హైదరాబాద్ : క్యా 'కరోనా'.. కిక్కిరిసిన ప్రేక్షకులతో సిక్సర్ల వర్షం కురవాల్సిన మైదానాలు.. ఆసుపత్రులుగా మారనున్నాయి. కరోనా మహమ్మారిని ఎదుర్కునేందుకు ప్రభుత్వం కోరితే ఈడెన్ గార్డెన్ మైదానాన్ని వైద్య అవసరాల కోసం ఇచ్చేందుకు సిద్ధమేనని బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ తెలిపాడు.
ఇక బీసీసీఐ బాస్ బాటలోనే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కూడా నడిచింది. తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఉప్పల్ రాజీవ్ గాంధీ స్టేడియంలో ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేయాలని హెచ్సీఏ అధికారులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇందుకోసం సీఎం కేసీఆర్కు హెచ్సీఏ సెక్రటరీ విజయానంద్ లేఖ రాశారు. అపెక్స్ కౌన్సిల్లో నిర్ణయం తీసుకున్నామని ఈ లేఖలో స్పష్టం చేశారు.
ఈ స్టేడియంలో 40 పెద్ద రూమ్లు ఉన్నాయని, పార్కింగ్ సదుపాయం కూడా ఉందని తెలిపారు. ఇది ఐసోలేషన్ కేంద్రంగా ఎంతగానో ఉపయోగపడుతుందని సూచించారు. కరోనా నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు బాగున్నాయని కొనియాడారు.