
సౌతాంప్టన్: కరోనా రక్కసితో ఆగిపోయిన క్రికెట్.. 117 రోజుల తర్వాత వెస్టిండీస్-ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్తో రీస్టార్ట్ అయింది. మూడు టెస్ట్ల సిరీస్లో భాగంగా తొలి మ్యాచ్ బుధవారం సౌతాంప్టన్ వేదికగా ప్రారంభమైంది. ప్రేక్షకుల్లేకుండా.. ఐసీసీ కోవిడ్ నిబంధనల మధ్య ఆటగాళ్లు ఉత్సాహంగా బరిలోకి దిగారు. ఇక జాతి వివక్షకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమానికి మద్దతు తెలిపిన వెస్టిండీస్ ఆటగాళ్లు ఈ మ్యాచ్లో బ్లాక్ లైవ్స్ మ్యాటర్ లోగోతో బరిలోకి దిగుతామని ప్రకటించారు.
జాతి వివక్షకు వ్యతిరేకంగా సాగుతున్న ఈ కార్యక్రమంలో భాగమయ్యేందుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) విండీస్ జట్టుకు ప్రత్యేక అనుమతి కూడా ఇచ్చింది.
ఇక ఇంగ్లండ్ జట్టు కూడా తాము కూడా బ్లాక్ లైవ్స్ మ్యాటర్ లోగోతో బరిలోకి దిగుతామని ముందుకొచ్చింది. అన్నట్టుగానే ఇరు జట్లు కాలర్పై ఈ లోగోతో మైదానంలోకి అడుగుపెట్టాయి. ఇక మ్యాచ్ ప్రారంభానికి ముందు ఇరు జట్ల ఆటగాళ్లు మోకాళ్లపై కూర్చొని పిడికిలి పైకెత్తి జాతి వివక్షపై తమ నిరసనను వ్యక్తం చేశారు.
అమెరికాలో నల్ల జాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ హత్యానంతరం 'బ్లాక్ లైవ్స్ మ్యాటర్' పేరుతో ప్రపంచవ్యాప్తంగా సాగుతున్న ఉద్యమానికి విండీస్-ఇంగ్లండ్ ఆటగాళ్లు క్రికెట్ మైదానంలో సంఘీభావం తెలిపారు. అంతకు ముందు కరోనా మహమ్మారితో చనిపోయిన వారికి, ఇటీవల తుదిశ్వాస విడిచిన వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం ఎవర్ట్ వీక్స్కు మౌనం పాటించి నివాళులు అర్పించారు.
ఇక ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆతిథ్య జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. కరోనా నేపథ్యంలో అత్యంత సురక్షితమైన బయో సెక్యూర్ వాతావరణంలో ఈ మ్యాచ్ జరగుతుంది. జోరూట్ గైర్హాజరీతో బెన్ స్టోక్స్ ఇంగ్లండ్ జట్టు నడిపించనుండగా.. జాసన్ హోల్డర్ సారథ్యంలో విండీస్ బరిలోకి దిగింది. ఇన్నాళ్ల తర్వాత ప్రారంభమైన ఆటలో తొలి ఓవర్ కెమర్ రోచ్ వేయగా.. ఇంగ్లండ్ ఓపెనర్ రోరీ బర్న్స్ తొలి బంతిని ఎదుర్కొన్నాడు. ఇక ఇంగ్లండ్కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. రెండో ఓవర్ నాలుగో బంతికే ఆ జట్టు ఓపెనర్ డీపీ సిబ్లే(0) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ప్రస్తుతం క్రీజులో జో డెన్లీ(0), రోరీ బర్న్స్(1) ఉన్నారు.