వాత జడేజా రాగా.. రహానే ఔటయ్యాడు. క్రీజులోకి అశ్విన్తో కలిసి జడేజా భారత స్కోర్ను 200 ధాటించగా..అశ్విన్(22) సౌథీ ఔట్ చేశాడు. దాంతో 205 పరుగులకే భారత్ 7 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ప్రస్తుతం క్రీజులో జడేజా(11), ఇషాంత్ శర్మ ఉన్నారు.