పడిక్కల్ బ్యాటింగ్ను ఎంజాయ్ చేశా.. లెఫ్ట్హ్యాండ్ బ్యాట్స్మెన్ ఆటతీరును ఆస్వాదించా: గంగూలీ

దుబాయ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ద్వారా మరో భారత కుర్రాడు క్రికెట్ ప్రపంచానికి పరిచయమయ్యాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ఆడుతున్న కేరళ యువ ఆటగాడు దేవదూత్ పడిక్కల్ అరంగేట్ర ఐపీఎల్ మ్యాచ్లోనే అదరగొట్టాడు. సన్రైజర్స్ హైదరాబాద్తో సోమవారం జరిగిన మ్యాచ్లో పడిక్కల్ ఓపెనర్గా బరిలోకి (56; 42 బంతుల్లో 8x4) పరుగుల వరద పారించాడు. సన్రైజర్స్ బౌలర్లపై దాడికి దిగి బౌండరీల వర్షం కురిపించాడు. దూకుడుగా ఆడుతూ 36 బంతుల్లోనే హాఫ్సెంచరీ చేశాడు. దీంతో 20 ఏళ్ల పడిక్కల్ అందరి దృష్టిని ఆకర్షించాడు.

చాలా ఎంజాయ్ చేశా:
దేవదూత్ పడిక్కల్ ఆటను తాను ఎంతగానో ఆస్వాదించినట్లు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అన్నారు. తొలి మ్యాచ్లోనే అద్భుత ఆటతీరుతో అలరించాడని దాదా ట్విటర్లో ప్రశంసించారు. 'దేవదూత్ పడిక్కల్ బ్యాటింగ్ను చూస్తూ చాలా ఎంజాయ్ చేశా. లెఫ్ట్హ్యాండ్ బ్యాట్స్మెన్ ఆటతీరు ఆస్వాదించా. బాగా ఆడాడు' అని సౌరవ్ ట్వీట్ చేశారు. పడిక్కల్ స్ఫూర్తిదాయక ప్రదర్శన, బ్యాటింగ్ స్టైల్ను మాజీ క్రికెటర్లు మెచ్చుకున్నారు. ఆత్మవిశ్వాసంతో ఇన్నింగ్స్ను ఆరంభించడం గొప్ప విషయమని పలువురు కొనియాడారు.

మరిన్ని ఆసక్తికర మ్యాచ్లు చూస్తాం:
ఐపీఎల్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోందని, రాబోయే రోజుల్లో మరిన్ని ఆసక్తికర మ్యాచ్లు చూస్తామని గంగూలీ ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం జరుగుతున్న లీగ్ సహా నవంబర్ 1వ తేదీ నుంచి మొదలు కానున్న మహిళల టీ20 ఛాలెంజ్ టోర్నీలో మరిన్ని ఉత్కంఠభరిత మ్యాచ్లు ఉంటాయన్నారు. 'ఇప్పటికి మూడు మంచి మ్యాచ్లు చూశాం. రానున్న 60 రోజుల్లో పురుషులు సహా మహిళల క్రికెట్ పోటీల్లో అనేక ఆసక్తికర మ్యాచ్లు చూడబోతున్నాం' అని మరో ట్వీట్ చేశారు.

మరింత ఆకట్టుకున్న ఢిల్లీ-పంజాబ్ మ్యాచ్:
యూఏఈలో జరుగుతున్న ఐపీఎల్ 2020లో ఇప్పటివరకు జరిగిన మూడు మ్యాచ్లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. సెప్టెంబర్ 19న చెన్నై-ముంబై జట్ల మధ్య జరిగిన మొదటి పోరులో చెన్నై 5 వికెట్ల తేడాతో ప్రత్యర్థి జట్టుపై విజయం సాధించింది. అంతర్జాతీయ క్రికెట్ నుంచి ఈమధ్యే వీడ్కోలు పలికిన టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీని మళ్లీ మైదానంలో చూసి ప్రేక్షకులు సంబరపడిపోయారు. భారీ అంచనాలు లేని ఢిల్లీ-పంజాబ్ జట్ల మధ్య జరిగిన పోరు ప్రేక్షకులను మరింత ఆకట్టుకుంది. చివరి రెండు బంతుల్లో ఒక్క పరుగు చేసి గెలుపొందాల్సిన మ్యాచ్లో పంజాబ్ అనూహ్యంగా రెండు వికెట్లు కోల్పోయి మ్యాచ్ను డ్రా చేసుకుంది. దీంతో సూపర్ ఓవర్కు దారితీసింది. ఆ సూపర్ ఓవర్లో ఢిల్లీ విజేతగా నిలిచింది.

ఆసక్తిగానే హైదరాబాద్-బెంగళూరు మ్యాచ్:
సోమవారం హైదరాబాద్-బెంగళూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ కూడా ఆసక్తిగానే సాగింది. విజయం ముంగిట నిలిచిన హైదరాబాద్.. తడబడి చివర్లో బోర్లాపడింది. బౌలింగ్లో మొదట తడబడి చివర్లో పుంజుకొని ప్రత్యర్థిని 163 స్కోరుకే పరిమితం చేసిన హైదరాబాద్.. బ్యాటింగ్ జోరు చూస్తే గెలిచేలా కనిపించింది. కానీ చివర్లో బెంగళూరు బౌలర్లు చెలరేగడంతో వికెట్లు చేజార్చుకొని ఓటమి చవిచూసింది. ఈ రోజు మ్యాచ్ కూడా రసవత్తరంగానే సాగనుంది.
RR vs CSK: సోదరుల యుద్ధం.. రాయల్స్కు అన్న.. చెన్నైకి తమ్ముడు!!
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications