రోహిత్ శర్మకు ఫిట్నెస్ టెస్ట్..
అయితే విరాట్ కోహ్లీ తర్వాత టెస్ట్ ఫార్మాట్లో టీమిండియాను నడిపించే సారథి ఎవరా? అనే చర్చ మొదలైంది. ఇప్పటికే వన్డే, టీ20 జట్లకు సారథిగా ఎంపికైన రోహిత్ శర్మకే టెస్టు పగ్గాలు అప్పగించడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. 2023లో ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్, వన్డే ప్రపంచకప్ ఉన్న నేపథ్యంలో రోహిత్కే పూర్తిస్థాయి సారథ్య బాధ్యతలు అప్పగించవచ్చు. అయితే అతనికి అతిపెద్ద ప్రతికూలాంశం ఫిట్నెసే. పరిమిత ఓవర్ల కెప్టెన్గా, టెస్ట్ వైస్ కెప్టెన్గా ఎంపికైన తొలి సిరీస్కే గాయంతో దూరమయ్యాడు. పైగా అతని వయసు కూడా చర్చనీయాంశమవుతుంది.
కేఎల్ రాహుల్కు కెప్టెన్సీ స్కిల్స్..
భవిష్యత్తు దృష్ట్యా యువ ఆటగాళ్లను సారథిగా ఎంపిక చేస్తే టీమ్కు మేలు జరుగుతుందనే వాదన వినిపిస్తోంది. భారత సెలెక్టర్లు ఇలా ఆలోచిస్తే మాత్రం కేఎల్ రాహుల్, రిషభ్ పంత్ల్లో ఒకరికి టెస్టు సారథ్య బాధ్యతలు కట్టబెట్టవచ్చనే ప్రచారం జరుగుతుంది. వన్డే, టీ20 జట్ల సారథ్యం మార్పు సమయంలో రాహుల్కు వైస్ కెప్టెన్గా ప్రమోషన్ లభించింది.
కోహ్లీ గైర్హాజరీలో సౌతాఫ్రికాతో రెండో టెస్టుకు అతను సారథ్యం వహించాడు. గత రెండు ఐపీఎల్ సీజన్లలో పంజాబ్ కింగ్స్కు సారథ్యం వహిస్తూ అత్యుత్తమ బ్యాటర్గానూ రాహుల్ రాణించాడు. అయితే మైదానంలో వ్యూహాలు అమలు చేయడం, పరిస్థితులకు తగ్గట్లు నిర్ణయాలు తీసుకోవడంలో రాహుల్ విఫలమవుతున్నాడు. ఇదే అతనికి ప్రతికూలాంశం.
రిషభ్ పంత్ మరీ యంగ్..
ఇక 24 ఏళ్ల రిషభ్ పంత్ కూడా కెప్టెన్సీ రేసులో ముందున్నాడు. సునీల్ గవాస్కర్ వంటి దిగ్గజ ఆటగాళ్లు ఈ విషయంలో అతనికి మద్దతుగా నిలుస్తున్నారు. వికెట్ల వెనుక చురుగ్గా ఉండే పంత్ది దూకుడు బ్యాటింగ్ శైలి. ఎవరెన్ని విమర్శలు గుప్పించినా పట్టించుకునే మనస్తత్వం కాదు. ఢిల్లీ క్యాపిటల్స్కు కెప్టెన్గా వ్యవహరించిన పంత్.. ఆకట్టుకున్నాడు. పైగా వికెట్ కీపర్ సారథి అయితే ఫీల్డ్ సెటప్లో కానీ, కీలక నిర్ణయాలు తీసుకోవడంలో కానీ అడ్వాంటేజ్ ఉంటుంది. అయితే అతను మరీ యువకుడు కావడం ప్రతికూలంశంగా మారింది.
హర్షాభోగ్లే ఆసక్తికర ట్వీట్..
ఈ క్రమంలోనే ప్రముఖ కామెంటేటర్ హర్షా భోగ్లే చేసిన ట్వీట్ చర్చనీయాంశమైంది. సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాలను కూడా కెప్టెన్గా పరిగణలోకి తీసుకోవచ్చని అభిప్రాయపడ్డాడు. 'నా దృష్టిలో టీమిండియా టెస్ట్ కెప్టెన్సీకి నాలుగు ఆప్షన్స్ ఉన్నాయి. కానీ ఎక్కువగా రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ల గురించే మాట్లాడుతున్నారు. అవసరమైతే సీనియర్ బౌలర్లు అశ్విన్, బుమ్రాలను కూడా పరిగణలోకి తీసుకోవచ్చు.'అని హర్షా భోగ్లే ట్వీట్ చేశాడు.