వైస్ కెప్టెన్ అవుతానని అస్సలు ఊహించలేదు.. ఆనందం పట్టలేకున్నా: రాహుల్

దుబాయ్: సుదీర్ఘ ఆస్ట్రేలియా పర్యటన కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సోమవారం జంబో బృందాన్ని ఎంపిక చేసిన విషయం తెలిసిందే. చీఫ్ సెలెక్టర్ సునీల్ జోషి నేతృత్వంలోని భారత సెలక్టర్ల బృందం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమై మొత్తం 32 మందిని ఈ పర్యటన కోసం ఎంపిక చేసింది. నవంబర్ 27న వన్డే సిరీస్తో మొదలయ్యే ఈ పర్యటనలో భారత్ మూడు వన్డేలు, మూడు టీ20లు, నాలుగు టెస్టు మ్యాచ్లు ఆడనుంది. వచ్చే ఏడాది జనవరి 19వ తేదీతో ఈ పర్యటన ముగియనుంది. ప్రస్తుత ఐపీఎల్ ఫామ్ ఆధారంగా కొందరు యువ ఆటగాళ్లు జాతీయ జట్టులో చోటు దక్కించుకున్నారు. ఇక నిలకడగా రాణిస్తున్న కేఎల్ రాహుల్ ఆస్ట్రేలియా టూర్కు అన్ని ఫార్మట్లలో ఎంపికయ్యాడు.

వైస్ కెప్టెన్ అవుతానని ఊహించలేదు:
రోహిత్ శర్మ గైర్హాజరీలో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ఆస్ట్రేలియా టూర్లోని వన్డే, టీ20 జట్లకు వైస్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. రాహుల్ వైస్ కెప్టెన్గా ఎంపికవడం పట్ల తాజాగా స్పందించాడు. 'ఆస్ట్రేలియా టూర్లో టీమిండియాకు వైస్ కెప్టెన్గా వ్యవహరించడం సంతోషంగా ఉంది. నా దృష్టిలో ఇది గర్వించదగిన విషయం. అసలు నేను వైస్ కెప్టెన్ అవుతానని ఊహించలేదు. ఈ బాధ్యతను నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నా. నా వంతు బాధ్యతగా జట్టును విజయవంతగా నడిపించడానికి ప్రయత్నిస్తా' అని రాహుల్ తెలిపాడు.

భారత క్రికెట్లో కీలక ఆటగాడు:
గత కొంత కాలంగా నిలకడగా రాణిస్తోన్న కేఎల్ రాహుల్ భారత క్రికెట్లో కీలక ఆటగాడిగా ఎదిగాడు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ షమీ తర్వాతి స్థానానికి చేరుకున్నాడు. భారత జట్టుకు వికెట్ కీపర్ పాత్రలోనూ అదరగొడుతున్నాడు. ఓపెనర్, మిడిల్ ఆర్డర్ ఎక్కడ ఆడినా.. పరుగులు చేస్తున్నాడు. ఇక ఐపీఎల్ 2020లో మూడు పాత్రలో (బ్యాట్స్మన్, కెప్టెన్, కీపర్) రాణిస్తున్నాడు. ఆసీస్ పర్యటనలో రోహిత్ గైర్హాజరీతో వైస్ కెప్టెన్సీ అప్పగించడం ద్వారా బీసీసీఐ అతడికి సరైన గుర్తింపు ఇచ్చింది. ఇక భవిష్యత్తులో కెప్టెన్సీ పగ్గాలు చేపట్టినా ఆశ్చర్యం లేదు.

పంజాబ్ను చాంపియన్గా నిలపడమే లక్ష్యం:
అయితే భారత జట్టుకు వైస్ కెప్టెన్గా కేఎల్ రాహుల్ ఎంపిక సంతోషమే అయినా.. అతని ముందున్న లక్ష్యం మాత్రం కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ను చాంపియన్గా నిలపడమే. కింగ్స్ పంజాబ్ ఆడనున్న తదుపరి రెండు మ్యాచ్లు ఆ జట్టుకి చాలా కీలకం. ఇప్పటికే పంజాబ్ 12 మ్యాచ్ల్లో 6 విజయాలు, 6 ఓటములతో నాలుగో స్థానంలో ఉంది. కాగా కింగ్స్ పంజాబ్ రాజస్తాన్, సీఎస్కేలను ఎదుర్కోనుంది. పంజాబ్ జట్టుకు కోల్కతా నైట్రైడర్స్ నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది.

టాప్ స్కోరర్గా:
ఐపీఎల్ 13వ సీజన్లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. లీగ్లో ఇప్పటివరకు 12 మ్యాచ్లాడిన రాహుల్.. 595 పరుగులతో టాప్ స్కోరర్గా (ఆరెంజ్ క్యాప్) కొనసాగుతున్నాడు. ఒక దశలో వరుస ఓటములతో పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచిన పంజాబ్.. తర్వాత అనూహ్యంగా ఫుంజుకొని వరుసగా ఐదు విజయాలు సాధించింది. పట్టికలో నాలుగో స్థానంలో నిలిచి ప్లేఆఫ్ రేసులో నేనున్నానని ముందుకొచ్చింది. కెప్టెన్ అనే పదానికి నిర్వచనం చెప్పాడు రాహుల్.
MI vs RCB: నిబంధనలు ఉల్లంఘించినా.. పాండ్యా, మోరిస్కు మందలింపు మాత్రమే!!
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications