మయాంక్ ఔట్..
ఇక ఈ ప్రతిష్టాత్మక సిరీస్ ప్రారంభానికి ముందే భారత్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ ప్రాక్టీస్ సెషన్లో కంకషన్కు గురయ్యాడు. మహమ్మద్ సిరాజ్ వేసిన షార్ట్ పిచ్ బాల్ అతని తలకు తగలడంతో అతను ఫస్ట్ టెస్ట్కు దూరయ్యాడు. దాంతో రోహిత్ శర్మకు జతగా కేఎల్ రాహుల్ దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. వాస్తవానికి రోహిత్కు జతగా మయాంక్ను ఆడించి రాహుల్ను మిడిలార్డర్లో ఆడించాలని కోహ్లీసేన భావించింది. తద్వారా బలహీనంగా ఉన్న బ్యాటింగ్ లైనప్ను పటిష్టం చేయాలనుకుంది. కానీ ఆదిలోనే కోహ్లీసేనకు మయాంక్ రూపంలో గట్టి సవాల్ ఎదురైంది.
పుజారాకు మరో చాన్స్..
ఇటీవల కాలంలో దారుణంగా విఫలమవుతున్న టీమిండియా నయావాల్ చతేశ్వర్ పుజరాకు మరో అవకాశం దక్కనుంది. వరుసగా విఫలమవుతున్నా అతని బ్యాటింగ్ సామర్థ్యంపై కెప్టెన్ కోహ్లీ మరోసారి నమ్మకం ఉంచనున్నాడు. దాంతో అతను ఫస్ట్ డౌన్లో రానుండగా.. కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ అజింక్యా రహానే, వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్మన్ రిషభ్ పంత్ నాలుగు, ఐదు, ఆరో స్థానాల్లో బ్యాటింగ్కు రానున్నారు. ప్రస్తుతానికైతే ఈ బ్యాటింగ్ ఆర్డర్లో ఎలాంటి మార్పులేదు. రోహిత్, రాహుల్ మంచి ఆరంభాన్ని అందించి.. ఈ నలుగురులో ఏ ఇద్దరూ రాణించినా భారత బ్యాటింగ్కు తిరుగుండదు.
జడేజా/ శార్దూల్ ఠాకూర్..
ఇక ఫస్ట్ టెస్ట్ కోసం ఇంగ్లండ్ వేల్స్ బోర్డు పేస్కు అనుకూలంగా ఉండే పిచ్ను సిద్దం చేస్తున్నట్లు తెలుస్తోంది. భారత్లో పూర్తిగా స్పిన్ పిచ్లు రెడీ చేసి ప్రయోజనం పొందినట్లు ఇక్కడ.. వీరు పేస్, స్వింగ్కు అనుకూలించే వికెట్లు సిద్దం చేసే అవకాశం ఉంది. మైదానంలోని వికెట్ ఫొటోలు చూస్తుంటే పిచ్పై పచ్చిక ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తిగా పేస్కు అనుకూలమైన పిచ్ను సిద్దం చేస్తే మాత్రం భారత్ ఎక్స్ట్రా పేసర్తో బరిలోకి దిగనుంది. అప్పుడు శార్దూల్ ఠాకూర్కు జట్టులో చోటు దక్కడం ఖాయం. అలా కానీ పరిస్థితుల్లో రెగ్యూలర్ స్పిన్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజాకు అవకాశం దక్కుతుంది. ఇక స్పెషలిస్ట్ స్పిన్నర్ కోటాలో రవిచంద్రన్ అశ్విన్కు చోటు ఖాయం.
సిరాజ్/మహమ్మద్ షమీ..
స్వింగ్ బౌలర్ల కొరతతో పాటు ఎక్స్ ట్రా పేసర్ లేకుండా న్యూజిలాండ్తో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో బరిలోకి దిగి కోహ్లీసేన మూల్యం చెల్లించుకుంది. ఆ అనుభవం దృష్ట్యా టీమ్మేనేజ్మెంట్ స్వింగ్ బౌలర్లకు అధిక ప్రాధాన్యత ఇవ్వవచ్చు. ఆ లెక్కన హైదరాబాద్ పేసర్ మహమ్మద్ సిరాజ్కు జట్టులో చోటు దక్కడం ఖాయం. అలా కాకుండా అనుభవానికే ఓటేస్తే మాత్రం ఇషాంత్ శర్మ, మహమ్మద్ షమీ బరిలోకి దిగుతారు. లీడ్ పేసర్గా జస్ప్రీత్ బుమ్రా ఆడటం ఖాయం. సిరాజ్ను తీసుకుంటే షమీని పక్కనపెట్టవచ్చు. ఒకవేళ ఇషాంత్కు ఫిట్నెస్ సమస్యలుంటే షమీ బరిలోకి దిగుతాడు.
బెన్ స్టోక్స్ ఔట్.. కరన్ ఇన్
ఈ సిరీస్కు బెన్ స్టోక్స్లాంటి స్టార్ ఆటగాడు దూరం కావడం ఇంగ్లండ్కు పెద్ద దెబ్బ. అయితే యువ ఆల్రౌండర్ సామ్ కరన్ ఆ స్థానంలో తన వంతు పాత్ర పోషించనున్నాడు. అండర్సన్, బ్రాడ్లాంటి సీనియర్లతో పాటు రాబిన్సన్ మూడో పేసర్గా ఆడవచ్చు. ఇటీవల భారత పర్యటనకు వెళ్లి ఘోరమైన ప్రదర్శన కనబర్చిన బ్యాట్స్మెన్ బర్న్స్, సిబ్లీ, క్రాలీలకు సొంతగడ్డపైనైనా రాణించి ఆకట్టుకునేందుకు ఇది సరైన అవకాశం. ప్రధాన బ్యాట్స్మన్గా, కెప్టెన్గా తీవ్ర ఒత్తిడిలో ఉన్న రూట్కు కూడా ఈ సిరీస్ కీలకం
కానుంది.
ఫస్ట్ టెస్ట్.. తుది జట్లు(అంచనా)
భారత్: రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ(కెప్టెన్), అజింక్యా రహానే(వైస్ కెప్టెన్), రిషభ్ పంత్(కీపర్), రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ షమీ/మహమ్మద్ సిరాజ్, ఇషాంత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా
ఇంగ్లండ్: జో రూట్ (కెప్టెన్),రోరీ బర్న్స్, డామ్ సిబ్లీ, జాక్ క్రాలీ, జానీ బెయిర్స్టో, జోస్ బట్లర్, స్యామ్ కరన్, రాబిన్సన్, స్టువర్ట్ బ్రాడ్, జాక్ లీచ్, జేమ్స్ అండర్సన్