|
ఒకే ఓవర్లో 26 పరుగులు.. బెంబేలెత్తిన బౌలర్లు
డీవైపాటిల్ టీ20లో టోర్నీలో భాగంగా మంగళవారం సీఏజీ జట్టుతో జరిగిన మ్యాచ్లో రిలయన్స్-1 జట్టు తరఫున బరిలోకి దిగిన పాండ్యా(39 బంతుల్లో 7 ఫోర్లు 10 సిక్సర్లతో 105) అద్భుత సెంచరీ సాధించాడు. అతడి విధ్వంసానికి సీఏజీ బౌలర్లకు ఏం చేయాలో అర్థం కాలేదు. వీ జీవరాజన్ వేసిన 15వ ఓవర్లో అయితే పాండ్యా 3 సిక్సర్లు, 2 ఫోర్లతో ఏకంగా 26 పరుగులు పిండుకున్నాడు.
పాండ్యా సూపర్ సెంచరీతో రిలయన్స్ జట్టు నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లకు 252 పరుగులు చేసింది. ఈ టోర్నీలో శిఖర్ ధావన్ కూడా ఆడుతుండగా.. అతను డకౌటై మరోసారి నిరాశపరిచాడు.
|
సంతోషంలో ముంబై ఫ్యాన్స్..
పాండ్యా భారీ ఇన్నింగ్స్తో ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. పాండ్యా ఫామ్లోకి వచ్చాడని, ముంబైకి తిరుగులేదని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ముంబై ఇండియన్స్ కీలక ఆటగాడైన హార్దిక్ కోలుకోవడం ఆ జట్టుకు కలిసొచ్చే అంశం. ఇప్పటికే ఆ జట్టు ఫిజియో ఈ టోర్నీలో పాండ్యా ఫిట్నెస్ను పర్యవేక్షించారు. టీమిండియా చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ కూడా పాండ్యా ఫిట్నెస్ను పరీక్షించాడు.
|
సఫారీ టూర్తో రీ ఎంట్రీ..
గతేడాది సెప్టెంబర్లో వెన్నుగాయంతో టీమిండియాకు దూరమైన పాండ్యా.. శస్త్ర చికిత్స తర్వాత న్యూజిలాండ్ ‘ఎ' పర్యటనకు వెళ్లాల్సి ఉంది. కానీ అతను వర్క్లోడ్ టెస్ట్లో విఫలమవడంతో ఆ టూర్కు దూరమయ్యాడు. పాండ్యాను జట్టులో తీసుకురావాడానికి టీమ్మేనేజ్మెంట్ బాగా ప్రయత్నించింది. అతని కోసం జట్ల ఎంపికను వాయిదా వేసింది. అతను పూర్తి స్థాయిలో సిద్దం కాలేదని భావించి ప్రత్యామ్నాయ ఆటగాడిని ఎంచుకుంది. పాండ్యా లేని లోటు భారత్కు స్పష్టంగా తెలుసొచ్చింది.
ఇక తాజా మ్యాచ్తో పాండ్యా పూర్తి ఫిట్గా మారినట్లు టీమిండియా మేనేజ్మెంట్కు సంకేతాలు పంపాడు. ఈక్రమంలో మార్చి 12 నుంచి సౌతాఫ్రికాతో జరిగే మూడు వన్డేల సిరీస్కు టీమిండియా సెలెక్షన్పై అందరి దృష్టి నెలకొంది.