నన్ను ఆశ్చర్యపరిచింది:
తాజాగా న్యూజిలాండ్ కోచ్ గ్యారీ స్టీడ్ మాట్లాడుతూ... 'టీమిండియాను చూసి నాకు ఆశ్చర్యమేసింది. అంత సులభంగా లొంగిపోతుందనుకోలేదు. మేం సుదీర్ఘంగా చేసిన ఒత్తిడి మూలంగానే ఇది సాధ్యమైంది. న్యూజిలాండ్ వాతావరణం, పరిస్థితుల్లో టీమ్ సౌథీ, ట్రెంట్ బౌల్ట్ అద్భుతంగా బంతులు వేస్తారు. ముఖ్యంగా ఎనిమిది వారాల విశ్రాంతి తర్వాత జట్టులోకి వచ్చిన బౌల్ట్లో ఓ జ్వాల కనిపించింది' అని అన్నారు.
అదే కీలక మలుపు:
'ప్రపంచంలోని అన్ని ప్రాంతాల్లో కన్నా న్యూజిలాండ్లో ఆడటం కష్టమన్న భావనను మేం కలిగించామనుకుంటున్నాం. అది మాకు గర్వకారణం. మ్యాచులో మేం కీలక సమయాల్లో వికెట్లు తీశాం. అది మాకు కలిసి వచ్చింది. నాలుగో రోజు అజింక్య రహానెను త్వరగా ఔట్ చేయడం కీలక మలుపు. దాంతో మ్యాచ్ను మేం త్వరగా ముగిస్తామనుకున్నా. మా బౌలర్ల ప్రదర్శన అద్భుతం. ప్రపంచ నంబర్వన్ జట్టును రెండుసార్లు ఆలౌట్ చేసారు' అని గ్యారీ స్టీడ్ పేర్కొన్నారు.
రెండో టెస్టులో మాకు సవాల్ విసురుతారు:
'రెండో టెస్టులో భారత ఆటగాళ్లు ఎక్కువ ఆధిపత్యం ప్రదర్శించి మా పేసర్లకు సవాల్ విసురుతారనుకుంటున్నా. ఎందుకంటే.. ప్రపంచ నంబర్వన్ జట్టు బలంగా పుంజుకోగలదు. అందులోనూ టాప్ ఆటగాళ్లు ఉన్నారు. నీల్ వాగ్నర్ రావడం మాకు సంతోషకరం. అయితే కొద్దిగా తలనొప్పి కూడా ఉంది. అరంగేట్రంలోనే కైల్ జేమీసన్ అదరగొట్టాడు. కానీ.. వాగ్నర్ తుది జట్టులో ఉంటాడు. నలుగురు పేసర్లతో పాటు కొలిన్ డి గ్రాండ్హోమ్ ఉంటే జట్టు కూర్పు బాగుంటుంది. క్రైస్ట్చర్చ తరహా వేదికలు అతడికి సరిగ్గా సరిపోతాయి' అని స్టీడ్ చెప్పుకొచ్చారు.
29 నుండి రెండో టెస్ట్:
సుదీర్ఘ న్యూజిలాండ్ పర్యటనలో టీమిండియా తేలిపోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 3-0తో వన్డే సిరీస్ను కోల్పోయిన భారత్.. రెండు టెస్టుల సిరీస్లో భాగంగా జరిగిన తొలి టెస్టులోనూ కనీస పోటీ ఇవ్వకుండా కివీస్ ముందు తలొంచింది. ఇక ఫిబ్రవరి 29 నుంచి క్రైస్ట్చర్చి వేదికగా జరగనున్న రెండో టెస్టులో విజయం సాధించాలని టీమిండియా చూస్తోంది. మరోవైపు న్యూజిలాండ్ కూడా సిరీస్ను క్లీన్స్వీప్ చేయాలని పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో హెగ్లే ఓవల్ వేదికగా శనివారం నుంచి ప్రారంభమయ్యే రెండో టెస్టులో ఇరు జట్లూ హోరాహోరీగా తలపడనున్నాయి.