అంత ఈజీ కాదు..
ప్రస్తుతం ఆస్ట్రేలియా గడ్డపై భారత్ టెస్ట్ సిరీస్ నెగ్గాలంటే అంత సులువుకాదని ఇయాన్ చాపెల్ అభిప్రాయపడ్డాడు.
టీమిండియా అదృష్టం కేవలం ఇద్దరి ఆతిథ్య ప్లేయర్ల ఆటతీరుపైనే ఉందన్నాడు. అది డేవిడ్ వార్నర్-స్టీవ్ స్మిత్లేనని ఇయాన్ చాపెల్ స్పష్టం చేశాడు. వీరిద్దర్నీ ఎంత తొందరగా పెవిలియన్కు పంపితేనే అంత మంచిదని, వారు ఔటయ్యేదానిబట్టే భారత విజయవకాశాలు ఆధారపడి ఉంటాయన్నారు. ‘సోనీ టెన్ పిట్ స్టాప్' షోలో.. భారత్-ఆస్ట్రేలియాల తదుపరి సిరీస్ గురించి ఈ దిగ్గజ క్రికెటర్ మాట్లాడాడు.
దూకుడుగా ఉండాలి..
గత ఆస్ట్రేలియా పర్యటనలో భారత్ టెస్టు సిరీస్ సాధించడాన్ని ప్రస్తావిస్తూ అడిగిన ప్రశ్నకు చాపెల్ బదులిస్తూ.. ఆ పర్యటన వేరు, ప్రస్తుతం జరగబోయే సిరీస్ వేరు అంటూ సమాధానమిచ్చాడు. అప్పుడు గెలిచారని, కానీ ఇప్పుడు గెలిచి చూపించాలన్నాడు.
‘ఈసారి టీమిండియా సిరీస్ సాధించడం చాలా కష్టం. విజయం కోసం కోహ్లీసేన మిక్కిలి శ్రమించక తప్పదు. ఆస్ట్రేలియాలోని పరిస్థితులు భారత క్రికెటర్లకు బాగా తెలుసు. కానీ సొంతగడ్డపై ఆసీస్ను ఓడించాలంటే దూకుడు మంత్రాన్ని అవలంభించాలి. అది కూడా చాలా ధీటుగా ఉండాలి.
ఆ ఇద్దరిపైనే విజయవకాశాలు..
గతంలో ఆస్ట్రేలియాకు వచ్చినప్పుడు భారత్ బ్యాటింగ్ బాలేదు. ఇప్పుడు భారత్ బ్యాటింగ్ బలోపేతం అయ్యింది. కానీ డేవిడ్ వార్నర్-స్టీవ్ స్మిత్లే ఆసీస్కు వెన్నుముక. వీరిని తొందరగా ఔట్ చేస్తే టీమిండియా పైచేయి సాధిస్తుంది. అప్పుడు విజయం సాధించే అవకాశం ఉంటుంది. ఒకవేళ వార్నర్-స్మిత్లు ఎక్కువ సేపు క్రీజ్లో ఉంటే మాత్రం ఆసీస్దే విజయం' అని చాపెల్ చెప్పుకొచ్చాడు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఇరు జట్లు సమ ఉజ్జీలుగా ఉండటంతో ఈ సిరీస్ ఆసక్తికర పోరుతో రసవత్తరంగా సాగుతుందన్నాడు.
ఇరు జట్ల బోర్డుల ప్రయత్నాలు..
ఇక ఈ ఏడాది చివర్లో వరల్డ్ టెస్టు చాంపియన్షిప్లో భాగంగా ఆస్ట్రేలియాలో భారత్ పర్యటించాల్సి ఉంది. కరోనా వైరస్ కారణంగా ఆ పర్యటనకు భారత్ వెళుతుందా లేదా అనేది అనుమానమే. అప్పటికి పరిస్థితులు చక్కబడితే ఇరు జట్ల మధ్య సిరీస్ జరుగుతుంది. అయితే ఈ సిరీస్ నిర్వహించేందుకు ఇరు జట్లు సుముఖంగా ఉన్నాయి. ఇప్పటికే ఈ సిరీస్ దృష్ట్యా ట్రావెల్ ఆంక్షలు సడలించాలని క్రికెట్ ఆస్ట్రేలియా తమ ప్రభుత్వాన్ని కోరగా.. సానుకూలంగా స్పందించినట్లు వార్తలు వచ్చాయి. మరోవైపు భారత జట్టు కూడా అవసరమైతే రెండు వారాలు క్వారంటైన్లో ఉంటుందని బీసీసీఐ ట్రెజరర్ అరుణ్ ధూమల్ తెలిపారు.