143 ఏళ్ల చరిత్రలో ఇదే తొలిసారి
కరోనా వైరస్ వ్యాప్తి ముప్పు పొంచివుండటంతో ఈ సిరీస్ను ఇంగ్లండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఆటగాళ్ల రక్షణే ప్రధాన ద్యేయంగా బయో సెక్యూర్ వాతావరణంలో ఈ సిరీస్ ఈసీబీ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. స్టేడియాల్లోకి ప్రేక్షకులను అనుమతించకుండా ఈసీబీ మ్యాచ్లను నిర్వహిస్తోంది. అభిమానుల్లేకుండా మ్యాచ్ జరగడం 143 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి కావడం విశేషం.
సురక్షిత వాతావరణంలో
కొన్నాళ్ల క్రితమే బయట ప్రపంచంతో ఆటగాళ్లకు సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. వైరస్ బారిన పడకుండా సురక్షిత వాతావరణంలో ఉన్నారు. ఈ టెస్ట్ సిరీస్ ముందు ఇరు జట్ల ఆటగాళ్లు క్వారంటైన్లో ఉన్నారు. ఆ తర్వాత కరోనా టెస్టులు చేసి తొలి టెస్టుకు జట్లను ఎంపిక చేసారు. ఇక ఐసీసీ కూడా కొత్త రూల్స్ తీసుకొచ్చింది. బంతిపై ఉమ్ము రుద్దడాన్ని నిషేధించింది. ఒకవేళ పొరపాటుగా రుద్దితే తొలిసారికి అంపైర్లు వదిలేస్తారు. రెండుకన్నా ఎక్కువసార్లు చేస్తే.. జరిమానాగా ప్రత్యర్థి జట్టుకు ఐదు పరుగులు ఇస్తారు.
శానిటేషన్ బ్రేక్లు కూడా
మాములుగా ఒక టెస్టులో డ్రింక్స్ బ్రేక్, టీ బ్రేక్, లంచ్ బ్రేక్ ఉంటాయని మనందరికీ తెలిసిన విషయమే. అయితే కొత్తగా శానిటేషన్ బ్రేక్లు కూడా వస్తున్నాయి. అంటే.. ఆట మధ్యలో క్రికెటర్లంతా హ్యాండ్ శానిటైజర్లు రుద్దుకోవాలి. ఆటగాళ్లు ఉపయోగించే వస్తువులపై కూడా శుభ్రకాలు చల్లుతారని సమాచారం. ఇక రిజర్వు ఆటగాళ్లే బాల్ బాయ్స్గా ఉంటారు. మరోవైపు ప్రత్యక్ష ప్రసారాలు అందించేవారు పీపీఈ కిట్లు ధరించే ఉంటారు. అంపైర్లుగా స్థానికులేఉండనున్నారు.
ఖాళీ మైదానాలు.. బోసిపోయిన స్టాండ్స్:
గతంలో లాగా క్రికెట్ ఉండదు ఇప్పుడు. ఖాళీ మైదానాలు.. బోసిపోయిన స్టాండ్స్ కనిపిస్తాయి. వికెట్ పడితే విభిన్నంగా సంబురాలు ఉంటాయి. ఇక క్యాచ్ పడితే అభినందనలు ఉండవు. కరోనా వ్యాప్తి చెందకుండా బంతిపై మెరుపు కోసం వాడే ఉమ్మి (సలైవా) కూడా ఉండదు. వర్ణవివక్షకు వ్యతిరేకంగా ఈ మ్యాచ్లో ఇరు జట్ల ఆటగాళ్లు 'బ్లాక్ లివ్స్ మ్యాటర్' లోగోతో బరిలో దిగనున్నారు. అమెరికా పోలీసు దౌర్జన్యం కారణంగా ప్రాణాలొదిలిన అమెరికన్-ఆఫ్రికన్ జార్జ్ ఫ్లాయిడ్ మృతికి సంతాపంగా ప్లేయర్ల జెర్సీ కాలర్లపై ఈ లోగో కనిపించనుంది.