నిరాశ పరిచిన పుజారా, రహానే..
రెండో రోజు ఆట చివరి సెషన్ వర్షంతో రద్దవ్వడంతో మూడో రోజు ఆటను అర్థ గంట ముందుగానే ప్రారంభించారు. ఇక ఓవర్నైట్ బ్యాట్స్మెన్ చతేశ్వర్ పుజారా(25), అజింక్యా రహానే(37) నిదానంగా ఆడుతూ ఇన్నింగ్స్ను ముందుకు నడిపించే ప్రయత్నం చేశారు. ఇక 45 పరుగుల భాగస్వామ్యంతో క్రీజులో కుదురుకున్న ఈ జోడీని హజెల్వుడ్ విడదీశాడు. కీపర్ క్యాచ్గా టీమిండియా నయావాల్ను పెవిలియన్కు చేర్చాడు. క్రీజులోకి వచ్చిన మయాంక్ అగర్వాల్తో కెప్టెన్ రహానే ఇన్నింగ్స్ను నిలబెట్టే ప్రయత్నం చేశాడు. కానీ స్టార్క్ భారత్ కెప్టెన్ను స్లిప్ క్యాచ్గా పెవిలియన్ చేర్చి దెబ్బతీశాడు.
మయాంక్, పంత్ కూడా..
144 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన భారత్ను గట్టెక్కించాల్సిన మయాంక్ అగర్వాల్(38), రిషభ్ పంత్(23) తీవ్రంగా నిరాశపరిచారు. నిర్లక్ష్యపు షాట్లతో వికెట్లు చేజార్చుకొని జట్టును మరింత కష్టాల్లోకి నెట్టారు. ముందుగా హజెల్ వుడ్ బౌలింగ్లో మయాంక్ అగర్వాల్ స్మిత్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత సుందర్తో కలిసి పంత్ ధాటిగా ఆడే ప్రయత్నం చేశాడు. గత మ్యాచ్ మాదిరి దూకుడు కనబర్చిన పంత్.. హజెల్ వుడ్ వేసిన బౌన్సర్ను అప్పర్ కట్ ఆడబోయి కామెరూన్ గ్రీన్కు చిక్కాడు. దాంతో 186 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
అసాధారణ పోరాటం..
ఈ క్లిష్ట స్థితిలో శార్దుల్ ఠాకుర్, వాషింగ్టన్ సుందర్ అసాధారణ పోరాటం కనబర్చారు. వీరి ఇన్నింగ్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆసీస్ బౌలర్లను మెచ్యూర్ బ్యాటింగ్తో ఎదుర్కొన్నారు. ముఖ్యంగా స్టార్క్ బౌలింగ్లో శార్దుల్ ఆడిన దూకుడైన షాట్లు మ్యాచ్కే హైలైట్. ఈ ఇద్దరు చూడముచ్చటైన కవర్స్ డ్రైవ్తో అలరించారు. ఓపికగా ఆడుతూ మంచి బంతులను గౌరవించారు. ఈ క్రమంలో ఈ ఇద్దరు తమ టెస్ట్ కెరీర్లో తొలి హాఫ్ సెంచరీలు అందుకున్నారు. ముందుగా లయన్ బౌలింగ్లో షార్ధుల్ ఠాకూర్ సూపర్ సిక్స్తో అర్థ శతకం సాధించగా.. ఆ మరుసటి ఓవర్లోనే సుందర్ కూడా హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అంతేకాకుండా ఏడో వికెట్కు 123 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
దెబ్బతీసిన కమిన్స్..
ఇక అసాధారణ బ్యాటింగ్తో క్రీజులో పాతుకుపోయిన ఈ జోడీని విడదీసేందుకు టిమ్ పైన్ చేసిన ప్రయత్నాలు ఏవి ఫలించలేదు. బౌన్సర్లతో శరీరంపై దాడి చేసినా ఈ జోడి బెదరలేదు. భారీ షాట్లతోనే బౌలర్లకు సమాధానమిచ్చింది. చివరకు కమిన్స్ను రంగంలోకి దింపిన పైన్ .. ఎట్టకేలకు ఫలితం రాబట్టాడు. అతని బౌలింగ్లో శార్దుల్ బౌల్డ్ అవ్వడంతో భారత్ పతనం మొదలైంది. ఆ తర్వాత సుందర్ను స్టార్క్ ఔట్ చేయగా.. సిరాజ్(13)ను హజెల్ వుడ్ బౌల్డ్ చేయడం భారత్ ఇన్నింగ్స్ ముగిసింది.