దుబాయ్: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో ఆల్రౌండర్లు క్రిస్ మోరిస్, హార్దిక్ పాండ్యా వాగ్వాదానికి దిగారు. దీంతో మ్యాచ్ రిఫరీ వీరిద్దర్నీ మందలించారు. అయితే ఎటువంటి శిక్షా వేయకుండా వదిలేశారు. మరోవైపు టీ20 లీగ్ యాజమాన్యం కూడా మందలించినట్టు సమాచారం. వీరిద్దరూ గత మ్యాచ్లో లీగ్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారు.
మ్యాచ్లో 19వ ఓవర్ క్రిస్ మోరిస్ వేశాడు. ఆ ఓవర్లో ఐదో బంతికి హార్దిక్ పాండ్యా సిక్సర్ కొట్టాడు. వెంటనే మోరిస్ను ఉద్దేశిస్తూ పాండ్యా కొన్ని వ్యాఖ్యలు చేశాడు. అయితే ఆ తర్వాతి బంతికి పాండ్యాను మోరిస్ ఔట్ చేసి అదే స్థాయిలో స్పందించాడు. దీంతో వీరిద్దరి మధ్య కొంతసేపు మాటల యుద్ధం జరిగింది. ఇది గమనించిన ఫీల్డ్ అంపైర్లు మ్యాచ్ ముగియగానే లీగ్ యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. అయితే ఈ విషయంలో మ్యాచ్ రిఫరీదే తుది నిర్ణయమని యాజమాన్యం స్పష్టం చేసింది.
ఆ తర్వాత నిబంధనలు ఉల్లంఘించినట్లు క్రిస్ మోరిస్, హార్దిక్ పాండ్యా ఒప్పుకొన్నారు. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని లెవల్ 1-2.5ను మోరిస్.. లెవల్ 1-20ను పాండ్యా అతిక్రమించాడు.దీంతో కోడ్ ఆఫ్ కండక్ట్ లెవల్ 1 బ్రీచ్ కింద మ్యాచ్ రిఫరీ ఇద్దర్నీ మందలించారు. ఈ మేరకు ఐపీఎల్ ఓ ప్రకటన జారీ చేసింది. అక్కడితో ఈ వివాదం ముగిసింది. మొత్తానికి ఇద్దరూ ఎలాంటి శిక్ష లేకుండా బయటపడ్డారు.
బుధవారం జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్, బెంగళూరుపై ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. సూర్యకుమార్ సూపర్ ఇన్నింగ్స్కు తోడు, బుమ్రా అద్భుత బౌలింగ్తో ప్లేఆఫ్స్కు చేరువైంది. మరోవైపు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 14 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. నువ్వా-నేనా అంటూ పోటీపడే సందర్భంలో భావోద్వేగాలు నియంత్రించుకోవడం ఎవరికైనా కాస్త కష్టమే. ఇక క్రికెట్ వంటి క్రీడల్లో ప్రత్యర్థి జట్టుపై పైచేయి సాధించేందుకు, వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేందుకు ఆటగాళ్లు స్లెడ్జింగ్కు పాల్పడుతూ ఉంటారన్న సంగతి తెలిసిందే.
ఇదేందయ్యో ఇది!! కీపర్ చేతిలోనే బంతి.. 2 పరుగులు తీసిన బ్యాట్స్మెన్!!