ఐదు వికెట్ల ప్రదర్శన:
2019 జనవరిలో సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో జరిగిన చివరి టెస్టులో కుల్దీప్ యాదవ్ ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు. ఆ సమయంలో టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి మాట్లాడుతూ.. విదేశీ టెస్టుల్లో కుల్దీప్ తమ ఫస్ట్ ఛాయిస్ స్పిన్నర్ అని తెలిపాడు. రవిశాస్త్రి ఆ కామెంట్ చేసిన రెండేళ్ల తర్వాత భారత్-ఆస్ట్రేలియా జట్లు టెస్టు మ్యాచ్ ఆడబోతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా స్పోర్ట్స్తక్తో హర్భజన్ సింగ్ మాట్లాడాడు. తొలి టెస్టులో రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్కు బదులు చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ను తీసుకోలేరని చెప్పాడు. కుల్దీప్ విషయంలో రవిశాస్త్రి అదే మాటకు కట్టుబడి ఉంటాడేమో చూడాలన్నాడు.
సరైన క్రికెట్ ఆడలేదు:
'మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ 2019 వన్డే ప్రపంచకప్ తర్వాత సరైన క్రికెట్ ఆడలేదు. ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2020నూ సరైన అవకాశాలు రాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో అతడిని తొలి టెస్టుకు ఎంపిక చేయడం జట్టు యాజమాన్యంపై ఆధారపడి ఉంటుంది' అని హర్భజన్ సింగ్ పేర్కొన్నాడు. కోల్కతా నైట్ రైడర్స్ జట్టుకు కీలక స్పిన్నర్ అయిన కుల్దీప్ యాదవ్కు గత రెండు సీజన్లలో తగినన్ని అవకాశాలు ఇవ్వలేదు. గత సీజన్లో 9 మ్యాచ్ల్లో 4 వికెట్లు తీసిన కుల్దీప్.. 2020లో ఐదు మ్యాచ్లాడి ఒకే ఒక్క వికెట్ తీశాడు. ఇక టీమిండియా తరఫున కూడా ఎక్కువగా మ్యాచులు ఆడలేదు.
మాట మీద నిలబడతాడో:
'కుల్దీప్ యాదవ్ చివరిసారి టెస్టు ఆడింది ఆస్ట్రేలియా గడ్డమీదే. అప్పుడు టీమిండియా కోచ్ రవిశాస్త్రి మాట్లాడుతూ విదేశీ పిచ్లపై తమ తొలి ప్రాధాన్యం కుల్దీప్కే అని చెప్పాడు. ఇప్పుడతడు మాట మీద నిలబడతాడో లేదో వేచి చూడాలి. ప్రస్తుతం కుల్దీప్ పరిస్థితి చూస్తుంటే.. టీమిండియా అడిలైడ్ టెస్టుకు ఎంపిక చేస్తుందని అనుకోవట్లేదు. అయితే రవీంద్ర జడేజా లేదా రవిచంద్రన్ అశ్విన్ని ఎంపిక చేస్తారు' అని భజ్జీ పేర్కొన్నాడు.
6 టెస్టులు, 60 వన్డేలు:
గత ఏడాది కాలంగా పరిమిత ఓవర్ల క్రికెట్లో కుల్దీప్ ప్రదర్శన ఆకట్టుకునేలా లేదు. వచ్చిన అవకాశాలను ఉపయోగించుకోలేకపోయాడు. దీంతో అతడికి భారత జట్టులో చోటు దక్కలేదు. అందుకే అడిలైడ్ టెస్టులో కుల్దీప్కు చోటు దక్కే విషయమై హర్భజన్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేశాడు. 25 ఏళ్ల కుల్దీప్ భారత్ తరఫున 6 టెస్టులు, 60 వన్డేలు, 21 టీ20లు ఆడాడు.
India vs Australia: హాట్ కేకుల్లా అమ్ముడుపోయిన మ్యాచ్ టిక్కెట్లు.. త్వరలోనే మైదానంలోకి ప్రేక్షకులు!