
అద్భుతం జరగాల్సిందే..
బ్యాటింగ్లో అద్బుతం చేస్తే మినహా భారత మహిళలు తమ చిరకాల కలను సాకారం చేసుకోలేని పరిస్థితిని తెచ్చుకున్నారు. రెండేళ్ల క్రితం వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్లో ప్రస్తుత కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్.. చెలరేగిన రీతిలో మరోసారి రాణిస్తేనే భారత్ చిరస్మరణీయ విజయాన్నందుకుంటుంది. లేకుంటే మరోసారి నిరాశగా వెనుదిరగక తప్పదు. దాదాపు 2003 పురుషుల వన్డే వరల్డ్కప్ పరిస్థితిని తలపించిన ఈ మ్యాచ్లో భారత అమ్మాయిలు ఏం చేస్తారో చూడాలి.లీగ్ దశలో అద్భుత బౌలింగ్తోనే ఫైనల్ చేరిన భారత మహిళలు అదే బౌలింగ్లో దారుణంగా విఫలమయ్యారు. టాస్ గెలవడంతో పిచ్ నుంచి లభించిన సహకారాన్ని, భారత్ చెత్త ఫీల్డింగ్ను అందిపుచ్చుకున్న ఆతిథ్య బ్యాటర్స్ ఆకాశమే హద్దుగా చెలరేగారు.

కొంపముంచిన క్యాచ్ డ్రాప్స్..
ధాటిగా ఆడాలనే పక్కా ప్రణాళికతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా ఓపెనర్లు.. వచ్చి రావడంతోనే భారత బౌలర్లపై విరుచుకుపడ్డారు. తొలి బంతినే బౌండరీగా మలచిన అలీసా హెలీ.. నాలుగో బంతిని బౌండరీ రాబట్టి జోరు కనబర్చింది. అయితే ఆ మరుసటి బంతికే ఫార్వార్డ్లో అలీసా ఇచ్చిన సునాయస క్యాచ్ను యువ సంచలనం షెఫాలీ వర్మ నేలపాలు చేసింది. అప్పుడు హిలీ స్కోర్ 9 పరుగులు. ఈ అవకాశంతో మరింత చెలరేగిన అలీసా.. మరో బౌండరీతో తొలి ఓవర్లోనే 14 పరుగులు పిండుకొని మంచి శుభారంభాన్ని అందించింది. బౌండరీలే లక్ష్యంగా ఆడిన ఆతిథ్య ఓపెనర్లు.. భారత బౌలర్లపై మంచి ప్రణాళికలతో వచ్చినట్లు కనిపించింది. ఇక బెత్ మూనీ ఇచ్చిన రిటర్న్ క్యాచ్ను రాజేశ్వరీ గైక్వాడ్ నేలపాలు చేసింది. అప్పుడు మూనీ చేసిన పరుగులు కేవలం 8. ఈ క్యాచ్లు అందుకుని ఉంటే పరిస్థితి మరోలా ఉండేది.

ఆకాశమే హద్దుగా..
అనంతరం ఈ జోడీ ఆకాశమే హద్దుగా చెలరేగింది. దీంతో పవర్ ప్లే ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 49 పరుగులు చేసింది. ఈ పరిస్థితుల్లో భారత కెప్టెన్ బౌలర్లను మార్చినా.. ఫీల్డింగ్ చేంజ్ చేసినా ఫలితం లేకపోయింది. ఎటు వేసిన బంతిని అటు బౌండరీకి తరలిస్తూ అలీసా వీరవీహారం చేసింది. వరుస ఫోర్లు, సిక్స్ర్లతో ఫియర్ లేస్ గేమ్ను చూపించింది. ఈ క్రమంలో 30 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుంది.
శిఖా పాండే వేసిన 11 ఓవర్లోనైతే ఏకంగా హ్యాట్రిక్ సిక్స్లతో మొత్తం 23 పరుగులు పిండుకుంది. ఆమెకు మూనీ కూడా తోడవ్వడంతో భారత బౌలర్లు బెజారెత్తారు. ఏ దశలోనూ వారి విధ్వంసాన్ని అడ్డుకోలేకపోయారు. రాధాయాదవ్ బౌలింగ్లో లాంగాన్లో భారీ షాట్ ఆడగా.. వేద క్యాచ్ పట్టడంతో అలీసా విధ్వంసం ముగిసింది. అనంతరం మెగ్ లానింగ్తో కలిసి బెత్ మూనీ ధాటిగా ఆడే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో 40 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుంది.

చివర్లో కట్టడి..
అలిసా, బెత్ మూనీ జోరు చూస్తే ఆసీస్ సులువుగా 200 పరుగులు చేస్తుందనిపించింది. కానీ చివర్లో భారత బౌలర్లు కట్టడిగా బౌలింగ్ చేశారు. దీప్తీ శర్మ ఒకే ఓవర్లో కెప్టెన్ మెగ్ లాన్నింగ్ (16), గార్డ్నర్ (2)ఔట్ చేయడం.. చివర్లో పూనమ్ యాదవ్ హైన్స్(4)ను ఔట్ చేయడంతో ఆసీస్ 200 మార్క్ను అందుకోలేకపోయింది.


Click it and Unblock the Notifications












