దుబాయ్: భారత వేదికగా జరగనున్న 2023 వన్డే ప్రపంచకప్ క్వాలిఫికేషన్ కోసం అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) 'సూపర్ లీగ్'ను ఆవిష్కరించింది. ఈ నెల 30న ఇంగ్లండ్-ఐర్గాండ్ మధ్య మొదలయ్యే మూడు వన్డేల సిరీస్తో ఈ లీగ్ ప్రారంభం కానుందని సోమవారం ఓ ప్రకటనలో పేర్కొంది. అయితే పూర్తి షెడ్యూల్ను మాత్రం ప్రకటించాల్సిఉంది.
భారత్ ఆతిథ్య దేశం కావడంతో 2023 విశ్వటోర్నీకి నేరుగా అర్హత సాధించింది. ఇక ఈ లీగ్లో టాప్-7లో నిలిచే జట్లు నేరుగా ప్రపంచకప్కు క్వాలిఫై అవుతాయని స్పష్టం చేసింది. 12 ఐసీసీ సభ్యదేశాలతో పాటు నెదర్లాండ్స్.. మొత్తం 13 జట్లు ఈ సూపర్ లీగ్లో పోటీ పడనున్నాయి. ఈ లీగ్లో భాగంగా ప్రతి జట్టు స్వదేశంలో నాలుగు, విదేశాల్లో మూడు వన్డే సిరీస్లు ఆడాలి.
ఆతిథ్య జట్టుతో కలుపుకొని ఎనిమిది జట్లు ప్రపంచకప్నకు నేరుగా అర్హత సాధిస్తే.. మిగిలిన ఐదు జట్లు.. ఐదు అసోసియేట్ జట్లతో 2023 క్వాలిఫయర్స్లో తలపడాల్సి ఉంటుంది. మొత్తంగా 2023 ప్రపంచకప్లో 10 జట్లు పోటీ పడనున్నాయి. సూపర్ లీగ్లో మ్యాచ్ గెలిచిన ఒక్కో జట్టుకు 10పాయింట్లు దక్కుతాయి. మ్యాచ్ రద్దయినా, టై అయినా ఇరు జట్ల ఖాతాలో ఐదేసి పాయింట్లు చేరుతాయి.
ఈ లీగ్ను మే నెలలోనే నిర్వహించాల్సి ఉండగా, కరోనాతో అది ఆలస్యమైంది. కొత్త సూపర్ లీగ్లో సిరీస్ను కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య నిర్వహించడానికి ఆయా జాతీయ బోర్డులతో కలిసి పని చేయడానికి ఐసీసీ నడుంబిగించింది. కాగా, 2023 వరల్డ్కప్కు ఇంకా చాలా సమయం ఉండటంతో అర్హత ప్రక్రియకు ఎటువంటి ఆటంకాలు ఉండవని ఐసీసీ భావిస్తోంది.
గత ఏడాది ఇంగ్లండ్లో జరిగిన ప్రపంచ కప్లో భాగంగా నిర్వహించిన క్వాలిఫైయింగ్ విధానాన్నే తాజా అర్హత ప్రక్రియకు అవలంభిస్తున్నారు. మొత్తం 13 దేశాలు పాల్గొనే ఈ లీగ్లో 156 మ్యాచ్లు జరుగనున్నాయి. 2022 చివరి వరకూ సూపర్ లీగ్ కొనసాగనుంది. ముందస్తు షెడ్యూల్ ప్రకారం 2023 వరల్డ్కప్ను ఫిబ్రవరిలో నిర్వహించాల్సి ఉండగా, తాజా షెడ్యూల్లో మార్పుల వల్ల ఆ మెగా టోర్నీని ఆ ఏడాది అక్టోబర్కు పొడిగించారు.