డబ్లిన్: ఇంగ్లండ్తో ప్రధాన పోరుకు ముందు భారత క్రికెట్ జట్టు మరో సంక్షిప్త సిరీస్కు సన్నద్ధమైంది. ఐర్లాండ్తో రెండు టీ20 మ్యాచ్ల పోరులో భాగంగా నేడు(ఆదివారం) రాత్రి 9 గంటలకు తొలి మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్లో టీమిండియా హాట్ ఫేవరేట్గా బరిలోకి దిగుతున్నప్పటికీ.. భారత్కు గట్టి పోటీ ఇవ్వాలని ఐర్లాండ్ కూడా భావిస్తోంది. ఈ క్రమంలోనే ఆ జట్టు స్టార్ ఆల్రౌండర్ మార్క్ అడైర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కెప్టెన్ హార్దిక్ పాండ్యాతో పాటు దినేష్ కార్తీక్, సంజూ శాంసన్లను త్వరగా ఔట్ చేయాలని భావిస్తున్నట్లు మార్క్ అడైర్ తెలిపాడు. ఈ ముగ్గురు ప్రస్తుతం సూపర్ ఫామ్లో ఉన్నారని, వీరిని కట్టడి చేస్తే సగం మ్యాచ్ గెలిచినట్లేనని చెప్పుకొచ్చాడు.
'టీమిండియాలో హార్ధిక్ పాండ్యా, దినేష్ కార్తీక్, సంజూ శాంసన్ వంటి విధ్వంసకర ఆటగాళ్లు ఉన్నారు. వారు ఏ స్థానంలోనైనా అద్భుతంగా బ్యాటింగ్ చేయగలరు. ముఖ్యంగా దినేష్ కార్తీక్ భీకర ఫామ్లో ఉన్నాడు. గత కొన్ని మ్యాచ్ల నుంచి కార్తీక్ ఏ విధంగా ఆడుతున్నాడో మనం చూస్తున్నాం. ఈ మ్యాచ్లో ఈ ముగ్గురు విఫలమైతే విజయం మాదే. కాబట్టి ఈ ముగ్గురును అడ్డుకునేందుకు మేము ప్రయత్నిస్తాం" అని అడైర్ పేర్కొన్నాడు.
అగ్రశ్రేణి ఆటగాళ్లు టెస్టు మ్యాచ్ కోసం సిద్ధమవుతున్న నేపథ్యంలో టెస్టు టీమ్లో లేని ఇతర ఆటగాళ్లతోనే టీమిండియా బరిలోకి దిగనుంది.
సౌతాఫ్రికాతో స్వదేశంలో ఆడిన జట్టే దాదాపుగా ఇక్కడా ఉండగా... కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యా తొలిసారి భారత జట్టును నడిపించబోతున్నాడు. రాహుల్ ద్రవిడ్ ప్రధాన జట్టుతో ఉండటంతో వీవీఎస్ లక్ష్మణ్ ఈ సిరీస్కు తాత్కాలిక కోచ్గా వ్యవహరిస్తాడు. బలబలాలు, గత రికార్డును చూస్తే ఐర్లాండ్పై భారత్దే స్పష్టంగా పైచేయి కాగా, సొంతగడ్డపై సత్తా చాటాలని ఐర్లాండ్ భావిస్తోంది.
సౌతాఫ్రికాతో జరిగిన సిరీస్లో తొలి మ్యాచ్ నుంచి చివరి వరకు మార్పు లేకుండా ఆ 11 మందినే ఆడించారు. అయితే ఈసారి టీమ్ మేనేజ్మెంట్ కొత్తగా ప్రయత్నించవచ్చు. పేసర్లు అర్షదీప్, ఉమ్రాన్ మాలిక్లు అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగు పెట్టవచ్చని అంచనా. బ్యాటింగ్పరంగా గత మ్యాచ్ ఆడిన తుది జట్టును చూస్తే పంత్, అయ్యర్ లేరు కాబట్టి రెండు స్పష్టమైన ఖాళీలు ఉన్నాయి. ప్రస్తుత జట్టు నుంచి రాహుల్ త్రిపాఠి అరంగేట్రం చేయకపోగా, సామ్సన్ మరో చాన్స్ కోసం చూస్తున్నాడు.