
మెల్బోర్న్: ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఫైనల్లో భారత్ ఎట్టకేలకు వికెట్ దక్కించుకుంది. చెత్త ఫీల్డింగ్.. నాసిరకమైన బౌలింగ్తో భారీగా పరుగులు సమర్పించుకున్న భారత బౌలర్లు.. చివరకు జూలు విధిల్చారు. 7 ఫోర్లు, 5 సిక్సర్లతో వీర విహారం చేసిన అలిసా(75)ను రాధా యాదవ్ క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చడంతో భారత్ ఊపిరి పీల్చుకుంది.
తొలి ఓవర్లోనే అలీసా హిలీని ఔట్ చేసే అవకాశం వచ్చినా.. చేజేతులా నేలపాలు చేసిన భారత మహిళలు.. తాము ఎంత తప్పిదం చేశామో రుచి చూశారు. ఫార్వార్డ్లో అలీసా ఇచ్చిన సునాయస క్యాచ్ను యువ సంచలనం షెఫాలీ వర్మ నేలపాలు చేసింది.
ఈ అవకాశంతో ఆకాశమే హద్దుగా చెలరేగిన అలీసా.. 30 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుంది. ఇక అనంతరం భారత బౌలింగ్ను చీల్చి చెండాడింది. వరుస బౌండరీలతో స్కోర్ బోర్డును పరుగెత్తించింది.
శిఖా పాండే వేసిన 11 ఓవర్లోనైతే ఏకంగా హ్యాట్రిక్ సిక్స్లతో మొత్తం 23 పరుగులు పిండుకుంది. ఆమెకు మూనీ కూడా తోడవ్వడంతో భారత బౌలర్లు బెజారెత్తారు. ఏ దశలోనూ వారి విధ్వంసాన్ని అడ్డుకోలేకపోయారు. బౌలర్లు మార్చిన.. ఫీల్డింగ్ ప్లేస్మెంట్ ఛేంజ్ చేసినా ఈ జోడీ జోరును భారతమ్మాయిలు అడ్డుకోలేకపోయారు. ఈ క్రమంలో రాధాయాదవ్ బౌలింగ్లో లాంగాన్లో భారీ షాట్ ఆడగా.. వేద క్యాచ్ పట్టడంతో అలీసా విధ్వంసం ముగిసింది. అనంతరం మెగ్ లానింగ్తో కలిసి బెత్ మూనీ ధాటిగా ఆడే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో 40 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం 15 ఓవర్లలో ఆస్ట్రేలియా వికెట్ నష్టానికి 142 పరుగులు చేసింది.