లండన్: కరోనా వైరస్ కట్టడికి యావత్ ప్రపంచం పోరాడుతుంది. ఇందులో భాగంగా దేశాలన్నీ లాక్డౌన్ పాటిస్తున్నాయి. ఇక ఈ వైరస్ బారిన పడిన బాధితుల కోసం అహర్నిశలు శ్రమిస్తున్న హెల్త్ కేర్ సిబ్బందికి ప్రతీచోటా ఘనమైన సంఘీభావం లభిస్తుంది. కొన్ని రోజుల క్రితమే వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులతో పాటు అత్యవసర సేవల్లో ఉన్న వారికి యావత్ భారతావని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు కృతజ్ఞలు తెలిపింది. ఇప్పుడు ఇంగ్లండ్లో కూడా హెల్త్ సర్వీసుల్లోను సిబ్బందికి ఇదే తరహా సంఘీభావం తెలిపారు.
ఒక బ్రిడ్జిపై జనం నిలబడి చప్పట్లతో డాక్టర్లను అభినందించారు. అయితే అధిక సంఖ్యలో ప్రజలు వీధుల్లోకి రావడాన్ని ఇంగ్లండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ తప్పుబట్టాడు.
'కరోనాపై పోరాటంలో నేషనల్ హెల్త్ సర్వీస్ల్లో ఉన్నవారికి అండగా నిలవాల్సిన సమయం ఇది. వారి సేవల్ని మరవలేము. కానీ ఇలా వీధుల్లోకి వచ్చి చప్పట్లు కొట్టడం మాత్రం సరైనది కాదు. భౌతిక దూరం పాటించకుండా ఇలా గుమిగూడటం ఏ మాత్రం ఆహ్వానించదగిన విషయం కాదు. ఇలా చేయడం వల్ల మిగతా ప్రజల్ని ప్రమాదంలోకి నెట్టినట్లు అవుతుంది'అని అసహనం వ్యక్తం చేస్తూ స్టోక్స్ ట్వీట్ చేశాడు.
నేనేం దేశాన్ని అమ్మలేదు.. వారి గురించి మాట్లాడే ధైర్యం ఉందా: కనేరియా
ఇక ఇంగ్లండ్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్యం లక్ష దాటింది. దీంతో అక్కడ కూడా భౌతిక దూరాన్ని తప్పనిసరి చేశారు. కానీ ప్రభుత్వ నిబంధనల్ని ఉల్లంఘించడంతో స్టోక్స్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. కరోనా మహమ్మారిని తరిమికొట్టాలంటే సోషల్ డిస్టెన్సింగ్ అనేది తప్పనిసరి అనే విషయం తెలుసుకోవాలన్నాడు. ప్రభుత్వం ఇచ్చిన ఈ పిలుపునకు ఆ దేశ క్రికెటర్లు సైతం మద్దతుగా నిలుస్తున్నారు. ప్రతీ ఒక్కరూ ప్రభుత్వ నిబంధనలను పాటించాలంటూ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.