అది వాళ్ల తప్పే
తాజాగా దీప్దాస్ గుప్తా ఇండియా టుడేతో మాట్లాడుతూ.. 'టిమ్ పైన్ సాకులు చెబుతున్నాడని నేను అనుకోను. జట్టు ఓటమి పాలైన కొన్ని నెలల తర్వాత అతడు ఈ విషయంపై మాట్లాడాడు. పైన్ ఒక ప్రశ్నకు సమాధానం ఇచ్చాడా అన్నది పక్కన పెడితే.. భారత్ పక్కదారి పట్టించిందనడం విస్మయం కలిగించింది. నిజానికి బంతిపై దృష్టి పెట్టలేకపోవడం వాళ్ల తప్పే. క్వారంటైన్ అంశంలో నిజాయితీ ఉంది.
భర్త ఉద్దేశ పూర్వకంగా ఏమీ చేయలేదు. గబ్బా టెస్టుకు ముందు జట్టును ఐసోలేషన్లో ఉండమన్నారు. ఆటగాళ్లు, జట్టు నిర్వహణ మరియు కోచింగ్ సిబ్బంది ఎవరూ దీని గురించి బహిరంగంగా మాట్లాడలేదు. అవి కేవలం పుకార్లు మాత్రమే. చాలాసార్లు వదంతులు రావడం చూస్తూనే ఉంటాం' అని అన్నారు.
భారత్ ఎలాంటి మైండ్గేమ్స్ ఆడలేదు
'ఇంతకు అధికారిక ప్రకటనే లేనప్పుడు ఆసీస్ కెప్టెన్ దేని గురించి మాట్లాడుతున్నాడు?. ఇంతకు అతడి మాట ఎవరు వింటున్నట్టు? నిజానికి వాళ్ల ఓటమి స్వయంకృతం. 30 ఏళ్ల తర్వాత గబ్బాలో ఓడిపోయారు. టీమిండియాకు ప్రధాన ఆటగాళ్లు లేకున్నా.. భారత్ చేతిలో వరుస సిరీసులు కోల్పోయారు. దీన్ని వాళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు. బంతిపై దృష్టి పెట్టలేకపోవడం వాళ్ల తప్పే.
భారత్ ఎలాంటి మైండ్గేమ్స్ ఆడలేదు. భారత్ మైండ్గేమ్స్ ఆడటం, పక్కదారి పట్టించడం నేనెప్పుడూ చూడలేదు. ఏదేమైనా ఇన్నాళ్ల తర్వాత ఆసీస్ ఓటమిపై మాట్లాడటం ఆశ్చర్యకరమే' అని దీప్దాస్ గుప్తా పేర్కొన్నారు.
ఏకాగ్రతను పక్కదారి పట్టించి
గురువారం టిమ్ పైన్ న్యూస్.కామ్ ద్వారా మాట్లాడాడు. 'పక్కదారి పట్టించడంలో భారత్ బాగుంది. ఏ మాత్రం ప్రాధాన్యం లేని సమాచారంతో ఏకాగ్రత చెడగొడుతుంది. సిరీస్లో అలాంటి వాటికి మేం వెనకబడిన సందర్భాలు ఉన్నాయి. దీనిని ఎదుర్కోవడం సవాలే. ఇందుకో ఉదాహరణ కూడా చెబుతా. టీమిండియా ఆటగాళ్లు గబ్బాకు వెళ్లమని చెప్పారు. అప్పుడు మ్యాచ్ ఎక్కడ జరుగుతుందో మాకు తెలియదు. ఇలాంటి పక్కదారి పట్టించే పనుల సృష్టిలో వారు బాగున్నారు. దాంతో మేం బంతిపై దృష్టి పెట్టలేకపోయాం' అని పైన్ అన్నాడు.
2-1తో సిరీస్ను కైవసం
పెటర్నిటీ లీవ్పై బోర్డర్-గవాస్కర్ సిరీస్లోని మూడు మ్యాచ్లకు రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ దూరమవ్వగా.. తాత్కలిక సారథిగా అజింక్య రహానే జట్టును ముందుండి నడిపించాడు. సూపర్ కెప్టెన్సీతో పాటు యువ ఆటగాళ్ల అండతో ఆసీస్ను సొంతగడ్డపై ఓడించి 2-1తో సిరీస్ను కైవసం చేసుకొని చరిత్ర సృష్టించాడు. అడిలైడ్ టెస్టులో 36 పరుగులకే కుప్పకూలిన భారత్.. ఆ తర్వాత అద్భుతంగా పుంజుకుంది.
కోహ్లీ లేకున్నా.. సీనియర్ పేసర్లు గాయపడ్డా.. అనుభవం లేని ఆటగాళ్లే బౌలింగ్ చేసినా పైన్ బృందాన్ని చిత్తుచిత్తుగా ఓడించింది. శుభ్మన్ గిల్, రిషబ్ పంత్, మహ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్, చేటేశ్వర్ పుజారా అద్భుతంగా ఆడారు.