పేలవ ఫామ్తో ఇబ్బంది పడుతున్న టీమిండియా విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మకు సంజూ శాంసన్ అండగా నిలిచాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్లో అభిషేక్ శర్మ చెలరేగుతాడని జోస్యం చెప్పాడు. అంతర్జాతీయ క్రికెట్లో ఫామ్ కోల్పోవడం సాధారణమేనని, తనదైన రోజున అభిషేక్ శర్మ విజృంభిస్తాడని, అది ఫైనలే కావచ్చని అభిప్రాయపడ్డాడు.
ఇంగ్లండ్తో గురువారం వాంఖడే మైదానం వేదికగా జరిగిన సెమీఫైనల్లో టీమిండియా 7 పరుగుల తేడాతో గట్టెక్కింది. సంజూ శాంసన్ (42 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్స్లతో 89) విధ్వంసం.. జస్ప్రీత్ బుమ్రా అసాధారణ బౌలింగ్.. అక్షర్ పటేల్ కళ్లు చెదిరే ఫీల్డింగ్ టీమిండియాను విజేతగా నిలబెట్టాయి. ఆదివారం అహ్మదాబాద్ వేదికగా జరిగే ఫైనల్లో న్యూజిలాండ్తో టీమిండియా అమీతుమీ తేల్చుకోనుంది.
సెమీఫైనల్ విజయానంతరం భారత్ తరఫున మీడియా సమావేశంలో పాల్గొన్న సంజూ శాంసన్.. అభిషేక్ శర్మ ఫామ్పై స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'మా డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం బాగుంది. అభిషేక్ శర్మపై మాకు గట్టి నమ్మకం ఉంది. మేమంతా అతనికి అండగా ఉన్నాం. ప్రతీ క్రికెటర్ కెరీర్లో ఒడిదొడుకులు ఉంటాయి.
ఈ ఫార్మాట్లో ఒకటి, రెండు మంచి షాట్లు కొడితే.. అంతా కుదురుకుంటుంది. మాకు అతనిపై పూర్తి నమ్మకం ఉంది. తనదైన రోజున అభిషేక్ శర్మ విధ్వంసం సృష్టిస్తాడు. ఎవరికి తెలుసు.. అది టీ20 ప్రపంచకప్ ఫైనల్ అవుతుందేమో'అని సంజూ శాంసన్ చెప్పుకొచ్చాడు.

సోషల్ మీడియాకు దూరంగా ఉండటం వ్యక్తిగతంగా తనకు కలిసొచ్చిందని సంజూ శాంసన్ చెప్పాడు. ఇప్పటికీ తాను సోషల్ మీడియా వాడటం లేదని చెప్పాడు. 'గత కొన్నేళ్లుగా దేశం కోసం ఇలాంటి ఇన్నింగ్స్ ఆడాలని ఎదురు చూస్తున్నాను. సోషల్ మీడియాకు దూరంగా ఉండి.. నా ఆటపైనే దృష్టి పెట్టాను. ఆ నిశ్శబ్దమే నాకు ఈ రోజు ఇంతటి ఏకాగ్రతను ఇచ్చింది.
న్యూజిలాండ్తో సిరీస్లో నా వైఫల్యం సవాల్గా అనిపించింది. ఫామ్ అందుకొని దేశానికి ఆడాలని గట్టిగా అనుకున్నాను. నిజానికి నేను న్యూజిలాండ్తో సిరీస్లో ఎక్కువ ప్రయత్నించాననిపించింది. టీ20 క్రికెట్ చాలా విచిత్రమైనది. ప్రపంచంలోకెల్లా అత్యుత్తమ బ్యాటర్లు కూడా ఈ ఫార్మాట్లో పరుగులు చేసేందుకు ఇబ్బంది పడుతారు.

గతంలో జోఫ్రా ఆర్చర్ బౌలింగ్లో నేను ఇబ్బంది పడిన సందర్భాలు ఉన్నాయి. అందుకే ఈ మ్యాచ్ కోసం ప్రత్యేకంగా సిద్ధమయ్యాను. అతను వరల్డ్ క్లాస్ బౌలర్. అతన్ని గౌరవిస్తూనే నా శైలిలో అటాక్ చేయాలనుకున్నాను.
నేనేమీ రెండు సెంచరీలు మిస్ అవ్వలేదు. వరుసగా 97, 89 పరుగులు చేయడం అనేది చాలా పెద్ద విషయం. ముఖ్యంగా వరల్డ్ కప్ సెమీఫైనల్ లాంటి మ్యాచ్లో జట్టు విజయానికి నా వంతు సహకారం అందించడం నాకు సెంచరీ కంటే ఎక్కువే.
ఇది టెస్ట్ లేదా వన్డే మ్యాచ్ కాదు. ఇది టీ20 ఫార్మాట్. ఇక్కడ 100 పరుగులు చేశానా లేదా అనేది ముఖ్యం కాదు. నేను చేసిన పరుగులు జట్టు గెలవడానికి ఎంతవరకు ఉపయోగపడ్డాయి అనేదే కీలకం. 250 పైగా స్కోరు చేయడంలో నా వంతు పాత్ర పోషించినందుకు సంతోషంగా ఉంది.
గతంలో చాలాసార్లు దురదృష్టవశాత్తూ అవకాశాలు కోల్పోయాను. కానీ ఈ టోర్నీలో అదృష్టం కూడా నాకు తోడైంది(హ్యారీ బ్రూక్ క్యాచ్ వదిలేయడంపై). క్యాచ్ డ్రాప్ అయినప్పుడు నేను దాని గురించి ఎక్కువగా ఆలోచించలేదు. వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుని జట్టుకు భారీ స్కోరు అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నాను.
సెమీఫైనల్ గెలవడం ఆనందంగా ఉంది. కానీ అసలు పని ఇంకా పూర్తి కాలేదు. ఫైనల్లో కూడా ఇదే తరహా ప్రదర్శన చేసి కప్పు గెలవడమే మా ముందున్న లక్ష్యం.' అని సంజూ శాంసన్ చెప్పుకొచ్చాడు.
