అది వాస్తవమే..
టీ20ల యుగంలో టెస్టులకు ఆదరణ రోజు రోజుకు తగ్గిపోతోందన్న మాట వాస్తవమే. దాంతోనే, లాంగ్ ఫార్మాట్ను కూడా ఆసక్తికరంగా మార్చేందుకు డే నైట్ టెస్టులను ప్రవేశపెట్టిన ఐసీసీ ఇప్పుడు మరో విప్లవాత్మక మార్పు తీసుకురావాలని భావిస్తోంది. టెస్టులను ఐదు నుంచి నాలుగు రోజులకు కుదించాలని చూస్తోంది.2023 నుంచి మొత్తం ఫోర్ డే టెస్టులు నిర్వహించి.. తద్వారా మిగిలే సమయంలో మరిన్ని టోర్నమెంట్లు నిర్వహించాలనుకుంటోంది. అయితే, దీనిపై క్రికెట్ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఆస్ట్రేలియా టాప్ క్రికెటర్లతో పాటు భారత దిగ్గజ ఆటగాళ్లు సచిన్, కోహ్లీ, రోహిత్ ఫోర్ డే టెస్టు ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నారు.
ఒక రోజు తగ్గిస్తే ఐసీసీ ఆశించిన సమయం లభించినా.. ఈ ఫార్మాట్ స్వభావమే దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేసున్నారు. మరోవైపు నాలుగు రోజులకు జై కొడుతున్న వాళ్లు.. కమర్షియల్ ప్రయోజనాల దృష్ట్యా ఈ మార్పు మంచిదే అంటున్నారు. ఇంకోవైపు చాలా మంది అడ్మినిస్ట్రేటర్లు, బ్రాడ్కాస్టర్లు కొత్త ఫార్మాట్ వైపే మొగ్గు చూపుతున్నారు. నాలుగు రోజుల టెస్టుతో కూడిన సరికొత్త వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ మొదలైతే సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టినట్టు అవుతుందని భావిస్తున్నారు.
నాలుగు రోజుల్లోనే ఖేల్ఖతం..
ఎవరి అభిప్రాయం ఎలా ఉన్నా.. ఈ మధ్య కాలంలో టెస్టులు చాలా తొందరగా ముగుస్తున్నాయన్నది కాదనలేని సత్యం. మూడు, నాలుగు పెద్ద దేశాలు తలపడే మ్యాచ్లు మినహా ఎక్కువ భాగం నాలుగు రోజుల్లోపే పూర్తవుతున్నాయి. 2010 నుంచి 2019 చివరి వరకు మొత్తం 349 టెస్టులు జరిగితే అందులో సగం కూడా ఐదు రోజు దాకా రాలేదు. కేవలం 149 మ్యాచ్లు ఐదో రోజు వరకు వస్తే.. 140 మ్యాచ్లు నాలుగో రోజే ముగిశాయి. మరో 58 మూడో రోజునే పూర్తయితే.. రెండు మ్యాచ్ల్లో రెండో రోజే ఫలితం వచ్చింది.
వీకెండ్స్ ప్లాన్ చేస్తే...
మిగతా ఫార్మాట్లతో పోలిస్తే సహజంగానే టెస్టు మ్యాచ్ల నిర్వహణ భారంతో కూడిన పని. ఇలా టెస్టు మ్యాచ్లు ముందుగానే ముగియడం వల్ల బ్రాడ్కాస్టర్లకు నష్టాలు వస్తున్నాయి. ముఖ్యంగా రెండు, మూడు రోజుల్లో ముగిసే మ్యాచ్లపై ఆర్గనైజర్స్ ఆందోళన వ్యక్తం చేస్తుంటారు. ఒకవేళ ఫోర్ డే టెస్టు గురువారం మొదలై ఆదివారం ముగిస్తే టికెట్ల సేల్ (శని, ఆదివారాల్లో) పెరగడంతో పాటు టీవీల్లో చూసే వాళ్ల సంఖ్య కూడా పెరగొచ్చన్న అభిప్రాయం ఉంది. ఈ పద్దతికి ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ), క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ప్రాథమికంగా మద్దతు తెలిపాయి.
98 ఓవర్లతో ఇబ్బందులు?
ఐసీసీ ప్రతిపాదించినట్టు రోజుకు 98 ఓవర్ల ఆట అన్ని దేశాల్లో.. ముఖ్యంగా ఉపఖండంలో సాధ్యం కాకపోచ్చు. ఇది అమలు చేస్తే బౌలర్లు గంటకు 16 ఓవర్ల రెండు బంతులు వేయాలి. ఇది పేసర్లకు చాలా కష్టం. ఒకవేళ నాలుగు రోజుల ఆట వర్కౌట్ కాకపోతే ఫ్యూచర్లో ఈ ఫార్మాట్ను మరింత కుదించే ప్రమాదం లేకపోలేదు. భవిష్యత్లో ఫోర్ డే టెస్టులు పింక్ బాల్తోనే ఆడాలని నిర్ణయిస్తే సూర్యాస్తమయ సమయంలో ఇబ్బందులు తలెత్తే చాన్సుంది.
స్పిన్నర్లకు కష్టం..
ఇక టెస్టులను నాలుగు రోజులకు కుదిస్తే స్పిన్నర్లకున్న ఒక్క అడ్వాంటేజ్ను కూడా దూరం చేసినట్లేనని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. సచిన్ టెండూల్కర్ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఈ ప్రతిపాదనను వ్యతిరేకించాడు. క్రికెట్ కమిటీ మెంబర్ ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ టామ్మే కూడా ఫోర్ డే టెస్ట్లు స్పిన్నర్లపై ప్రభావం ఉంటుందన్నాడు.
కోహ్లీ నో..
ఈ మార్పుల వల్ల టెస్టు క్రికెట్ఆత్మ దెబ్బతింటుందని పలువురు క్రికెటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వైట్బాల్ క్రికెట్ హవా నడుస్తున్నా.. టెస్టు క్రికెట్కు ఇప్పటికీ పెద్ద ఫ్యాన్ బేస్ ఉందని, టెస్టులే అత్యుత్తమ ఫార్మాట్ అని చాలాసార్లు చెప్పారు. ఒక క్రికెటర్ అన్ని రకాల సామర్థ్యాలను పరీక్షించేది టెస్టులే అంటున్నారు. ఇక కోహ్లీ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఫోర్డే టెస్ట్ ప్రతిపాదనను వ్యతిరేకించాడు."డే-నైట్ టెస్టులో ఏమైనా మార్పు తీసుకొచ్చి మరింత ఆసక్తికరంగా మార్చడానికి యత్నిస్తే బాగుంటుంది. డే-నైట్ టెస్టు విజయవంతమైన క్రమంలో దానిపై కసరత్తు చేస్తే బాగుంటుంది. సంప్రదాయ టెస్టు క్రికెట్ను ఒక రోజుకు తగ్గించడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు" అని పేర్కొన్నాడు.
బీసీసీఐ మదిలో ఏముందో?
నాలుగు రోజుల టెస్టుల కాన్సెప్ట్పై క్రికెట్ పెద్దన్న బీసీసీఐ ఇంకా స్పందించడం లేదు. ఈ విషయంపై ఇప్పుడే కామెంట్ చేయడం తొందరపాటు అవుతుందన్న బోర్డు ప్రెసిడెంట్ గంగూలీ ఐసీసీ ప్రదిపాదనను పూర్తిగా పరిశీలించిన తర్వాతే మాట్లాడతా అని చెప్పాడు. ఐసీసీలో మెజారిటీ నిర్ణయాలకు బిగ్ త్రీ నేషన్స్ అయిన ఇండియా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా బోర్డుల అంగీకారం చాలా ముఖ్యం. ఇంగ్లండ్, క్రికెట్ ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డులు ఫోర్ డేకు ఓకే అంటున్న నేపథ్యంలో బీసీసీఐ ఏం నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తిగా మారింది.
ఐసీసీ ఏం నిర్ణయం తీసుకోనుంది..
భిన్నఅభిప్రాయాలు వ్యక్తమువుతున్న నేపథ్యంలో ఐసీసీ తీసుకునే నిర్ణయంపై ఆసక్తి నెలకొంది. అనిల్ కుంబ్లే సారథ్యంలోని క్రికెట్ కమిటీ ఈ ప్రతిపాదనపై దుబాయ్ వేదికగా మార్చి నెలాఖరులో చర్చించనుంది. ఈ క్రికెట్ కమిటీలోని 18 మందిలో, నలుగురు ఈ ఆలోచనకు మద్దతు ఇవ్వడం లేదని స్పష్టం చేయగా.. న్యూజిలాండ్ క్రికెట్ చీఫ్ డేవిడ్ వైట్ ఒక్కడు మద్దతు తెలిపాడు. ఈ కమిటీలో ఉన్న చాలామంది, మొదటి స్థాయిలోనే నిర్ణయం తీసుకునే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఆలోచనను దయతో పరిష్కరించడం లేదనే వాదన వినిపిస్తోంది.