అహ్మదాబాద్: అంతర్జాతీయ క్రికెట్లో తమ విధ్వంసకర బ్యాట్స్మన్ డేవిడ్ మలన్ ఆటను తలచుకుంటే భయమేస్తుందని ఇంగ్లండ్ లిమిటెడ్ ఓవర్ల కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ అన్నాడు. గతేడాది టీ20 క్రికెట్లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన మలన్ ప్రస్తుతం ఈ ఫార్మాట్లో నంబర్ వన్ ఆటగాడిగా కొనసాగుతున్నాడు. కాగా, నేటి నుంచి ఇంగ్లండ్.. టీమిండియాతో ఐదు టీ20ల సిరీస్ ఆడనున్న నేపథ్యంలోనే మోర్గాన్ తొలి మ్యాచ్కు ముందు గురువారం మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా మలన్ గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అతని ఆటపై ప్రశంసల జల్లు కురిపించాడు.
'మలన్ ఆటతో ఎంత దూరం వెళ్తాడో నాకు తెలియదు. ఇప్పటివరకు అంతర్జాతీయ క్రికెట్లో అతని ప్రదర్శన అత్యద్భుతం. అతను ఇలాగే కొనసాగితే ఏం చేస్తాడోనని భయమేస్తుంది. ఈసారి ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ అతన్ని కొనుగోలు చేసింది. దాంతో భారత్లో ఆడుతూ ఇక్కడ తన అనుభవాన్ని కొనసాగిస్తాడు. రాబోయే రోజుల్లో టీ20 ప్రపంచకప్ ఉండడం.. మలాన్ పంజాబ్కు ఆడటం మాకు కలిసివస్తుంది' అని మోర్గాన్ పేర్కొన్నాడు.
ఇక ఈ సిరీస్పై స్పందిస్తూ.. ప్రపంచకప్కు ముందు ఈ సిరీస్ ఆడటం వల్ల తాము ఏ స్థాయిలో ఉన్నామో తెలుస్తుందని చెప్పాడు. ప్రపంచంలోనే మేటి జట్టు అయిన టీమిండియాతో తలపడుతున్నామని, ఆ జట్టును ఓడించడం అంతతేలిక కాదనే విషయం తమకు తెలుసన్నాడు. దీంతో రాబోయే సిరీస్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు మోర్గాన్ చెప్పుకొచ్చాడు. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ మైదానం వేదికగా రాత్రి 7.30 గంటలకు భారత్-ఇంగ్లండ్ తొలి టీ20 ప్రారంభంకానుంది.