హైదరాబాద్: భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ అరుదైన ఘనతను సొంతం చేసుకోనుంది. గురువారం ఇంగ్లండ్తో జరగాల్సిన తొలి సెమీఫైనల్ వర్షంతో రద్దవ్వడంతో.. గ్రూప్-ఎ టాపర్గా భారత మహిళలు తొలిసారి ఫైనల్కు చేరారు. మరో సెమీస్లో సౌతాఫ్రికాను ఓడించిన ఆస్ట్రేలియా వరుసగా ఆరోసారి తుదిపోరుకు అర్హత సాధించింది. ఈ ఇరు జట్ల మధ్య ఆదివారం మెల్బోర్న్ వేదికగా టైటిల్ ఫైట్ జరగనుంది.
అయితే ఈ ఆదివారం (మార్చి 8) భారత కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ జన్మదినం. ఆ రోజు ఈ పంజాబ్ బ్యాటర్ 31వ ఏట అడుగుపెట్టబోతుంది. తద్వారా ఓ కెప్టెన్గా పుట్టిన రోజు ఫైనల్ ఆడనున్న తొలి క్రికెటర్గా హర్మన్ ప్రీత్ అరుదైన ఫీట్ సొంతం చేసుకోనుంది. పురుషుల క్రికెట్లో కూడా ఏ కెప్టెన్ ఇంతవరకు తమ బర్త్ డే రోజు మెగాటోర్నీ ఫైనల్ మ్యాచ్ ఆడలేదు. ఇక మార్చి 8న అంతర్జాతీయ మహిళల దినోత్సవం కూడా ఉండటంతో భారత అమ్మాయిలు చిరస్మరణీయ విజయం సొంతం చేసుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
ఇక సెమీఫైనల్ మ్యాచ్ రద్దవ్వడం నిరాశకు గురిచేసిందని మ్యాచ్ అనంతరం హర్మన్ప్రీత్ కౌర్ తెలిపింది. 'వర్షం కారణంగా మ్యాచ్ రద్దు కావడం దురదృష్టకరం. ఐసీసీ రూల్స్ ప్రకారం మేము ఫైనల్కు చేరాం. భవిష్యత్తులో మెగా టోర్నీల నాకౌట్ మ్యాచ్లకు 'రిజర్వ్ డే' కచ్చితంగా ఉండాలి. ఈ టోర్నీ తొలి రోజు నుంచి మేము ఒకే ఆలోచనతో ఉన్నాం. గ్రూప్లో మొత్తం మ్యాచ్లను గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. గ్రూప్ మ్యాచ్లు అన్ని గెలవాలని అప్పుడే నిశ్చయించుకున్నాం. ఒకవేళ సెమీ ఫైనల్కు ఏమైనా ఆటంకాలు వస్తే అప్పుడు గ్రూప్లో మ్యాచ్లను పరిగణిలోకి తీసుకుంటారని తెలుసు. మేము గ్రూప్-ఎలో టాపర్గా నిలిచుండకుంటే, అదే సమయంలో సెమీ ఫైనల్ మ్యాచ్ రద్దయితే అప్పుడు ఫైనల్కు చేరడం కష్టమయ్యేది. వామ్మో.. అది ఊహించడానికే చాలా కష్టంగా ఉంది.' అని తెలిపింది.