|
అసలేం జరిగిందంటే..?
మంగళవారం జరిగిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ 15వ ఓవర్లో థర్డ్ అంపైర్ ఇచ్చిన నిర్ణయం వివాదాస్పదమైంది. కివీస్ యువ బౌలర్ కైల్ జేమీసన్ వేసిన ఆ ఓవర్లో బంగ్లా ఓపెనర్ తమీమ్ ఇక్బాల్.. స్ట్రైట్ డ్రైవ్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ ఆరడగుల 8 అంగుళాల ఎత్తుండే జేమీసన్ ముందుకు దూకి దాన్ని రిటర్న్ క్యాచ్గా పట్టేశాడు.
అయితే బంతి పట్టే క్రమంలో నేలకు తాకిందనే విషయంలో అనుమానంగా ఉన్న ఫీల్డ్ అంపైర్ సాఫ్ట్ సిగ్నల్ ఔట్ ఇస్తూ.. థర్డ్ అంపైర్ సమీక్ష కోరాడు. ఈ క్యాచ్ను పలుకోణాల్లో పరిశీలించిన థర్డ్ అంపైర్.. ''బంతి నేలను తాకినట్లు కనిపిస్తోంది. ఆటగాడు కూడా పూర్తిగా కంట్రోల్లో లేడు'' అని పేర్కొంటూ నాటౌట్ ఇచ్చాడు.
అంపైర్ బిత్తిరి నిర్ణయం..
అయితే వీడియోలో బంతి నేలకు తాకినట్లు కనిపించకపోవడంతో ఈ నిర్ణయంపై దుమారం రేగింది. క్యాచ్ పట్టిన తర్వాత కూడా అతను పూర్తి నియంత్రణలోనే ఉన్నట్లు కనిపిస్తోంది. కానీ థర్డ్ అంపైర్ మాత్రం భిన్నంగా ఔటివ్వడంతో ఆటగాళ్లతో పాటు మ్యాచ్ చూస్తున్న ప్రేక్షకులు అవాక్కయ్యారు. ఇదో బిత్తిరి నిర్ణయమంటూ సోషల్ మీడియా వేదికగా మండిపడుతున్నారు.
అంపైర్ నిద్రపోయాడని, ఇది పూర్తి ఏకపక్ష నిర్ణయమంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్లారిటీ లేనప్పుడు నిబంధనల ప్రకారం అంపైర్ సాఫ్ట్ సిగ్నల్కు కట్టుబడి ఉండాలి కదా? అని నిలదీస్తున్నారు. అయితే మరికొంతమంది మాత్రం అది నాటౌటని వాదిస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయింది.
టామ్ లాథమ్ సెంచరీ..
అంపైర్ తప్పుడు నిర్ణయంతో 38 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔటయ్యే ప్రమాదం తప్పించుకున్న తమీమ్ ఇక్బాల్ 78 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ 5 వికెట్లతో గెలుపొంది మూడు వన్డేల సిరీస్ను న్యూజిలాండ్ మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో కైవసం చేసుకుంది.
తొలుత బంగ్లా 50 ఓవర్లలో 6 వికెట్లకు 271 పరుగులు చేసింది. కెప్టెన్ తమీమ్ ఇక్బాల్తో పాటు మిడిలార్డర్లో మిథున్ ( 57 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్లతో 73 నాటౌట్) రాణించాడు. అనంతరం కివీస్ టామ్ లాథమ్(108 బంతుల్లో 10 ఫోర్లతో 110 నాటౌట్) అజేయ సెంచరీతో 48.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది.
కోహ్లీ అసహనం..
ఇటీవల అంపైర్లు చేస్తున్న తప్పిదాలపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పెదవి విరిచిన విషయం తెలిసిందే. అంపైర్స్ కాల్, సాఫ్ట్ సిగ్నల్ నిబంధనలను మార్చాలని కోరాడు.
బాల్ ట్రాకింగ్లో బంతి వికెట్లకు కొద్దిగా తాకుతున్నట్లు కనిపించాని ఎల్బీడబ్ల్యూ ఔట్ ఇవ్వాలన్నాడు. ప్రస్తుతం అంపైర్లు ఇస్తున్న నిర్ణయాలు తికమక పెడుతున్నాయని, తలనొప్పిగా మారయని విమర్శించాడు.
అలాగే సాఫ్ట్ సిగ్నల్ విషయంలో అంపైర్లు 'నాకు తెలియదు'అని చెప్పేలా నిబంధనను మార్చాలన్నాడు. ఔట్ విషయంలో సందేహంగా ఉండటంతోనే థర్డ్ అంపైర్ సమీక్షకు వెళ్తారని, అలాంటప్పుడు సాఫ్ట్ సిగ్నల్గా ఔటివ్వడంలో అర్థం లేదన్నాడు.