నాటింగ్హమ్: ఐదు టెస్ట్ మ్యాచుల సిరీస్లో భాగంగా నాటింగ్హమ్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు ఆట అర్ధాంతరంగా ముగిసింది. గురువారం రెండో సెషన్ జరుగుతునప్పటి నుంచీ వరుణుడు పదేపదే అడ్డుపడ్డాడు. దీంతో పలుమార్లు ఆటకు అంతరాయం కలిగింది. మూడుసార్లు ప్లేయర్స్ మైదానంలోకి వచ్చి వెళ్లారు. దీంతో అంపైర్లు రెండో రోజు ఆటను నిర్ణీత సమయం కంటే ముందుగానే ముగించారు. రెండో రోజు ఆట పూర్తయ్యేసరికి భారత్ 46.4 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (57), రిషబ్ పంత్ (7) నాటౌట్గా నిలిచారు. భారత్ ఇంకా 58 పరుగుల వెనుకంజలో నిలిచింది.
వరుణుడి దోబూచులాట:
వర్షం కారణంగా రెండో రోజు ఆటకు మూడోసారిర్లు అంతరాయం కలిగింది. రెండో సెషన్లో భారత్ 46.1 ఓవర్ల వద్ద 125/4 స్కోరుతో కొనసాగుతున్న వేళ వెలుతురు లేమి కారణంగా అంపైర్లు మొదటిసారి ఆటను నిలిపివేశారు. కాసేపటికే వర్షం కురవడంతో.. ఆట మరింత ఆలస్యమైంది. దీంతో టీ విరామంను అంపైర్లు ముందుగానే ప్రకటించారు. ఆపై వర్షం కురవడం ఆగిపోయి వెలుతురు బాగా ఉండటంతో.. అంపైర్లు ఆటను కొనసాగించారు. జేమ్స్ అండర్సన్ ఒక బంతి వేయగానే మళ్లీ వర్షం కురిసింది. దాంతో రెండోసారి ఆటను ఆపేశారు. కాసేపటికే వర్షం నిలిచిపోవడంతో మళ్లీ ఆటను కొనసాగించారు. అండర్సన్ మరో రెండు బంతులు వేయగానే.. వర్షం మరోసారి అడ్డుపడింది. దాంతో మూడోసారి ఆగిపోయింది. వర్షం కారణంగా మైదానం చిత్తడిగా మారడంతో అంపైర్లు చివరకు రెండో రోజు ఆటను రద్దు చేశారు.
తొలి వికెట్కు 97 పరుగులు:
అంతకుముందు భారత్ 21/0 ఓవర్నైట్ స్కోరుతో గురువారం రెండో రోజు ఆటను ప్రారంభించింది. ఓపెనర్లు రోహిత్ శర్మ (36; 107 బంతుల్లో 6x4), కేఎల్ రాహుల్ (57; 151 బంతుల్లో 9x4ñ) తొలి వికెట్కు 97 పరుగులు జోడించారు. ఇద్దరూ ఎలాంటి అనవసరపు షాట్లకు వెళ్లకుండా ఆచితూచి ఆడారు. ముఖ్యంగా రోహిత్ తన శైలికి బిన్నంగా ఎంతో సహనంతో బ్యాటింగ్ చేశాడు. రాహుల్ మాత్రం వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ స్కోర్ వేగం పెంచాడు. అయితే భోజన విరామానికి ముందు ఓలి రాబిన్సన్ బౌలింగ్లో భారీ షాట్ ఆడబోయిన రోహిత్.. సామ్ కరన్ చేతికి చిక్కాడు. అప్పటికి జట్టు స్కోర్ 97/1గా నమోదైంది. అదే సమయంలో టీమిండియా భోజనానికి వెళ్లింది.
టీమిండియాకు భారీ షాక్:
రెండో సెషన్ ఆరంభంలోనే టీమిండియాకు భారీ షాక్ తగిలింది. అరగంటలోనే మూడు కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. జేమ్స్ అండర్సన్ వేసిన 41వ ఓవర్లో చేతేశ్వర్ పుజారా (4), కెప్టెన్ విరాట్ కోహ్లీ (0) వరుస బంతుల్లో కీపర్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగారు. కాసేపటికే వైస్ కెప్టెన్ అజింక్య రహానె (5) అనవసర పరుగుకు యత్నించి రనౌటయ్యాడు. రాహుల్తో సమన్వయ లోపం కారణంగా జింక్స్ వెనుదిరగాల్సి వచ్చింది. దాంతో భారత్ 112 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి మరింత కష్టాల్లో పడింది. ఈ సమయంలో జోడీ కట్టిన రాహుల్, పంత్ మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. ఈ క్రమంలోనే పలుమార్లు వర్షం అంతరాయం కలిగించడంతో రెండో రోజు ఆట పూర్తయింది.
183 పరుగులకే ఇంగ్లండ్ ఆలౌట్:
ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ తొలిరోజే స్పష్టమైన ఆధిక్యం కనబరిచింది. భారత పేస్ బౌలర్లు తమ ప్రదర్శనతో దుమ్మురేపడంతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 183 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్ జో రూట్ (108 బంతుల్లో 64; 11 ఫోర్లు) మాత్రమే భారత బౌలర్లను ఎదుర్కొని అర్ధ సెంచరీ సాధించాడు. మిగతావారంతా విఫలమయ్యారు. జస్ప్రీత్ బుమ్రాకు 4 వికెట్లు దక్కగా.. మొహమ్మద్ షమీ 3 కీలక వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత బ్యాటింగ్ ఆరంభించిన టీమిండియా తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 21 పరుగులు చేసింది.