న్యూఢిల్లీ: అప్కమింగ్ మహిళల వన్డే ప్రపంచకప్లో సత్తా చాటుతానని భారత మహిళా బ్యాటర్ హర్మన్ ప్రీత్ కౌర్ ధీమా వ్యక్తం చేసింది. ఇటీవల న్యూజిలాండ్తో జరిగిన వన్డే సిరీస్లో ఫామ్ అందుకున్నానని తెలిపింది. ఈ సిరీస్ చివరి మ్యాచ్లో చేసిన 63 పరుగులు తనకెంతో ముఖ్యమని చెప్పుకొచ్చింది. గురువారం నుంచి మహిళల వన్డే ప్రపంచకప్ ప్రారంభం కానుండగా.. ఆదివారం పాకిస్థాన్తో జరిగే తొలి మ్యాచ్తో మిథాలీ రాజ్ నేతృత్వంలోని భారత జట్టు తమ క్యాంపైన్ మొదలుపెట్టనుంది. ఈ క్రమంలోనే మీడియాతో మాట్లాడిన హర్మన్ ప్రీత్ కౌర్.. పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది.
'గతంలో నేను చేసిన 171 పరుగుల రికార్డు గురించి చాలా మంది మాట్లాడుతుంటారు. అందుకేనేమో జట్టుకు అవసరమైనప్పుడు నేను చేసిన 30, 40 పరుగుల కీలక ఇన్నింగ్స్లు గురించి ఎవరూ పట్టించుకోరు. గతంలో నేను చేసిన పరుగుల ఆధారంగా నా ప్రదర్శనను అంచనా వేసుకోవాలనుకోవడం లేదు. జట్టులో నా పాత్రేంటో తెలుసు. జట్టు కోసం ఎప్పుడూ గొప్ప ఇన్నింగ్స్లు ఆడాలనుకుంటాను. ఒక బ్యాటర్గా పరుగులు చేయలేకపోతే చాలా బాధగా ఉంటుంది. ఆడిన ప్రతిసారి అత్యుత్తమ ప్రదర్శన చేసేందుకు ప్రయత్నిస్తాను. అయితే కొన్నిసార్లు పరిస్థితులు కలిసిరాకపోవచ్చు. అలాంటి సమయాల్లోనే మనపై తీవ్ర విమర్శలు వస్తుంటాయి.
అయితే ప్రపంచకప్లో రాణించగలననే నమ్మకం ఉంది. సౌతాఫ్రికాతో జరిగిన వార్మప్ మ్యాచ్లో సెంచరీ సాధించడంతో నా ఆత్మవిశ్వాసం రెట్టింపు అయింది. అలాగే, న్యూజిలాండ్తో జరిగిన ఆఖరి వన్డేల్లో నేను చేసిన 63 పరుగులకు నాకెంతో ప్రత్యేకం. ఈ ఇన్నింగ్స్తోనే ఫామ్ అందుకున్నాను. నాలుగో స్థానంలో ఆడటం నాకు చాలా ఇష్టం. కానీ జట్టు అవసరాల నేపథ్యంలో ఐదో స్థానంలో బరిలోకి దిగుతున్నాను. బ్యాటింగ్ విభాగం కాస్త మెరుగవ్వాల్సి ఉంది. టాప్ 5 బ్యాట్స్మన్ క్రీజులో నిలబడాల్సిన అవసరం ఉంది. చివర్లో కొంచెం ధాటిగా ఆడాల్సిన అవసరం కూడా ఉంది'అని హర్మన్ ప్రీత్ చెప్పుకొచ్చింది.