|
భద్రాచలంలో సంబరాలు..
సౌమ్య తివారితో కీలక భాగస్వామ్యాన్ని నమోదు చేసి అండర్-19 వరల్డ్ కప్ను దేశానికి అందించింది. ఉమెన్ ఆఫ్ ద సీరీస్గా నిలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ను స్టన్నింగ్ క్యాచ్ ద్వారా ఔట్ చేసి మ్యాచ్ను మలుపుతిప్పింది. త్రిష పట్టిన క్యాచ్ ఈ టోర్నీకే హైలైట్గా నిలిచింది. దాంతో త్రిష సొంతూరైన భద్రాచలంలో క్రీడాభిమానుల ఆనందానికి హద్దే లేకుండా పోయింది. మ్యాచ్ ఆద్యంతం టీవీల్లో వీక్షించిన అభిమానులు.. గెలిచిన అనంతరం రోడ్లపైకి వచ్చి సంబరాలు జరిపారు. బాణాసంచా కాల్చుతూ జయహో భారత్ అంటూ నినాదాలు చేశారు.
|
తండ్రి త్యాగం..
భద్రాచలంలో జిమ్ నిర్వహించే గొంగడి రామిరెడ్డి కుమార్తె అయిన త్రిషను చిన్నతనం నుంచే క్రికెట్లో తీర్చిదిద్దారు. ఎనిమిదేళ్ల వయసులోనే జిల్లాస్థాయి క్రికెట్ పోటీల్లో రాణించి ఉమెన్ ఆఫ్ ద సిరీస్గా నిలిచింది. స్థానిక కళాశాల క్రీడా మైదానంలో త్రిషకు ఓనమాలు నేర్పిన రామిరెడ్డి, తన కూతురును అంతర్జాతీయ క్రీడాకారిణిగా తీర్చిదిద్దేందుకు హైదరాబాద్కు కుటుంబాన్ని తరలించి, త్రిషను ఆల్రౌండర్గా తీర్చిదిద్దారు. ఆర్థికంగా అంతంత మాత్రంగానే ఉన్న రామిరెడ్డి.. బిడ్డ కెరీర్ కోసం భద్రాచలంలోని జిమ్తో పాటు పొలాన్ని అమ్ముకున్నాడు. కూతురికి మెరుగైన శిక్షణ ఇప్పించేందుకు ఉద్యోగం కూడా మానేసి ఆమె సక్సస్ కోసం పరితపించాడు.
మాటల్లేవ్..
చివరకు తాను అనుకున్న విధంగా త్రిష అంతర్జాతీయ స్థాయిలో అదరగొట్టడం, మహిళల క్రికెట్కు తొలి ఐసీసీ టైటిల్ అందించడంతో అతని ఆనందానికి హద్దేలేకుండా పోయింది. త్రిష సైతం కన్నీళ్లు ఆపుకోలేకపోయింది. మ్యాచ్ అనంతరం అధికారిక బ్రాడ్కాస్టర్ యాంకర్తో మాట్లాడుతూ భావోద్వేగానికి గురైంది. 'ప్రపంచకప్ గెలిచిన ఆనందాన్ని మాటల్లో చెప్పలేను. గాల్లో తేలిపోతున్నట్లు ఉంది. టోర్నీలో నాకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నించా. స్కాట్లాండ్తో మ్యాచ్లో ఓపెనర్గా పంపించారు. ఆ పిచ్ కాస్త భిన్నంగా స్పందించింది. స్పిన్నర్స్కు అనుకూలించింది. అందుకే జాగ్రత్తగా ఆడా.
ఇప్పటికే సీనియర్ స్థాయిలో ఆడిన షెఫాలి, రిచా ఘోష్లతో కలిసి ఆడడం మంచి అనుభవం. ఫైనల్లో ఒత్తిడికి గురి కాలేదు. జట్టును విజయతీరాలకు చేర్చగలమని నమ్మకంతో ఉన్నా. సౌమ్యకు కూడా అదే చెప్పా. ఔట్ కాకుండా చివరి వరకూ ఉండాల్సింది. ఈ కప్పు గెలవడమే ఇప్పటివరకూ నా జీవితంలో అత్యుత్తమ క్షణం'అని త్రిష చెప్పుకొచ్చింది. తమ విజయానికి కృషి చేసిన కోచ్లకు కృతజ్ఞతలు తెలిపింది.